
అడ్రస్ మారింది.. ఆసరా పోయింది!
గోనెగండ్ల, న్యూస్టుడే: తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. అంధులైన కుమారులూ వెంట వెళ్లారు. దీంతో అడ్రస్ మారిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి పింఛను తొలగించింది. తెలంగాణ సర్కారేమో అక్కడే తేల్చుకోవాలంటోంది. ఇదీ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామ అంధ యువకుల గోడు. కూలీలైన కిష్టప్ప, లింగమ్మ దంపతుల కుమారులు శ్రీశైలం, శివయ్య. కవలలైన ఈ ఇద్దరూ పుట్టంధులు. వీరికి 16 ఏళ్లుగా ఏపీలో వికలాంగుల పింఛను వచ్చేది. ఉపాధి కోసమని కిష్టప్ప కుటుంబంతో సహా హైదరాబాద్లోని నిజాంపేటకు వెళ్లారు. పిల్లలిద్దర్నీ అక్కడే డిగ్రీ చదివిస్తున్నారు. అప్పుడప్పుడు సొంతూరుకు వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆర్నెల్లుగా పిల్లలకు వస్తున్న సామాజిక పింఛను ఆగిపోయింది. ఏపీ అధికారులను అడిగితే.. ‘కొత్త నిబంధనలు వచ్చాయి. ఆధార్ కార్డులో తెలంగాణ చిరునామా ఉండటంతో స్థానికులు కాదని పింఛను తొలగించాం’ అంటున్నట్లు ఆ సోదరులు ఆవేదన చెందారు. నిజాంపేటలో అధికారులను సంప్రదిస్తే.. ‘ఇక్కడ రావడం కష్టం అక్కడే తీసుకోండి’ అన్నారని తెలిపారు. పింఛను మంజూరు చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.