ఉపాధ్యాయుల పరస్పర బదిలీకి బేరాలు!
సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించిన నేపథ్యంలో సొంత జిల్లాలు దక్కని ఉపాధ్యాయులు కొందరు కోరుకున్న జిల్లాకు వచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. మారుమూల జిల్లాలైనా సొంత జిల్లాలకు వెళ్లే వారి గురించి ఆరా తీస్తున్నారు. పరస్పర బదిలీ కింద వారు
రూ. 3 - 6 లక్షల వరకు చెల్లించేందుకు మౌఖిక ఒప్పందాలు
సర్కారు అనుమతిచ్చే అవకాశం ఉందని పలువురి సంప్రదింపులు
ఈనాడు, హైదరాబాద్: సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించిన నేపథ్యంలో సొంత జిల్లాలు దక్కని ఉపాధ్యాయులు కొందరు కోరుకున్న జిల్లాకు వచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. మారుమూల జిల్లాలైనా సొంత జిల్లాలకు వెళ్లే వారి గురించి ఆరా తీస్తున్నారు. పరస్పర బదిలీ కింద వారు ఆ జిల్లాలకు వెళితే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ముట్టజెప్పేలా కొందరు సంప్రదింపులు జరుపుతున్నారు. మరికొందరు మౌఖిక ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పరస్పర బదిలీలకు అనుమతించినా ఖాళీలు, కేడర్లో మార్పు ఉండదు కాబట్టి సర్కారు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. తుది నిర్ణయం వెలువడితే వెంటనే దరఖాస్తులు సమర్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
లెక్కలు వేసుకొని మరీ ధర చెబుతున్నారు!
రాష్ట్రవ్యాప్తంగా 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వారిలో సుమారు 23 వేల మంది ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాను వదిలి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. సీనియారిటీ ఉన్న వారికి సొంత జిల్లా కాకున్నా డిమాండ్ ఉన్న అర్బన్ జిల్లాలు దక్కాయి. జూనియర్లు ఎక్కువగా సొంత జిల్లాను వదిలి మారుమూల జిల్లాకు వెళ్లారు. భార్యాభర్తల విభాగంలో ఒకే జిల్లాకు వద్దామనుకున్న వారికి ప్రభుత్వం ఈసారి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులను ఈసారి స్పౌస్ కేటగిరీ కింద పరిగణించలేదు. డిమాండ్ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబ్నగర్ తదితర 13 అర్బన్ జిల్లాలకు ఆ కేటగిరీ ఉపాధ్యాయులు రాకుండా బ్లాక్ చేశారు. ఈ పరిస్థితుల్లో భార్యాభర్తలు ఒకేచోటకు రావాలన్నా, సొంత జిల్లాకు రావాలన్నా ఒకే ఒక మార్గం పరస్పర బదిలీ (మ్యూచువల్)లే. దానివల్ల ఖాళీల్లో మార్పులు ఉండవు. కొత్త నియామకాలకు ఇబ్బంది ఉండొద్దు. ఒకరు వెళ్లిపోతే...అదే సబ్జెక్టు/కేడర్ వారు ఆ స్థానానికి వస్తారు. అందుకు ఇద్దరు పరస్పరం అంగీకారం తెలపాలి. అర్బన్ జిల్లాను వదిలి మరో గ్రామీణ జిల్లాకు వెళితే హెచ్ఆర్ఏ తగ్గిపోతుంది... ఇంకా ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది... మొత్తం చూసుకుంటే ఎన్ని లక్షలు నష్టపోవాల్సి వస్తోందో లెక్కలు వేస్తున్నారు. అందుకే ఆ మొత్తం ఇచ్చేందుకు కొందరు ముందుకు వస్తున్నట్లు సమాచారం. మొత్తానికి డిమాండ్ను బట్టి ఈ ధర రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పలుకుతున్నట్లు తెలిసింది. ఒక మహిళా ఉపాధ్యాయురాలిని మేడ్చల్ నుంచి వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. ఆమె భర్త హైదరాబాద్లో బ్యాంకు ఉద్యోగి. ఈ క్రమంలో ఆమె మేడ్చల్ జిల్లాకు వచ్చేందుకు అదే జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడిని సంప్రదించారు. అందుకు ఆయన రూ.3 లక్షలు అడిగినట్లు సమాచారం. ఆ ఉపాధ్యాయుడి సొంత జిల్లా వికారాబాదే. త్వరలో పదవీ విరమణ పొందనుండడంతో వికారాబాద్ వెళ్లేందుకు ఆయన అంగీకరించినట్లు తెలిసింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపడమే తరువాయి వందల మంది ఉపాధ్యాయులు జిల్లాలు మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు మారుమూల జిల్లాలకు వెళ్లేందుకూ ఆసక్తి చూపుతుంటారని చెబుతున్నారు. ముందుగా కొంత చెల్లించి బదిలీ పూర్తయ్యాక ఒప్పందం మేరకు మొత్తాన్ని ముట్టజెప్పనున్నారని తెలుస్తోంది.
ప్రత్యేక వాట్సప్ గ్రూపులు
పరస్పర బదిలీలకు ఆసక్తి ఉన్నవారితో రాష్ట్రవ్యాప్తంగా కొందరు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తమకు కేటాయించిన జిల్లా? కోరుకుంటున్న జిల్లా? హోదా, సబ్జెక్టు, ఫోన్ నంబరు తదితర వివరాలను అందులో పొందుపరుస్తున్నారు. ఆయా జిల్లాల్లో తెలిసిన ఉపాధ్యాయులను కూడా ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!