డీమార్ట్‌ పేరుతో లింక్.. బీ అలెర్ట్‌!

డీమార్ట్ 20వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా అందరికీ ఉచిత బహుమతులు.. అంటూ తాజాగా ఓ లింక్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి మెసేజ్‌ ఇప్పటికే వాట్సాప్‌ గ్రూపు ద్వారానో లేదా వ్యక్తిగతంగానో.....

Published : 03 Feb 2021 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డీమార్ట్ 20వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా అందరికీ ఉచిత బహుమతులు.. అంటూ తాజాగా ఓ లింక్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి మెసేజ్‌ ఇప్పటికే వాట్సాప్‌ గ్రూపు ద్వారానో లేదా వ్యక్తిగతంగానో మీకూ వచ్చే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ లింక్‌పై క్లిక్ చేయకండి. ఎందుకంటే ఆ లింక్‌ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం మొత్తం ఆగంతకుల పాలయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలానే ఈ నకిలీ ఆఫర్‌పై డీమార్ట్‌ సంస్థ కూడా స్పందించింది. ‘‘ప్రియమైన వినియోగదారులారా... సోషల్ మీడియాలో వస్తున్నట్లు మేం ఎలాంటి గిఫ్ట్‌ వోచర్లు, కూపన్లు ఇవ్వడం లేదు. వినియోగదారులు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలి’’ అని తెలిపింది. గతంలో కూడా డీమార్ట్ రూ.2,500 గిఫ్ట్‌ వోచర్ పేరుతో నకిలీ మెసేజ్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. అప్పట్లో దీనిపై సంస్థ వివరణ ఇచ్చింది. ఇలా ఆఫర్‌ పేరుతో ఇతరుల నుంచి వచ్చే సందేశాల్లో ఉండే లింక్‌లపై క్లిక్ చేయకపోవడమే మంచిదంటున్నారు సైబర్‌ నిపుణులు. అలానే వాటిని ఇతరులకు పంపకపోవడం వల్ల మరికొంత మందిని సైబర్‌ మోసాల బారిన పడకుండా కాపాడినట్లవుతుందంటున్నారు.  

లింక్‌ క్లిక్ చేస్తే ఏమవుతుంది..? 

ఒక వేళ మీరు పొరపాటున లింక్‌పై క్లిక్ చేస్తే మీకు డీమార్ట్ సెలబ్రేషన్స్‌ పేరుతో నకిలీ పేజ్‌ ఓపెన్ అవుతుంది. దాని యూఆర్‌ఎల్‌ను మీరు గమనిస్తే అది నకిలీదని ఇట్టే తెలిసిపోతుంది. అయితే అందులో ఆకర్షణీమైన ఆఫర్‌ అంటూ స్పిన్‌ వీల్ ప్రత్యక్షమవుతుంది. అందులో వివిధ రకాల ఆఫర్లకు సంబంధించిన ఫొటోలు ఉంటాయి. దానిపై క్లిక్ చేస్తే మీరు స్పిన్‌ వీల్‌ తిప్పేందుకు మరో అవకాశం అనే దగ్గర వీల్ ఆగినట్లు చూపిస్తూ ఒక మెసేజ్‌ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి మరో సారి స్పిన్‌ చేస్తే మీకు పదివేల రూపాయల విలువైన గిఫ్ట్‌ వోచర్‌ గెలుచుకున్నారు అంటూ మెసేజ్‌ వస్తుంది. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత గిఫ్ట్ వోచర్ పొందాలంటే ఈ సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా మీ స్నేహితులకు షేర్ చేయమంటూ మరో మెసేజ్‌. దాని కింద ఒక బార్‌ కనిపిస్తుంది. అది బ్లూ రంగులోకి మారే వరకు ఈ మెసేజ్‌ షేర్ చేయమంటూ మెసేజ్‌ ఉంటుంది. అలా అని మీరు ఈ సమాచారాన్ని వాట్సాప్‌లో షేర్‌ చేస్తే మీకు సంబంధించిన వివరాలు మొత్తం హ్యాకర్స్‌ చేతికి చేరే అవకాశం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి..

వాట్సాప్‌లో ఈ సందేశాలు వచ్చాయా?

డేటా ప్రైవసీపై యాపిల్ సీఈవో ఏమన్నారంటే..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు