
‘ఆన్లైన్’ విద్యావిధానంతో కొత్త ఒరవడి
‘విజ్ఞాన్’ కోర్సుల ప్రారంభ కార్యక్రమంలో ఏపీ మంత్రి సురేష్
‘విజ్ఞాన్’ ఆన్లైన్ కోర్సులను ప్రారంభిస్తున్న మంత్రి సురేష్, విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్ రత్తయ్య తదితరులు
పొన్నూరు, న్యూస్టుడే: భవిష్యత్తులో ‘ఆన్లైన్’ విద్యా విధానం కొత్త ఒరవడి సృష్టించనుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఆన్లైన్ డిగ్రీ కోర్సుల కార్యక్రమం ‘విజ్ఞాన్స్ ఆన్లైన్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ‘ఆన్లైన్ లెర్నింగ్’ అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యావిధానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడంలో విజ్ఞాన్ విద్యాసంస్థలు ఎప్పుడూ ముందు వరసలో ఉంటాయన్నారు. రాష్ట్రంలో విద్యావిధానాన్ని ‘బ్రిక్స్’ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ యాదవ్, విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయులు, ఇన్ఛార్జి ఉప కులపతి కేవీ కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.