
ఎంత ఘాటు ప్రేమయో.. సుదీర్ఘ నిరీక్షణ ఫలించి 65 ఏళ్ల వయసులో పెళ్లి
ప్రేమ ఎంత బలీయమైందో చెప్పడానికి వారిద్దరి పెళ్లే నిదర్శనం! ఇద్దరి వయస్సూ 65 సంవత్సరాలు. ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయస్సులో మరొకరితో పెళ్లయింది. ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు. కొంత కాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటినుంచి ఇద్దరూ తమ పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ వేర్వేరుగానే ఉంటూ వచ్చారు. చివరకు సమాజాన్ని, కట్టుబాట్లను కాదని 65 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. గురువారం కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెలో ఈ పెళ్లి జరిగింది. మేలుకోటె చెలువనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ (ఇద్దరికీ 65 ఏళ్లే) శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపించారు. ఇప్పుడీ లేటు వయసు పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
- న్యూస్టుడే, మండ్య