
గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్స్ ఏంటంటే..?
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రయాణాలు లేకపోవడంతో మ్యాపింగ్, నావిగేషన్ సేవల వినియోగం తగ్గింది. అయితే ఈ సమయాన్ని గూగుల్ మ్యాప్స్ తన సేవలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకున్నట్లు తెలిపింది. జనసమూహాన్ని (Crowdedness) తెలియజేసే ఫీచర్తో పాటు మరో రెండు కొత్త ఫీచర్స్ని మ్యాప్స్లో పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు కొవిడ్-19 మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలకు ఉపయోగపడే 250 కొత్త ఫీచర్స్ని గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేశారట.
గతంలో గూగుల్ ఒక ప్రాంతానికి సంబంధించిన సమాచారం కోసం ఆ ప్రాంతంలో ముఖ్యమైన సమయాల్లో ప్రయాణించే వారి లొకేషన్ ఆధారంగా డేటాను సేకరించేది. దానితో పాటు స్థానిక ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ఇతర సంస్థల నుంచి సేకరించిన డేటాను కూడా విశ్లేషించేది. ఇటీవలే కొవిడ్-19 లేయర్ పేరుతో కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. ఇందులో ప్రతి ఏడు రోజులకు కొత్త కేసుల సంఖ్యతో పాటు కేసుల గ్రాఫ్లో హెచ్చుతగ్గులను చూపిస్తుంది. అలానే స్థానికంగా సేకరించిన సమాచారంతో ఆయా ప్రాంతాల్లో మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి, సంభవించిన మరణాల సంఖ్యను చూడొచ్చు.
తాజాగా గూగుల్ మ్యాప్స్లోని క్రౌడ్నెస్ డేటా ఫీచర్ని తీసుకొచ్చారు. ఇందులో మీరు ప్రయాణించాలనుకుంటున్న దారిలో ప్రజారవాణాకు సంబంధించిన వివరాలను చూపుతుంది. అంటే బస్సులు, రైళ్లు, మెట్రో, సబ్వే వంటి వాటిలో ఎక్కువ మంది ఎందులో ప్రయాణిస్తున్నారనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. దాని వల్ల మీరు మరో ప్రత్యామ్నాయం ద్వారా ప్రయాణించొచ్చు. అయితే ఇందులో మ్యాప్స్ యాప్లో యూజర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే లైవ్ స్టేటస్ని గుర్తించి సమాచారం అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ సమాచారం ప్రజల నుంచి వచ్చేది కావడంతో అన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండకపోచ్చని తెలిపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది పనిచేస్తుందని వెల్లడించింది.
అలాగే, గూగుల్ తన మ్యాప్స్ని ఫుడ్ డెలివరీకి అనుకూలమైన కేంద్రంగా మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్లలో ఫుడ్ డెలివరీ లైవ్ స్టేటస్, డెలివరీకి పట్టే సమయం, డెలివరీ ఛార్జీలు వంటి వివరాలను చూపిస్తున్నారట. కొద్ది రోజుల్లో ఈ ఫీచర్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్కి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.