T20 League: ఇవి 2022 రికార్డులు.. ఎవరెవరు ఏమేం సాధించారు?
రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. కొత్త జట్టు గుజరాత్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది...
రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. కొత్త జట్టు గుజరాత్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. తుదిపోరులో రాజస్థాన్ను ఓడించి కొత్త ఛాంపియన్గా అవతరించింది. సుదీర్ఘంగా జరిగిన ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు కొత్త రికార్డులతో ఆకట్టుకున్నారు. అవేంటో, వారు సాధించిన ఘనతలేంటో తెలుసుకుందాం.
ఉమ్రాన్ అనుకుంటే ఫెర్గూసన్..
ఈ సీజన్లో హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అత్యధిక వేగంతో బౌలింగ్ చేసిన ఆటగాడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. దిల్లీతో ఆడిన మ్యాచ్లో ఏకంగా 157 కిమీ వేగంతో బౌలింగ్ చేసి ఈ టోర్నీలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తర్వాత కూడా నిలకడగా 150 కిమీ వేగానికి పైగా బంతులేశాడు. దీంతో ఏకంగా టీమ్ఇండియాకే ఎంపికై అందరి ప్రశంసలు పొందాడు. ఇక ఆదివారం గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ముందువరకూ ఉమ్రాన్దే మెరుగైన రికార్డు. కానీ, తుదిపోరులో గుజరాత్ పేసర్ లాకీ ఫెర్గూసన్ 157.3 కిమీ వేగంతో బౌలింగ్ చేసి ఉమ్రాన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పుడిదే ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలింగ్ ప్రదర్శన.
ఇన్ని సిక్సులు ఎప్పుడూ చూడలేదు..
టోర్నీ ప్రారంభమై 15 సీజన్లు పూర్తి అయినా.. ఈసారి నమోదైనన్ని సిక్సర్లు ఇంతకుముందెప్పుడూ నమోదుకాలేదు. ఈ సీజన్లో 162 మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసి మొత్తం 1,062 సిక్సర్లు బాదారు. అందులో జోస్ బట్లర్ అత్యధికంగా (45) సిక్సర్లు కొట్టాడు. కేఎల్ రాహుల్ (30), క్వింటన్ డికాక్ (23) తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే, ఇదివరకు అత్యధిక సిక్సులు కొట్టింది మాత్రం బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతడు 2016లో 38 సిక్సర్లు సాధించాడు. 2018లో రిషభ్ పంత్ 37 సిక్సర్లు కొట్టాడు. కాగా, ఈ సీజన్లో పోటీపడింది 10 జట్లు కాబట్టి ఎక్కువ మ్యాచ్ల వల్ల సిక్సర్ల సంఖ్య పెరిగి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ, 2011, 2012, 2013 సీజన్లలోనూ 74, 76, 76 మ్యాచ్లు నిర్వహించారు. అప్పుడు కూడా 639, 731, 672 సిక్సర్లే వచ్చాయి. 2018లో మాత్రం అత్యధికంగా 872 సిక్సర్లు నమోదయ్యాయి. అప్పుడు 60 మ్యాచ్లే. దీంతో ఈసారి నమోదైన సంఖ్యే టోర్నీ చరిత్రలో అత్యధికంగా నమోదైన సిక్సర్ల రికార్డుగా నిలిచింది.
ఇమ్రాన్ తాహీర్ను మించిన చాహల్..
సహజంగా ప్రతి సీజన్లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ల జాబితాలో ప్రధానంగా పేస్ బౌలర్లే చోటు దక్కించుకుంటారు. తమ పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు చుక్కలు చూపిస్తూ వికెట్లు సాధిస్తారు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. తొలి రెండు స్థానాలను స్పిన్నర్లు కైవసం చేసుకోవడం విశేషం. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (27) వికెట్లతో ఈసారి టాప్ బౌలర్గా నిలవగా, బెంగళూరు స్పిన్నర్ వానిండు హసరంగ (26) వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో వీరిద్దరూ ఈ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ రికార్డులు నెలకొల్పిన స్పిన్నర్లుగా నిలిచారు. ఇంతకుముందు చెన్నై మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 2019లో (26) వికెట్లు తీసి ఈ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. ఇప్పుడు చాహల్, హసరంగ అతడిని అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పారు. ఇక చెన్నై ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఈ సీజన్లో మొత్తం 16 వికెట్లు తీసి ఈ టోర్నీ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ప్రస్తుతం అతడు 183 వికెట్లతో టాప్లో ఉన్నాడు. మలింగ 170, అమిత్ మిశ్రా 166, చాహల్ 166 వికెట్లతో కొనసాగుతున్నారు.
ధోనీ నంబర్ వన్, డీకే నంబర్ టు..
ఈ టీ20 లీగ్ మొత్తంలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మహేంద్రసింగ్ ధోనీ నిలిచాడు. మొత్తం 15 సీజన్లలో 234 మ్యాచ్లు ఆడి నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక బెంగళూరు బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ 229 మ్యాచ్లతో రెండో స్థానంలో నిలిచాడు. ముంబయి సారథి రోహిత్ శర్మ 227 మ్యాచ్లు, బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ 223 మ్యాచ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే, ఓవరాల్ పరుగుల పరంగా ఎప్పటిలాగే కోహ్లీ టాప్లో ఉన్నాడు. ఈసారి అతడు పెద్దగా క్లిక్ కాకపోయినా.. 16 మ్యాచ్ల్లో 341 పరుగులు చేసి.. మొత్తంగా ఈ లీగ్ చరిత్రలో 6,624 పరుగులతో అందరికన్నా ముందున్నాడు. ఇక పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ సీజన్లో 460 పరుగులు సాధించి.. కోహ్లీ తర్వాత ఈ లీగ్ చరిత్రలో 6 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ధావన్ ప్రస్తుతం 6,244 పరుగులతో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 5881, రోహిత్ శర్మ 5879 పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
* 2016లో బెంగళూరు కెప్టెన్గా ఆడిన విరాట్ కోహ్లీ 4 సెంచరీలు బాదినట్లే ఈసారి రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ 4 శతకాలతో ఆ రికార్డును సమం చేశాడు.
* ముంబయి పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఎంతో కాలంగా ఈ టీ20 టోర్నీలో ఆడుతున్నా.. ఈసారి 10/5 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
* లఖ్నవూ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 140 నాటౌట్ సాధించాడు. దీంతో ఇది ఈ టీ20 టోర్నీలోనే మూడో అతిపెద్ద వ్యక్తిగత స్కోర్గా నమోదైంది. క్రిస్గేల్ 175 నాటౌట్, బ్రెండన్ మెక్కలమ్ 158 నాటౌట్ స్కోర్లు పదిలంగా ఉన్నాయి.
* కోల్కతాతో ఆడిన మ్యాచ్లో లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (68 నాటౌట్; 51 బంతుల్లో 3x4, 4x6), ఓపెనర్ క్వింటన్ డికాక్ (140 నాటౌట్; 70 బంతుల్లో 10x4, 10x6) తొలి వికెట్కు 210 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ఈ టోర్నీ చరిత్రలోనే మేటి పార్ట్నర్షిప్గా నమోదైంది.
* కోల్కతా ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో వేగవంతమైన అర్ధ శతకం సాధించాడు. ముంబయితో ఆడిన మ్యాచ్లో అతడు 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. దీంతో 2018లో కేఎల్ రాహుల్ సాధించిన రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో కమిన్స్ (56 నాటౌట్; 15 బంతుల్లో 4x4, 6x6) దంచికొట్టాడు. డేనియల్ సామ్స్ వేసిన ఆ ఓవర్లో కమిన్స్ నాలుగు సిక్సులు, రెండు బౌండరీల సాయంతో మొత్తం 35 పరుగులు రాబట్టాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.