Year Ender 2021: ఈ ఏడాదికాసుల వర్షం కురిపించిన7 మొబైల్‌ గేమ్స్‌

2021లో గేమింగ్ కంపెనీలకు కాసుల వర్షం కురిపించిన ఏడు గేమ్‌లు ఉన్నాయి. వాటి వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. 

Updated : 30 Dec 2021 15:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాదిలో ఎక్కువ కాలం లాక్‌డౌన్‌తోనే గడిచిపోయింది. ఆన్‌లైన్‌ క్లాసులతో మొబైల్‌ ఫోన్లు పిల్లలకు మరింత చేరువయ్యాయి. మొబైల్‌ గేమ్స్ ఆడే వారి సంఖ్యా విపరీతంగా పెరిగింది. దీంతో 2021 గేమింగ్ కంపెనీలకు కాసుల వర్షం కురిపించింది. అలా ఈ ఏడాది బిలియన్‌ డాలర్లు వసూలు చేసి పెట్టిన గేమ్స్ జాబితాపై ఓ లుక్కేదాం.


బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా - పబ్‌జీ (Battlegrounds Mobile India - PUBG)

కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత పబ్‌జీ కాస్తా బీజీఎమ్‌ఐ (బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా)గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్‌ అయిన ఉత్కంఠతో సాగే ఈ వార్‌ గేమ్‌లో యూజర్స్‌ను ఆకట్టుకునే కొత్త పీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇటీవలే ఇందులో మిర్రర్ వరల్డ్ అనే కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేశారు. బీజీఎమ్‌ఐ ఈ ఏడాది 2.8 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. క్రాఫ్టన్‌ సంస్థ ఈ గేమ్‌ను అభివృద్ధి చేసింది. 


జెన్‌షిన్‌ ఇంపాక్ట్‌ (Genshin Impact)

తేవాత్ అనే ఫాంటసీ ప్రపంచంలోకి వెళ్లి అక్కడి శక్తులతో పోరాడటమే ఈ గేమ్‌ థీమ్‌. ఇందులో ప్లేయర్స్‌ తమ క్యారెక్టర్లను మార్చుకుంటూ ముందుకు సాగాలి. యాక్షన్ నేపథ్యంగా సాగే ఈ గేమ్‌ను గతేడాది సెప్టెంబరులో విడుదల చేశారు. జెన్‌షిన్ ఇంపాక్ట్‌ 2021లో 2.4 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీన్ని మిహోయో అనే సంస్థ రూపొందించింది. 


రోబోలాక్స్‌ (Robolox)

రోబోలాక్స్ కార్పొరేషన్ సంస్థ ఈ గేమ్‌ను డిజైన్ చేసింది. సాధారణ ఆన్‌లైన్‌ గేమ్‌లకు భిన్నంగా ఇందులో గేమ్‌ ఆడటంతోపాటు, యూజర్స్ మరో కొత్త గేమ్‌ను ప్రోగ్రాం చేసి ఇతరులను ఆడటానికి ఆహ్వానించవచ్చు. ఈ ఏడాదిలో 1.3 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. 


కాయిన్ మాస్టర్‌ (Coin Master)

ఇది సింగిల్‌ ప్లేయర్‌ మొబైల్ గేమ్‌. ఇజ్రాయెల్‌ స్టూడియో మూన్ యాక్టివ్ అనే సంస్థ ఈ గేమ్‌ను అభివృద్ధి చేసింది. కాయిన్ మాస్టర్‌ కూడా ఈ ఏడాది 1.3 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది సాధారణ గేమ్‌. స్పిన్‌, స్క్రాచ్‌ ద్వారా కాయిన్స్ సంపాదించి, నచ్చినట్లుగా గ్రామాన్ని నిర్మించడం ఈ గేమ్ కాన్సెప్ట్. 


పోకీమాన్‌ గో (Pokemon Go)

ఇది ఒక అగ్‌మెంటెడ్‌ రియాల్టీ మొబైల్ గేమ్‌. నియాన్‌టిక్, నిన్‌టెండో, ది పోకీమాన్‌ కంపెనీలు సంయుక్తంగా ఈ గేమ్‌ను అభివృద్ధి చేశాయి. ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కలిసి ఈ గేమ్‌ ఆడవచ్చు. ఇతర గేమ్స్‌లా ఒకే చోట కూర్చుని ఈ గేమ్ ఆడలేరు. యూజర్స్ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా, జీపీఎస్‌ సాయంతో ఈ గేమ్ దగ్గర్లోని ప్రాంతాలను వర్చువల్‌గా సూచిస్తుంది. వాటిని వెతుకుతూ బయట తిరుగుతూ ఈ గేమ్ ఆడాలి. ఈ ఏడాది పోకీమాన్‌ గో 1.2 బిలియన్ డాలర్లు సంపాదించి పెట్టింది. 


క్యాండీ క్రష్‌ సాగా (Candy Crush Saga)

పరిచయం అక్కర్లేని గేమ్‌. పిల్లల నుంచి పండు ముసలి వరకు మొబైల్‌ ఫోన్ ఉపయోగించడం తెలిసిన ప్రతిఒక్కరు ఆడగలిగిన గేమ్‌. ఉచితంగా ఎవరైనా ఈ గేమ్‌ను ఆడవచ్చు. ఒకే రకమైన క్యాండీలను ఒక చోట్ చేర్చి పజిల్‌ను సాల్వ్‌ చేస్తూ ఈ గేమ్ ఆడాలి. ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో డీఫాల్ట్‌గా ఈ గేమ్‌ ఉంటుంది. 2021లో క్యాండీ క్రష్‌ సాగా 1.2 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. కింగ్‌ కంపెనీ ఈ గేమ్‌ను డిజైన్ చేసింది. 


గరేనా ఫ్రీ ఫైర్ (Garena Free Fire)

2021లో యూజర్‌ ఛాయిస్‌ గేమ్‌ విజేతగా నిలిచింది. ప్రత్యర్థులను ఎదిరించి నిలవటమే ఈ గేమ్‌ లక్ష్యం. వేర్వేరు ప్రదేశాల్లో మనకి నచ్చిన ఆయుధాలను సేకరిస్తూ.. ప్రత్యర్థులను అంతమొందిస్తూ.. లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. 111 డాట్స్ స్టూడియో సంస్థ దీన్ని రూపొందించింది. ఈ ఏడాది గరేనా ఫ్రీ ఫైర్ 1.1 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. 

► Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని