
సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లాలి
గణతంత్ర దినోత్సవ సందేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రాల హక్కులను మరింతగా సంరక్షించటం వల్లే భారత ప్రజాస్వామ్య ఖ్యాతి దశ దిశలా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలియజేస్తూ ఇచ్చిన సందేశంలో సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం... భారతపౌరుల విశ్వ మానవ తత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పథానికి ప్రతీక. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను మరింతగా బలోపేతం చేసేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలను పొందుపరిచారు. మనదేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. రాష్ట్రాల హక్కులను పరిరక్షించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత దృఢమవుతుంది. నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం.. రాజ్యాంగం అందించిన సమాఖ్య స్ఫూర్తిని ప్రారంభం నుంచీ ప్రదర్శిస్తోంది. రాజకీయాలు, పరిపాలనను మిళితం చేయకుండా తెలంగాణ నెరపుతున్న రాజ్యాంగబద్ధమైన రాజనీతి నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రాజ్యాంగ నిర్మాతలు అందించిన సమాఖ్యస్ఫూర్తిని మరింత దృఢంగా కొనసాగించేందుకు కంకణబద్ధులమై ఉందాం. అందుకు అచంచల విశ్వాసంతో ప్రతినబూనుదాం’’ అని సీఎం పేర్కొన్నారు.