T20 League : ఇది పొట్టి క్రికెట్‌ బాసూ .. ఇక్కడ స్ట్రైక్‌రేట్ మరీ ఇంత ఉంటే కష్టమే!

పరుగుల వరదకు మారుపేరు టీ20 లీగ్‌.. ఇలాంటి టోర్నీల్లో స్ట్రైక్‌ రేట్‌ చాలా కీలకం. అయితే కొందరు ...

Published : 05 May 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరుగుల వరదకు మారుపేరు టీ20 లీగ్‌.. ఇలాంటి టోర్నీల్లో స్ట్రైక్‌రేట్ చాలా కీలకం. అయితే కొందరు స్టార్‌ క్రికెటర్లు మాత్రం హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేసినా ఒక్కో మ్యాచ్‌లో సరైన స్ట్రైక్‌రేట్‌ను రొటేట్‌ చేయలేకపోయారు. లోస్కోరింగ్‌ మ్యాచ్‌ల్లో నెమ్మదిగా ఆడితే ఫర్వాలేదు కానీ.. తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు కూడానూ బంతులను ఎక్కువ తీసుకోవడం మాత్రం పొట్టి ఫార్మాట్‌కు నప్పదు. మరి ఈ సీజన్‌లో నిదానంగా పరుగులు రాబట్టిన ఆ స్టార్‌ క్రికెటర్లు ఎవరనేది ఓసారి తెలుసుకుందాం.. 

  1. విరాట్ కోహ్లీ: ఫామ్‌లో లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బెంగళూరు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి సీజన్‌లో ఎట్టకేలకు ఒక అర్ధశతకం నమోదు చేశాడు. హాఫ్‌ సెంచరీ చేయడానికి 45 బంతులు తీసుకున్నాడు. ఆ తర్వాత వేగంగా పరుగులు చేశాడా...? అంటే అదీ లేదు. 53 బంతుల్లో 58 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ స్ట్రైక్‌రేట్ 109.43. ఇదే మ్యాచ్‌లో రాజత్‌ పాటిదార్‌ (52:32 బంతుల్లో) స్ట్రైక్‌రేట్‌ (162.5) కోహ్లీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఆఖరికి గుజరాత్‌నే విజయం వరించింది.
  2. జోస్‌ బట్లర్‌: మూడు సెంచరీల హీరో, రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ కూడా ఓ మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 128.85 స్ట్రైక్‌రేట్‌తో 67 పరుగులు సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ చేయడానికి 48 బంతులు తీసుకోవడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన బట్లర్‌ గత మ్యాచ్‌లతో పోలిస్తే చాలా నెమ్మదిగా పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబయి 15వ సీజన్‌లో బోణీ కొట్టింది. ప్రస్తుత సీజన్‌లో బట్లర్‌ మూడు శతకాలు, మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు.
  3. కేన్ విలియమ్సన్‌: హైదరాబాద్‌ను నడిపిస్తున్న కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా వేగంగా మాత్రం ఆడలేకపోతున్నాడు. తొలి రౌండ్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 57 పరుగులు చేశాడు. స్ట్రైక్‌ రేట్‌ 123.91 ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో నెమ్మదిగానే బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. కానీ కేన్‌ లాంటి సూపర్‌ బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కాదనే చెప్పాలి. అయితే గుజరాత్‌పై హైదరాబాద్‌ విజయం సాధించడంలో మాత్రం కీలకంగా ఆ ఇన్నింగ్స్‌ మారింది.  ఇప్పటి వరకు కేవలం ఒక హాఫ్ సెంచరీనే నమోదు చేశాడు. 
  4. కేఎల్ రాహుల్‌: ప్రస్తుత సీజన్‌లో జోస్‌ బట్లర్‌ తర్వాత అత్యంత డేంజరస్‌ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్ రాహుల్. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో చెలరేగుతున్నాడు. అయితే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్‌ చేశాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 50 బంతులకు 136 స్ట్రైక్‌రేట్‌తో 68 పరుగులు చేశాడు. హాఫ్‌ సెంచరీ కంటేపైగా పరుగులు చేసినప్పుడు రాహుల్‌ స్ట్రైక్‌రేట్‌ తక్కువగా ఉన్నది ఈ మ్యాచ్‌లోనే కావడం విశేషం.
  5. హార్దిక్‌ పాండ్య: గత రెండు సీజన్లలో ఫామ్‌లో లేని హార్దిక్‌ పాండ్య ఈసారి మాత్రం అదరగొట్టేస్తున్నాడు. బౌలింగ్‌లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అయితే తొలిసారి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేశాడు. కేవలం 119. 05 స్ట్రైక్‌రేట్‌తో 42 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఇక కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ (67) అర్ధశతకం సాధించాడు. అయితే స్ట్రైక్‌రేట్ 136.73 మాత్రమే. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం సాధించింది. 
  6. ఇషాన్‌ కిషన్‌: ముంబయి జట్టు భారీగా (రూ.15.25 కోట్లు) ఖర్చు పెట్టి మరీ దక్కించుకున్న యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ తొమ్మిది మ్యాచ్‌లకుగాను కేవలం రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే నమోదు చేశాడు. ఓపెనర్‌గా వచ్చినప్పుడు వేగంగా పరుగులు రాబడితే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 125.58 స్ట్రైక్‌రేట్‌తో 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడలేకపోయాడు. ఆఖరికి ముంబయి 170/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. తిలక్ వర్మ (33 బంతుల్లో 61 పరుగులు) ధాటిగా ఆడినా ప్రయోజనం దక్కలేదు. 
  7. శిఖర్ ధావన్‌: పంజాబ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ బ్యాటర్‌ సందర్భానుచితంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఇప్పటివరకు మూడు అర్ధ శతకాలు చేసిన శిఖర్‌ ధావన్‌ గత మ్యాచ్‌లో మాత్రం కాస్త నింపాదిగా ఆడాడు. గుజరాత్‌ నిర్దేశించిన 144 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో శిఖర్ ధావన్‌ (62నాటౌట్‌) 116.98 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. అయితే ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (1) త్వరగా ఔట్ కావడం.. మరోవైపు భానుక రాజపక్స దూకుడుగా ఆడటంతో శిఖర్‌ ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదే మ్యాచ్‌లో గుజరాత్ యువ బ్యాటర్‌ సాయి సుదర్శన్ 130 స్ట్రైక్‌రేట్‌తో 50 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 
  8. సంజూ శాంసన్‌: రోటీన్‌కు భిన్నంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కేవలం 110.20 స్ట్రైక్‌రేట్‌తో 49 బంతుల్లో 54 పరుగులే చేశాడు. అయితే ఆఖర్లో హెట్‌మయేర్ (13 బంతుల్లో 27నాటౌట్) విజృంభించడంతో కోల్‌కతాకు ఓ మోస్తరు లక్ష్యం (153) నిర్దేశించగలిగింది. సంజూ శాంసన్ తొలి నుంచీ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టేవాడు. అయితే బట్లర్ (22), పడిక్కల్ (2), కరుణ్ నాయర్ (13), రియాన్‌ పరాగ్ (19) ఔట్‌ కావడంతో సంజూ ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఆఖరుకు కోల్‌కతా 19.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయిం లక్ష్యాన్ని ఛేదించింది. 
  9. డుప్లెసిస్‌: టోర్నీ ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టేసిన డుప్లెసిస్‌ తర్వాత నెమ్మదించాడు. పది మ్యాచులకుగాను 278 పరుగులు చేసిన డుప్లెసిస్‌ కేవలం రెండు అర్ధ శతకాలను నమోదు చేశాడు. పంజాబ్‌పై 154.39 స్ట్రైక్‌రేట్‌తో   (57 బంతుల్లో 88), లఖ్‌నవూపై 150 స్ట్రైక్‌రేట్‌ (64 బంతుల్లో 96) భారీ ఇన్నింగ్స్‌లను ఆడాడు. పంజాబ్‌పై ఓడగా.. లఖ్‌నవూపై విజయం సాధించింది. ఇక ఆ తర్వాత అతడి స్థాయి ఆటను ఆడలేకపోయాడు. దీంతో బెంగళూరు విజయాలు సాధించడంలో వెనుకబడింది. 
  10. ఎంఎస్ ధోనీ: కెప్టెన్సీ బాధ్యతలను వదిలి సీజన్‌ను ప్రారంభించిన ఎంఎస్ ధోనీ తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం చేసి ఆకట్టుకున్నాడు. అదీనూ ఏడోస్థానంలో వచ్చిన ధోనీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అయితే ఆరంభంలో ఆచితూచి ఆడిన ధోనీ చివరికి 131.58 స్ట్రైక్‌రేట్‌తో 38 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు చెన్నై ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ధోనీకిదే అర్ధ శతకం. మరోవైపు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మళ్లీ ధోనీనే పగ్గాలు చేపట్టాడు. హైదరాబాద్‌పై విజయంతో తన కెప్టెన్సీ పవర్‌ను చూపించాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని