Hyderabad: హైదరాబాద్.. ఇంకా ఉంది
లక్ష్యం 194. ముంబయి 17 ఓవర్లకు చేసిన స్కోరు 149/5. విజయానికి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాలి. మామూలుగా చూస్తే ఇదంత తేలిక కాదు...
ఉత్కంఠ పోరులో ముంబయిపై గెలుపు
డేవిడ్ పోరాటం వృథా
మెరిసిన త్రిపాఠి, ఉమ్రాన్
లక్ష్యం 194. ముంబయి 17 ఓవర్లకు చేసిన స్కోరు 149/5. విజయానికి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాలి. మామూలుగా చూస్తే ఇదంత తేలిక కాదు. కానీ టిమ్ డేవిడ్ దాన్ని తేలిగ్గా మార్చేశాడు. 18వ ఓవర్లో అయిదు బంతుల్లో నాలుగుసార్లు బంతిని స్టాండ్స్లో పడేశాడు. 13 బంతుల్లో 19 పరుగులతో ఒక్కసారిగా సమీకరణం సులువైపోయింది. ముంబయి విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ తర్వాతి ఓవర్లో స్ట్రైక్ కోసమని.. చివరి బంతికి లేని పరుగుకు ప్రయత్నించి డేవిడ్ రనౌటైపోయాడు. అంతే.. ముంబయి ఖేల్ఖతం! ఒక్కసారిగా పుంజుకున్న హైదరాబాద్ మ్యాచ్ను ఎగరేసుకుపోయింది.
ముంబయి
టీ20 లీగ్ ప్లేఆఫ్స్ బెర్తు కోసం మిణుకుమిణుకుమంటున్న ఆశల్ని హైదరాబాద్ సజీవంగా ఉంచుకుంది. 13వ మ్యాచ్ ఆడుతూ ఆ జట్టు ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసింది. టిమ్ డేవిడ్ (46; 18 బంతుల్లో 3×4, 4×6), రోహిత్ శర్మ (48; 36 బంతుల్లో 2×4, 4×6), ఇషాన్ కిషన్ (43; 34 బంతుల్లో 5×4, 1×6) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉమ్రాన్ మాలిక్ (3/23) ముంబయిని దెబ్బ తీశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి (76; 44 బంతుల్లో 9×4, 3×6), ప్రియమ్ గార్గ్ (42; 26 బంతుల్లో 4×4, 2×6), పూరన్ (38; 22 బంతుల్లో 2×4, 3×6) చెలరేగడంతో మొదట హైదరాబాద్6 వికెట్లకు 193 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో రమణ్దీప్ (3/20) ఒక్కడే రాణించాడు. ప్లేఆఫ్స్కు ఎప్పుడో దూరమైన ముంబయికి 13 మ్యాచ్ల్లో ఇది పదో ఓటమి.
డేవిడ్.. ఆశలురేపి
ఛేదనలో ముంబయికి అదిరే ఆరంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించాడు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కళ్లు చెదిరే స్ట్రెయిట్ సిక్సర్తో ఊపందుకున్న రోహిత్.. ఆ తర్వాత ఇదే దూకుడు కొనసాగించాడు. కాసేపటికి కిషన్ కూడా లయ అందుకోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 11వ ఓవర్లో రోహిత్ ఔటయ్యే సమయానికి స్కోరు 95 పరుగులకు చేరుకుంది. అయితే కెప్టెన్ ఔటవగానే వికెట్ల పతనానికి గేట్లెత్తేసినట్లయింది. ఉమ్రాన్ మాలిక్ ధాటికి ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కిషన్తో పాటు తిలక్ వర్మ, సామ్స్ షాట్లు ఆడబోయి అతడికి వికెట్లు ఇచ్చేశారు. 15 ఓవర్లకు ముంబయి స్కోరు 127/4. చివరి 5 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సి రావడంతో ముంబయి అవకాశమే లేదనిపించింది. కానీ టిమ్ డేవిడ్ అనూహ్యంగా చెలరేగడంతో నిమిషాల్లో కథ మారిపోయింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో అతను అయిదు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాదేశాడు. యార్కర్ల కోసం ప్రయత్నించి ఫుల్టాస్లు వేయడంతో డేవిడ్ సిక్సర్ల మోత మోగించేశాడు. సమీకరణం 13 బంతుల్లో 19గా మారింది. కానీ ఇక్కడ మళ్లీ కథ మలుపు తిరిగింది. చివరి బంతికి లేని సింగిల్ కోసం ప్రయత్నించి డేవిడ్ రనౌటైపోయాడు. తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ వికెట్ మెయిడెన్తో హైదరాబాద్ను విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్లో రమణ్దీప్ ఒక ఫోర్, సిక్సర్ బాదినా.. ముంబయి విజయానికి 4 పరుగుల దూరంలో ఆగిపోయింది.
హైదరాబాద్ ధనాధన్
అంతకుముందు ఆఖర్లో కొన్ని ఓవర్లు మినహాయిస్తే హైదరాబాద్ ఇన్నింగ్స్లో మెరుపులే మెరుపులు. ముంబయి బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ పేలవంగా సాగడంతో హైదరాబాద్కు ఇబ్బందే లేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (9) వికెట్ కోల్పోయినా.. విలియమ్సన్కు బదులుగా ఓపెనర్గా వచ్చిన ప్రియమ్ గార్గ్, ఫామ్లో ఉన్న రాహుల్ త్రిపాఠి చెలరేగడంతో భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టింది. అభిషేక్ను ఔట్ చేసిన సామ్స్ బౌలింగ్లోనే గార్గ్ 10 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ చేజారడంతో ముంబయి మూల్యం చెల్లించుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న గార్గ్ భారీ షాట్లతో చెలరేగాడు. మరో ఎండ్లో త్రిపాఠి కూడా ఆగనే లేదు. ఈ ఇద్దరి దూకుడుతో పవర్ప్లేలో 57 పరుగులు చేసిన హైదరాబాద్.. 10.1 ఓవర్లలోనే వందకు చేరుకుంది. ప్రధాన బౌలర్లందరూ తేలిపోతుండటంతో దిక్కుతోచని ముంబయి కెప్టెన్ రోహిత్.. పార్ట్ టైం పేసర్ రమణ్దీప్ సింగ్కు బంతి అందించాడు. అతను గార్గ్ను ఔట్ చేశాడు. కానీ ముంబయి సంతోషించడానికి ఏమీ లేకపోయింది. పూరన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను సిక్సర్ల మోత మోగించడం, త్రిపాఠి కూడా జోరు కొనసాగించడంతో 16 ఓవర్లకు 164/2తో హైదరాబాద్ తిరుగులేని స్థితికి చేరుకుంది. ఈ ఊపు చూస్తే స్కోరు 220కి చేరువయ్యేలా కనిపించింది. అయితే చివరి 4 ఓవర్లలో ముంబయి బౌలర్లు పుంజుకున్నారు. మెరెడిత్ వేసిన 17వ ఓవర్లో పూరన్ ఔటయ్యాక స్కోరు వేగం పడిపోయింది. రమణ్దీప్ 18వ ఓవర్లో 2 పరుగులే ఇచ్చి త్రిపాఠి, మార్క్రమ్ (2)లను ఔట్ చేశాడు. చివరి 22 బంతుల్లో హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్