
ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల విజయం ఇది..
టీకా పంపిణీలో కరీంనగర్ ఆదర్శం
మంత్రి గంగుల ప్రశంస
ఈనాడు డిజిటల్, కరీంనగర్: ప్రాణాలను లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో వైద్యసిబ్బంది కనబర్చిన సేవలతోనే కరీంనగర్ జిల్లా రెండో డోసు టీకా పంపిణీలో ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం రెండో డోస్ వ్యాక్సినేషన్ శతశాతం పూర్తయిన తొలి జిల్లాగా కరీంనగర్ ఖ్యాతిని అందుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవంలో ఆయన మాట్లాడారు. టీకాలను శరవేగంగా అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో సమష్టి కృషితో ఈ గుర్తింపును అందుకున్నామన్నారు. ఇదంతా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల విజయమన్నారు. వేడుకలో భాగంగా భారీ సిరంజిని మంత్రి ఆవిష్కరించారు. శతశాతం ప్రగతిలో ఆదర్శంగా పనిచేసిన అయిదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తనవంతుగా రూ.లక్ష చొప్పున రూ.5లక్షలను మంత్రి అప్పటికప్పుడు ప్రోత్సాహక నగదును వైద్య సిబ్బందికి అందించారు.