T20 League : పదిహేను పట్టేదెవరో?

రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన టీ20 లీగ్‌లో పతాక ఘట్టానికి రంగం సిద్ధమైంది. 15వ సీజన్‌ తుది పోరు ఆదివారమే. టోర్నీలో అత్యుత్తమ జట్లే ఫైనల్లో తలపడబోతున్నాయి. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ కప్పు కోసం అహ్మదాబాద్‌లోని మొతెరా...

Updated : 29 May 2022 06:57 IST

నేడే ఫైనల్‌

గుజరాత్‌తో రాజస్థాన్‌ ఢీ

 రాత్రి 8 నుంచి

రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన టీ20 లీగ్‌లో పతాక ఘట్టానికి రంగం సిద్ధమైంది. 15వ సీజన్‌ తుది పోరు ఆదివారమే. టోర్నీలో అత్యుత్తమ జట్లే ఫైనల్లో తలపడబోతున్నాయి. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ కప్పు కోసం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే ఫైనల్‌ చేరిన గుజరాత్‌.. అదే ఊపులో కప్పు పట్టేయాలని చూస్తుండగా, తొలి సీజన్లో టైటిల్‌ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్‌.. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో?


కొత్తదనమాపాత పరమా!

అహ్మదాబాద్‌

ఈసారి టీ20 లీగ్‌లో విజేతగా నిలిచే జట్టేది అని టోర్నీ ఆరంభానికి ముందు అడిగితే.. అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబయి అనో.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై అనో.. గత కొన్ని సీజన్ల నుంచి చక్కటి ప్రదర్శన చేస్తున్న దిల్లీ క్యాపిటల్స్‌ అనో.. కాదంటే కాగితం మీద బలంగా కనిపిస్తున్న కోల్‌కతా, బెంగళూరు జట్ల పేర్లో చెప్పి ఉంటారు ఎక్కువమంది! తొలి సీజన్లో టైటిల్‌ గెలిచాక ఎప్పుడూ ఫైనల్‌కే రాని రాజస్థాన్‌, కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌లో ఒక జట్టు కప్పు గెలుస్తుందని, ఈ రెండు జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరేమో! కానీ ఇప్పుడు ఈ రెండు జట్లే కప్పు కోసం  కొట్లాడబోతున్నాయి. మరి తొలి సీజన్లోనే గుజరాత్‌ కప్పుతో బోణీ కొట్టేస్తుందా? లేక రాజస్థాన్‌ రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా?

రెండు కొత్త జట్ల రాకతో సుదీర్ఘంగా సాగిన లీగ్‌ దశ తర్వాత, రసవత్తర ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లతో అలరించిన టీ20 లీగ్‌ 15వ సీజన్‌ పతాక పోరు ఆదివారమే. లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే అద్భుత ప్రదర్శనతో లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచి, తొలి క్వాలిఫయర్లోనూ సునాయాసంగా నెగ్గి ఫైనల్‌ చేరింది గుజరాత్‌. చాలా ఏళ్ల తర్వాత నిలకడగా ఆడి రెండో స్థానంతో లీగ్‌ ముగించి, తొలి క్వాలిఫయర్లో ఓడినా, రెండో క్వాలిఫయర్లో అలవోకగా నెగ్గి తుది సమరానికి అర్హత సాధించింది రాజస్థాన్‌. వీటి మధ్యే తుది సమరం. ఈ సీజన్లో ఏ జట్టుకూ సాధ్యం కాని నిలకడకు తోడు.. ఆడిన రెండుసార్లూ రాజస్థాన్‌ను ఓడించడం గుజరాత్‌ను ఫేవరెట్‌గా నిలిపేదే. కానీ భీకర బ్యాట్స్‌మెన్‌, నాణ్యమైన బౌలర్లు ఉన్న రాజస్థాన్‌ను తక్కువగా అంచనా వేస్తే కష్టమే. ఫైనల్‌ హోరాహోరీగానే సాగే అవకాశముంది.


ముంచినా.. తేల్చినా అతనే..

రాజస్థాన్‌ విజయావకాశాలు బట్లర్‌ మీదే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ సీజన్లో రాజస్థాన్‌ ఇక్కడిదాకా రావడానికి అతనే కారణం. లీగ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు, బట్లర్‌ ఒకవైపు అన్నట్లే సాగింది ఇప్పటిదాకా. 824 పరుగులు.. 4 శతకాలు.. ఈ గణాంకాలే చెప్పేస్తాయి బట్లర్‌ ఎలా చెలరేగిపోతున్నాడో. లీగ్‌ దశ చివర్లో కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమై ఆందోళన రేకెత్తించిన అతను.. ప్లేఆఫ్స్‌లోకి వచ్చాక మళ్లీ జోరందుకున్నాడు. తొలి క్వాలిఫయర్లో 89 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు బట్లర్‌. కానీ బౌలర్ల వైఫల్యంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. రెండో క్వాలిఫయర్లో మొదట బౌలర్లు అదరగొడితే.. తర్వాత బట్లర్‌ సెంచరీతో మిగతా పని పూర్తి చేశాడు. కాబట్టి ఫైనల్లో బట్లర్‌ ఆటను బట్టే రాజస్థాన్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. రషీద్‌పై పేలవ రికార్డున్న బట్లర్‌.. ఫైనల్లో అతణ్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.


2008లో రాజస్థాన్‌ టైటిల్‌ గెలిచిన రోజు నేను పగలు కేరళలో అండర్‌-16 మ్యాచ్‌లో ఆడుతున్నా. రాత్రి నా స్నేహితులతో కలిసి మ్యాచ్‌ చూశాను. చివరి పరుగును షేన్‌ వార్న్‌ పూర్తి చేయడం నాకింకా గుర్తుంది. ఇప్పుడు రాజస్థాన్‌ మళ్లీ ఫైనల్‌ ఆడబోతోంది. వార్న్‌ కోసం మేం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నాం. అతడి కోసం కప్పు గెలుస్తాం.

- సంజు శాంసన్‌, రాజస్థాన్‌ కెప్టెన్‌


అటు స్టార్‌ పవర్‌.. ఇటు సమష్టి బలం

ఫైనల్‌ చేరిన రెండు జట్లను పోల్చి చూస్తే.. ఒక ముఖ్యమైన తేడా  కనిపిస్తుంది. రాజస్థాన్‌ జట్టులో బాగా పేరుమోసిన ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో భారీ హిట్టర్లు ఆ జట్టు సొంతం. బట్లర్‌, సంజు శాంసన్‌, హెట్‌మయర్‌లకు తోడు.. యశస్వి, పడిక్కల్‌ లాంటి యువ ప్రతిభావంతులతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. వీరిలో ఇద్దరు ముగ్గురు నిలబడితే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో బౌల్ట్‌, చాహల్‌, అశ్విన్‌ లాంటి అంతర్జాతీయ స్టార్ల అండ ఆ జట్టుకుంది. మెకాయ్‌, ప్రసిద్ధ్‌ సైతం కొన్ని మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేశారు. రెండో క్వాలిఫయర్లో ఈ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. రాజస్థాన్‌కు తిరుగుండదు. ఇక గుజరాత్‌ విషయానికి వస్తే.. టోర్నీలో ఆ జట్టంతా సమష్టిగా ఆడిన జట్టు మరొకటి కనిపించదు. అంచనాల్లేకుండా, ఆలస్యంగా జట్టులోకి వచ్చిన సాహా మంచి ఆరంభాలతో జట్టుకు పెద్ద బలంగా మారాడు. శుభ్‌మన్‌ కూడా కొన్ని మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. లీగ్‌ దశ ప్రథమార్ధంలో అదరగొట్టిన హార్దిక్‌.. మధ్యలో జోరు తగ్గించినా, గత కొన్ని మ్యాచ్‌ల్లో లయ అందుకున్నాడు. ఇక మిల్లర్‌ ఎన్నడూ లేనంత నిలకడతో జట్టుకు మిడిలార్డర్లో పెద్ద బలంగా మారాడు. తెవాతియా రెండు మ్యాచ్‌ల్లో మెరుపులతో జట్టును గెలిపించాడు. ఇలా అవసరానికి తగ్గట్లు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవడంతో బ్యాటింగ్‌లో గుజరాత్‌ బెంగ లేకుండా పోతోంది. బౌలింగ్‌లో రషీద్‌ ప్రత్యర్థులకు గట్టి సవాలు విసురుతుండగా.. అప్పుడప్పుడూ షమి చెలరేగుతున్నాడు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన సాయికిశోర్‌ ఆకట్టుకుంటున్నాడు. యశ్‌ దయాల్‌ కూడా సత్తా చాటాడు. అయిదో బౌలర్‌ విషయంలో మాత్రం గుజరాత్‌ సమస్య ఎదుర్కొంటోంది. జోసెఫ్‌ కానీ, ఫెర్గూసన్‌ కానీ నిలకడగా రాణించట్లేదు. వీరితో ఫైనల్‌కు తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకున్నా, సత్తా చాటాల్సిన అవసరముంది.


6

ఇప్పటివరకు టీ20 ట్రోఫీని అందుకున్న జట్ల సంఖ్య. ముంబయి (2013, 2015, 2017, 2019, 2020) అయిదుసార్లు విజేతగా నిలవగా.. చెన్నై (2010, 2011, 2018, 2021) నాలుగు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతా (2012, 2014) రెండుసార్లు,  హైదరాబాద్‌ (2016), రాజస్థాన్‌ (2008), డెక్కన్‌ ఛార్జర్స్‌ (2009) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.


150

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (2016లో 973) పేరిట ఉన్న రికార్డును అధిగమించడానికి బట్లర్‌కు అవసరమైన పరుగులు. అతను ఇంకో 25 పరుగులు చేస్తే రెండో స్థానంలో ఉన్న వార్నర్‌ (2016లో 848)ను దాటేస్తాడు.


* ఈ సీజన్లో లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన జట్లే ఫైనల్‌ ఆడుతున్నాయి. గుజరాత్‌ 10 విజయాలతో అగ్రస్థానంలో నిలవగా..  9 విజయాలతో రాజస్థాన్‌ రెండో స్థానం సాధించింది. లఖ్‌నవూ కూడా 9 విజయాలే సాధించినా.. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో రాజస్థాన్‌ దాన్ని వెనక్కి నెట్టింది.


* ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌, అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ రాజస్థాన్‌ ఆటగాళ్లే. బట్లర్‌ 824 పరుగులతో బ్యాటర్లలో.. చాహల్‌ 26 వికెట్లతో (హసరంగతో సమానంగా) బౌలర్లలో టాప్‌లో ఉన్నారు.


* 2016లో హైదరాబాద్‌ ట్రోఫీ నెగ్గాక ఇప్పటివరకు కొత్త జట్టు విజేతగా నిలవలేదు.


* ఈ సీజన్లో రాజస్థాన్‌తో తలపడ్డ రెండుసార్లూ గుజరాతే గెలిచింది. లీగ్‌ దశలో 37 పరుగులతో నెగ్గిన ఆ జట్టు.. తొలి క్వాలిఫయర్లో 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.


మొతెరాలో మోతే..

టీ20 లీగ్‌ ఫైనల్‌ అంటేనే సందడి వేరుగా ఉంటుంది. అందులోనూ ఆ మ్యాచ్‌ ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతెరా క్రికెట్‌ స్టేడియంలో జరిగితే, అది పూర్తిగా నిండితే ఉండే హంగామానే వేరు. పునర్నిర్మాణం తర్వాత లక్షా 32 వేల సామర్థ్యంతో ఎంసీజీని వెనక్కి నెట్టి అతి పెద్ద క్రికెట్‌ మైదానంగా అవతరించింది మొతెరా. ఇక్కడే జరిగిన రెండో క్వాలిఫయర్‌కు స్టేడియం పూర్తిగా నిండి కళకళలాడింది. ఫైనల్‌కు అభిమానుల హంగామా మరింత ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. క్వాలిఫయర్‌-2కు పిచ్‌ సమతూకంతో కనిపించింది. మొదట పేసర్లకు బాగా సహకరించిన పిచ్‌పై పరుగులు చేయడం కష్టమైంది. ఫైనల్‌ పిచ్‌ కూడా ఇలాగే ఉండొచ్చు. గత రెండేళ్లలో ఇక్కడ జరిగిన 18 టీ20ల్లో 12సార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు.


తుది జట్లు (అంచనా)...

గుజరాత్‌ : సాహా (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌, వేడ్‌, హార్దిక్‌ (కెప్టెన్‌), మిల్లర్‌, తెవాతియా, రషీద్‌ ఖాన్‌, షమి, సాయికిశోర్‌, యశ్‌ దయాళ్‌, అల్జారి జోసెఫ్‌/ఫెర్గూసన్‌.
రాజస్థాన్‌ : బట్లర్‌, యశస్వి, శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), పడిక్కల్‌, హెట్‌మయర్‌, అశ్విన్‌, చాహల్‌, బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మెకాయ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని