ఆ పలకరింపులకై అన్వేషణ!

అనంత విశ్వం.. భూమిపై మనం. నక్షత్ర వ్యవస్థల నుంచి కాంతి వేగంతో అంతుచిక్కని సంకేతాలు!! అవి మనల్ని పలకరించేందుకేనా? విశ్వంలో ఎక్కడైనా మనలాంటి బుద్ధి జీవులు ఉన్నారా? ఉంటే.. మనతో ఏదైనా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారా?.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి....

Published : 03 Mar 2021 00:34 IST

సైన్స్‌ సంగతులు

అనంత విశ్వం.. భూమిపై మనం. నక్షత్ర వ్యవస్థల నుంచి కాంతి వేగంతో అంతుచిక్కని సంకేతాలు!! అవి మనల్ని పలకరించేందుకేనా? విశ్వంలో ఎక్కడైనా మనలాంటి బుద్ధి జీవులు ఉన్నారా? ఉంటే.. మనతో ఏదైనా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారా?.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఫలితంగా గ్రహాలు దాటుకుని మనిషి విశ్లేషణ నక్షత్ర మండలాల వరకూ చేరుకుంది. ఇదిలా ఉండగా.. మన పొరుగు గ్రహమైన అంగారకుడిపైనే అందరి దృష్టి పడింది. ఇప్పుడు నాసా పంపిన పర్సెవరెన్స్‌ మార్స్‌పై దిగి మరిన్ని విశ్లేషణలు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో జీవరాశి జాడలపై మరింత ఆసక్తి నెలకొంది!

జీవరాశికి మూలం జీవకణం. అది గ్రహించిన ఆహారంతో మెటబాలిజమ్‌ జరిపి జీవాన్ని నిలుపుతుంది. అంతేకాదు.. తనలాంటి మరొక దాన్ని పునరుత్పత్తి చేయగలదు. కాలంతో పాటు జరిగే మార్పుల ఫలితంగా ఈ జీవకణం నుంచి బుద్ధి జీవులు ఆవిర్భవిస్తారు. ఈ సిద్ధాంతమే ఇతర నక్షత్ర, గ్రహవ్యవస్థలపై జీవరాశి ఉంటుందనే ఆశకు ప్రాణం పోస్తోంది. ఇలా జరగడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టొచ్చేమోగానీ.. భూమిపై జరిగింది కూడా ఇదే. భూపరిణామ క్రమంలో సహజసిద్ధమైన రీతిలోనే జీవపరిణామం జరిగింది. ఇదే మాదిరిగా భూమిని పోలిన ఇతర అంతరిక్ష వస్తువులపైన కూడా ఇలాంటి పరిణామమే జరగడం సహజమైన విషయమే అవుతుందనేది శాస్త్రవేత్తల అంచనా.
మొదలైన అన్వేషణ..
మన భూగ్రహానికి ఇతర నక్షత్ర వ్యవస్థల నుంచి సంకేతాలు కాంతి వేగంతో వస్తున్నాయి. భూమిపై ఉన్నవారిని పలకరించేందుకే అన్యగ్రహవాసులు ఎవరైనా పంపుతున్నారేమోనని సందేహం. మరి, వాటిని గుర్తించాలంటే? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. దీంట్లో భాగంగానే 1972లో అమెరికా ‘పయొనీర్‌-10’ వ్యోమనౌకను ప్రయోగించింది. అది మనిషికి తెలిసిన అన్ని గ్రహాలనూ దాటుకుని సుదూర విశ్వంలోకి చేరుకుంది. అంటే.. రోదసీ కుహరం నుంచి సంకేతాలు పంపింది. 2003, జనవరి 22న ఆఖరి సందేశం పంపింది. తర్వాత అది పంపే సంకేతాలు మనకు చేరనప్పటికీ.. పయొనీర్‌ మాత్రం పాలపుంత కేంద్రం వైపు దూసుకువెళుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ప్రయత్నంగా అమెరికా పంపిన  పయొనీర్‌-2 కూడా మరొక దశలో సౌరకుటుంబంలోకి దూసుకెళ్లింది. తర్వాత అనంత విశ్వంలో ఎక్కడైనా బుద్ధి జీవులు తారసపడితే వారికి అర్థమయ్యేలా మన సందేశాలు కనిపించడం కోసం బంగారు తాపడం చేసిన అల్యూమినియం పలక మీద గ్రాఫిక్‌ మెసేజ్‌ రాసి ‘పయొనీర్‌-10’ వ్యోమనౌకని పంపారు. ఇంత వరకూ దానికి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా ప్రపంచ దేశాలు పలు అంతరిక్ష నౌకల్ని ప్రయోగిస్తూ లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించేలా చేసి.. ఇతర గ్రహాలపై జీవరాశి ఉనికిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
వాయేజర్‌ విశేషాలు..
తొలిసారి శనిగ్రహాన్ని క్లిక్‌ మనిపించిన ఘనత వాయేజర్‌-1కి దక్కుతుంది. 1977, సెప్టెంబరు 5న అమెరికా దీన్ని ప్రయోగించింది. ఇది సుమారు ఏడాది పాటు ప్రయాణం చేసి శనిగ్రహం ఫొటోలను దానికి 760, 510 లక్షల కిలోమీటర్ల  దూరంలో ఉండి తీసింది. వాటిని భూమికి పంపింది. తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన వాయేజర్‌-2 నిర్విరామంగా 300 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి యురేనస్‌ గ్రహానికి చేరువలోకి వెళ్లిన తొలి అంతరిక్షనౌకగా చరిత్ర సృష్టించింది. 2020నాటికి అది సౌరకుటుంబం సరిహద్దులు దాటి అంతర్‌ నక్షత్రమండలంలో ప్రవేశించింది. ఇంతవరకూ మనకు తెలియని ఈ ప్రాంతంలోని విశేషాల్ని తెలుసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు.. అక్కడ జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉన్న గ్రహంపై ఆవిరి జాడలు ఉన్నట్లు గుర్తించారు. దానికి సూపర్‌ ఎర్త్‌ అని, కే2-18బీగా నామకరణం చేశారు. ఇది అరుణ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ 110 కాంతి సంవత్సరాల దూరం ఒక కక్ష్యలో భ్రమణం చేస్తోందని గమనించారు. మనదేశం ఈ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఇతర దేశాలకు దీటుగానే అంతరిక్ష ప్రయోగానికి నాంది పలికింది. 1963, నవంబరు 21న తుంబా నుంచి తొలి సౌండింగ్‌ రాకెట్‌ను ప్రయోగించడంతో భారత్‌ అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.
పోలిక కుదిరింది..
సౌరకుటుంబంలో ఉన్న ఎనిమిది గ్రహాల్లో కేవలం బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు మాత్రమే శిలామయ గ్రహాలు. వీటికి సాంద్రత ఎక్కువ. గురువు, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌ గ్రహాలు పెద్దగా ఉన్నప్పటికీ వీటికి సాంద్రత తక్కువ. వీటిని ఉన్నత గ్రహాలు అని పిలుస్తారు. భూమికి పొరుగు గ్రహమైన శుక్రుడి వాతావరణంలో 96 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉంది. అంతేకాదు.. దీనిపై ఉన్నంత వేడి మరే ఇతర గ్రహంపైనా లేదు. దాని ఉపరితల ఉష్ణోగ్రత 462 డిగ్రీల సెల్సియస్‌. దీంతో శుక్రుడిపై జీవరాశి ఉండే అవకాశం చాలా తక్కువ. ఇక మనకి ఇరుగు గ్రహమైన అంగారకుడిపైకి వెళ్తే.. 1996లో నాసా ఒకప్పుడు జీవం ఉండేదని ప్రకటించింది. దీంతో అందరి దృష్టి దానిపై పడింది. ఒకప్పుడు అక్కడ నీరు, వాతావరణం ఉండేదని.. సూర్యరశ్మిని గ్రహించి జీవరాశి మనుగడకు వీలైన పరిస్థితులు నెలకొని ఉండొచ్చని అంచనా వేశారు. తర్వాత 1996, డిసెంబరు 4న ‘పాత్‌ఫైండర్‌’ను అంగారక గ్రహంపైకి పంపారు. సుమారు ఎనిమిది నెలలు ప్రయాణించి మార్స్‌పై వాలింది. అప్పుడు పంపిన ఫొటోల ఆధారంగా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం మార్స్‌పై ఊహకందని రీతిలో వరదలు సంభవించినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘పర్సెవరెన్స్‌’ను ప్రయోగించింది. గత ఏడాదిలో జులై 30న నింగికి ఎగసిన రోవర్‌ 203 రోజులు ప్రయాణం చేసి అంగారకుడిపై వాలింది. రాబోయే రెండేళ్ల పాటు పర్సెవరెన్స్‌ అక్కడ తవ్వకాలు చేపట్టి మట్టి నమూనాల్ని సేకరిస్తుంది. వాటిని నాసా త్వరలో భూమికి తీసుకొచ్చి పరీక్షించనుంది.

పొరుగు గ్రహ ప్రయాణాలెందుకు?

న్య గ్రహాల నుంచి వస్తున్న సంకేతాల్ని కనిపెట్టేందుకు ఆకాశంలో అత్యాధునిక సాంకేతిక ప్రక్రియల సహాయంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అంటే... సౌరకుటుంబం వెలుపల గ్రహాంతర వాసుల కోసం గత 55 ఏళ్లగా విశ్లేషణ సాగుతోంది. ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. భూమిని చేరుతున్న విశ్వకిరణాలు, ఇతర వికిరణాల తీవ్రత గురించి అధ్యయనం చేయడమే లక్ష్యంగా అంతరిక్ష ఉపగ్రహాల్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. ఆయా గ్రహాల్లో సహజవనరుల అన్వేషణతో పాటు నక్షత్ర మండలాల పరిశోధన సాధ్యం అవుతుంది. సైనిక, గూఢచారి కార్యకలాపాలకు తోడ్పడుతున్నాయి. సాగరాల అడుగున ఉన్న ఖనిజ సంపదల్ని తెలుసుకునేందుకు దోహదపడుతున్నాయి. మరోవైపు.. గ్రహాంతరసీమలకు ప్రయాణికుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలైనప్పటికీ.. ఇప్పటికైతే ఎలాంటి అంతరిక్షనౌకలు ఇంకా తయారు కాలేదు. ఇతర గ్రహవాసులు ప్రయోగించే నౌకలు, మన టెక్నాలజీ ఊహాశక్తికి అందని విధంగా ఉంటాయా? అసలు అవెలా ఎగురుతాయి. వాటిని గుర్తించడం ఎలా? అనే విషయంలోనూ ఖగోళ శాస్త్రవేత్తలు అతిపెద్ద టెలిస్కోపులతో ఆకాశంలోకి తొంగి చూస్తున్నారు. అటువంటి అంతరిక్ష నౌకల కోసం ఆకాశంలోని అణువణువునూ గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని