Mumbai Vs Delhi : ముంబయి గెలిచింది.. బెంగళూరు మురిసింది

ముంబయి, దిల్లీ మ్యాచ్‌ ఫలితంపై రెండు జట్ల ప్లేఆఫ్స్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇందులో..

Updated : 22 May 2022 00:09 IST

ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే..

ముంబయి: రోహిత్ సారథ్యంలోని ముంబయి గెలిచింది.. బెంగళూరు మురిసింది.. అదేంటి దిల్లీపై ముంబయి గెలిస్తే బెంగళూరు ఎందుకు సంతోషం పడిందనేగా మీ అనుమానం? ఈ మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధిస్తే దిల్లీ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకునేది. కానీ కీలక మ్యాచ్‌లో దిల్లీ తడబడింది. 160 పరుగులను కాపాడుకోవడంలో విఫలమై ఓటమితో ఇంటిముఖం పట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 159/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి ఐదు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో 160 పరుగులు చేసి విజయం సాధించింది. రోహిత్‌ శర్మ (2) విఫలం కాగా.. ఇషాన్‌ కిషన్ (48), బ్రెవిస్ (37), టిమ్‌ డేవిడ్ (34), తిలక్ వర్మ (21), రమణ్‌దీప్‌ (13*) రాణించారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్ 2, నోకియా 2, కుల్‌దీప్‌ యాదవ్ ఒక వికెట్ తీశారు. 

ముంబయి విజయం సాధించినా తన స్థానంలో మాత్రం మార్పు రాలేదు. 14 మ్యాచ్‌లకుగాను నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. దిల్లీ ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో సీజన్‌ను ముగించింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లేవో తేలిపోయింది. పాయింట్ల పట్టికలో నాలుగు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ (20), రాజస్థాన్‌ (18), లఖ్‌నవూ (18), బెంగళూరు (16) ప్లేఆఫ్స్‌కు చేరాయి. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మే 24న, ఎలిమినేటర్‌ మే 25న, రెండో క్వాలిఫయర్‌ మే 27న, ఫైనల్‌ మ్యాచ్‌ మే 29న జరుగుతుంది. తొలి క్వాలిఫయర్‌ గుజరాత్-రాజస్థాన్‌ మధ్య, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లఖ్‌నవూ- బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది.


రసవత్తరంగా మ్యాచ్‌

దిల్లీ, ముంబయి జట్ల మధ్య మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. దిల్లీ బౌలర్ల దెబ్బకు దూకుడుగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్ (48) కాస్త అర్ధశతకం చేజార్చుకున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వార్నర్‌ చేతికి చిక్కాడు. అనంతరం బ్రెవిస్‌ (37)ను శార్దూల్ ఠాకూర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి ముంబయి మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో డేవాల్డ్ టిమ్‌ డేవిడ్ (6*), తిలక్ వర్మ (5*) ఉన్నారు. ముంబయి విజయం సాధించాలంటే 30 బంతుల్లో ఇంకా 59 పరుగులు చేయాలి.


ఘోరంగా విఫలమైన రోహిత్

లీగ్‌ దశలో తన ఆఖరి మ్యాచ్‌లోనూ ముంబయి సారథి రోహిత్ శర్మ (2) ఘోరంగా విఫలమయ్యాడు. 13 బంతుల్లో కేవలం రెండు పరుగులే చేశాడు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు చేయడం ముంబయి బ్యాటర్లకు కష్టంగా మారింది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి ముంబయి వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్ (30*), బ్రెవిస్ (11*) ఉన్నారు. ముంబయి విజయానికి ఇంకా 66 బంతుల్లో 116 పరుగులు కావాలి.


ఛేదన ప్రారంభించిన ముంబయి

ముంబయి లక్ష్య ఛేదనను ప్రారంభించింది. అయితే ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగే వచ్చింది. అదీనూ లెగ్‌బైస్‌. అంటే బౌలర్‌ నుంచి అయితే మొయిడిన్‌ ఓవర్‌గా పరిగణిస్తారు. ఇక నోకియా వేసిన రెండో ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ (10*) రెండు ఫోర్లు, సిక్సర్ బాదాడు. మూడో ఓవర్‌లోనూ ఖలీల్ ఒక పరుగే ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి దిల్లీ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్‌తోపాటు రోహిత్ ఉన్నాడు. రోహిత్ ఎనిమిది బంతులు ఆడి మరీ పరుగుల ఖాతాను ఓపెన్ చేయలేదు. ముంబయి విజయానికి ఇంకా 17 ఓవర్లలో 144 పరుగులు కావాలి.


దిల్లీ స్కోరు 159/7

కీలకమైన పోరులో ముంబయికి దిల్లీ ఓ మోస్తరు లక్ష్యం మాత్రమే నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో ముంబయి ఎదుట 160 పరుగులను లక్ష్యంగా ఉంచింది. రోవ్‌మన్‌ పావెల్ (43), రిషభ్‌ పంత్ (39), పృథ్వీ షా (24) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్‌ ఖాన్‌, అక్షర్‌ పటేల్ 20*, శార్దూల్ ఠాకూర్ 4 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 3, రమణ్‌దీప్‌ సింగ్ 2.. డానియల్ సామ్స్, మయాంక్‌ మార్కండే చెరో వికెట్ తీశారు. మరి ముంబయి మోస్తరు లక్ష్యాన్ని ఛేదించి బెంగళూరును గట్టెక్కిస్తుందా..? లేకపోతే ముంబయిని కట్టడి చేసి దిల్లీ విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి. 


ఆదుకున్న రిషభ్‌, పావెల్

ముంబయి బౌలర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకున్న దిల్లీని కెప్టెన్‌ రిషభ్ పంత్ (22*), రోవ్‌మన్ పావెల్ (31*) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 49 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి దిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోవ్‌మన్‌ పావెల్ స్పిన్నర్లను టార్గెట్‌ చేసుకుని మరీ భారీ షాట్లు కొట్టాడు.


టాప్‌ఆర్డర్‌ ఔట్

ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో దిల్లీ టాప్‌ఆర్డర్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి దిల్లీ మూడు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషభ్‌ పంత్ (4*), సర్ఫరాజ్‌ ఖాన్‌ (7*) ఉన్నారు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (5) విఫలం కాగా.. మిచెల్‌ మార్ష్ (0) గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. కాస్త దూకుడుగా ఆడిన పృథ్వీషా (23) బుమ్రా షార్ట్‌పిచ్‌ బంతిని ఆడబోయి కీపర్‌ ఇషాన్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 


బ్యాటింగ్ ప్రారంభం..

దిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి ఓవర్‌ వేసిన ముంబయి బౌలర్‌ డానియల్ సామ్స్‌ తొలి నాలుగు బంతులను కట్టుదిట్టంగా వేశాడు. అయితే ఐదో బంతికి దిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా (7*) బౌండరీతో పరుగుల ఖాతాను తెరిచాడు. అనంతరం రెండో ఓవర్‌లోనూ బౌండరీ వచ్చింది. దీంతో ఆరు పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను హృతిక్‌ షోకీన్‌ వేశాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసేసరికి దిల్లీ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజ్‌లో షాతోపాటు డేవిడ్ వార్నర్ (5*) ఉన్నాడు.


టాస్‌ నెగ్గిన ముంబయి

దిల్లీ, ముంబయి జట్లు తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో మరికాసేపట్లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితంపై రెండు జట్ల ప్లేఆఫ్స్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇందులో విజయం సాధిస్తే దిల్లీ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం బెంగళూరు ముందుడుగు వేస్తుంది. అయితే ముంబయికి కూడా ఈ విజయంతో ఒక అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌ను అట్టడుగు స్థానంతో కాకుండా తొమ్మిదో స్థానంతో ముగించే ఛాన్స్‌ ఉంది. అయితే భారీ విజయం సాధిస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుని దిల్లీకి బ్యాటింగ్‌ అప్పగించింది. 

ఇప్పటికే బెంగళూరు జట్టు సభ్యులు ముంబయికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ముంబయిలో చిరు జల్లులు పడటంతో మ్యాచ్ నిర్వహణ, ఫలితంపైనా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా అర్జున్‌ తెందూల్కర్‌కు స్థానం దక్కుతుందని ఆశించినా ముంబయి చోటు కల్పించలేదు. మరోవైపు జ్వరం నుంచి కోలుకున్న పృథ్వీ షా తుది జట్టులోకి వచ్చాడు. 

జట్ల వివరాలు: 

ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్, డానియల్‌ సామ్స్, తిలక్ వర్మ, డేవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణ్‌దీప్‌ సింగ్, హృతిక్ షోకీన్, బుమ్రా, మెరెడిత్, మయాంక్‌ మార్కండే

దిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్‌ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్‌, రోవ్‌మన్‌ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్, నోకియా, ఖలీల్ అహ్మద్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని