బోర్ల కింద వరి వద్దు

బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి పండిస్తే వచ్చే ఆదాయం.. చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చేలా ...

Published : 07 Dec 2021 05:18 IST

వ్యవసాయ అనుబంధ రంగాల సమీక్షలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి పండిస్తే వచ్చే ఆదాయం.. చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చేలా చూడాలి. దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరుధాన్యాల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వాటిని అధికంగా పండించే ప్రాంతాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా చూడాలని సూచించారు.  ‘ఏపీలో ఎక్కడైనా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్ని రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి. రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయాలి. అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం’ అని జగన్‌ స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాలను నీరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఉద్యోగుల ప్రమేయం ఉంటే వారిని తొలగించడమే కాకుండా.. చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వ్యాపారులపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్గానిక్‌ పాల మార్కెటింగ్‌పై దృష్టి పెట్టి, రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఖరీఫ్‌లో 45.35 లక్షల మంది రైతులకు చెందిన 1.12 కోట్ల ఎకరాలను ఈ-క్రాప్‌ చేశామని, రబీలోనూ ప్రక్రియ మొదలైందని అధికారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని