ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోరు.. తెలంగాణలో చేర్చుకోరు

‘‘మేము ఆప్షన్‌ ఇవ్వకున్నా  ఆంధ్రప్రదేశ్‌లో రిలీవ్‌ చేశారు..తెలంగాణలో చేర్చుకోవడం లేదు. వేతనాలు లేక అల్లాడుతున్నాం. అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో చూపించుకోలేని పరిస్థితి. అప్పులు సైతం దొరకట్లేదు. రెండు ప్రభుత్వాలు మా విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి’’ అని పలువురు విద్యుత్తు ఉద్యోగులు కోరారు. ఏపీకి వెళ్దామంటే అక్కడా తీసుకోవడం లేదని వాపోయారు. కొందరికి 19 నెలలుగా, మరికొందరికి 13 నెలలుగా జీతాలు లేవని పలువురు మహిళా ఉద్యోగులు

Published : 22 Jan 2022 05:26 IST

ఉద్యోగం ఉన్నా 19 నెలలుగా జీతాల్లేవు  
కంటతడి పెట్టిన పలువురు విద్యుత్తు ఉద్యోగులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ‘‘మేము ఆప్షన్‌ ఇవ్వకున్నా  ఆంధ్రప్రదేశ్‌లో రిలీవ్‌ చేశారు..తెలంగాణలో చేర్చుకోవడం లేదు. వేతనాలు లేక అల్లాడుతున్నాం. అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో చూపించుకోలేని పరిస్థితి. అప్పులు సైతం దొరకట్లేదు. రెండు ప్రభుత్వాలు మా విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి’’ అని పలువురు విద్యుత్తు ఉద్యోగులు కోరారు. ఏపీకి వెళ్దామంటే అక్కడా తీసుకోవడం లేదని వాపోయారు. కొందరికి 19 నెలలుగా, మరికొందరికి 13 నెలలుగా జీతాలు లేవని పలువురు మహిళా ఉద్యోగులు కంటతడి పెట్టారు. అందరినీ కలిసి అలసిపోయి టీఎస్‌ యాస్పిరెంట్స్‌ ఫోరంగా ఏర్పడి మీడియా ముందుకు వచ్చామన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం కన్వీనర్‌ టీవీరావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందన్నారు. అప్పటి ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి 2015 వరకూ విభజన చేయలేదన్నారు. ఏపీ సరిగా స్పందించకపోగా, తెలంగాణకు ఆప్షన్‌ ఇవ్వని 84 మంది ఉద్యోగులను బలవంతంగా ఇక్కడికి పంపారని తెలిపారు. విద్యుత్తు సంస్థల్లో ఏపీకి చెందిన ఉద్యోగులే అధికంగా ఉండటంతో సమస్య జటిలమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. లేని పక్షంలో రెండు రాష్ట్రాల యాజమాన్యాలు చెరి సగం చొప్పునైనా ఇవ్వాలని కోరారు. సమావేశంలో విద్యుత్తు సంస్థల్లో వివిధ అధికార హోదాల్లో పనిచేసిన పద్మజ, పరిమళ, శేషగిరిరావు, వెంకటరమణ, శ్రీలక్ష్మి, సైదులు, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని