
ఫౌజీ: కేవలం ఆట కాదు..అంతకు మించి..
ఇంటర్నెట్ డెస్క్: గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫౌజీ గేమ్ గణతంత్రదినోత్సవ కానుకగా జనవరి 26న విడుదల కాబోతోంది. పబ్జీపై నిషేధం విధించిన కొద్ది నెలల తర్వాత ఫౌజీ గేమ్ తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఆయనే ఈ గేమ్కి మెంటార్గా వ్యవహరిస్తున్నారు. అలానే ఫౌజీని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ అనే గేమింగ్ సంస్థ రూపొందించింది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఫౌజీ గురించిన పలు ఆసక్తికర విషయాలను మీ కోసం...
* చైనా యాప్లపై నిషేధం తర్వాత ఈ గేమ్ గురించి ప్రకటించడంతో చాలా మంది పబ్జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీని తీసుకొస్తున్నారని భావించారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదనీ..ఫౌజీ పూర్తిగా కథ ఆధారంగా ఉంటుందని..పబ్జీతో ఎలాంటి పోలిక లేదని స్టూడియో ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గోండల్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
* పబ్జీ తరహాలో ఫౌజీ రాయల్ యుద్ధ కళను పోలిన ఆట కాదు. ఇందులో ఆయుధాలు, గేమింగ్ మోడ్స్ ప్రస్తావన ఏమాత్రం ఉండదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో ఈ విషయం స్పష్టం అవుతుంది. గతేడాది గల్వాన్ లోయలో చైనా ఆర్మీని భారత సైనికులు నిలువరించిన తీరు..వారితో పోరాడిన దృశ్యాలను టీజర్లో చూపించారు.
* అవసరమైతే ఫౌజీ లైట్ వెర్షన్ను కూడా తీసుకొస్తామని గోండల్ వెల్లడించారు. ప్రస్తుతం విడుదలవుతున్న గేమ్ వెర్షన్ మిడ్ రేంజ్, హై ఎండ్ మొబైల్ ఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుందట. లైట్ వెర్షన్ కోసం యూజర్స్ నుంచి డిమాండ్ వస్తే తప్పకుండా భవిష్యత్తులో విడుదల చేస్తామని తెలిపారు.
* ఫౌజీని ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం గూగుల్ ప్లేస్టోర్లో విడుదల చేయనున్నారు. యాపిల్ యూజర్స్కి మాత్రం మరో ఏడాది ఎదురు చూపులు తప్పవు. అయితే ఐఓఎస్ వెర్షన్ వచ్చే ఏడాది ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. అలానే రాబోయే ఆరు నెలల్లో ఫౌజీ గేమింగ్ మోడ్స్ని ఓటీఏ అప్డేట్ ద్వారా అందివ్వనున్నారట.
* ముఖ్యంగా యూజర్ డేటా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవరిస్తున్నారు. ఇది పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన గేమ్ కావడంతో యూజర్స్ డేటా దేశం దాటి వెళ్లదని స్పష్టం చేశారు. అలానే యూజర్ డేటాకు సంబంధించిన పూర్తి సమాచారం దేశీయంగా ఉన్న సర్వర్లలోనే భద్రపరుస్తున్నట్లు ఎన్కోర్ సంస్థ తెలిపింది.
* మన దేశ సైనికుల త్యాగాలకు సంబంధించిన విశేషాలతో పాటు వారి శౌర్య, పరాక్రమాలను తెలియజేసేలా ఫౌజీ గేమ్ రూపుదిద్దుకుంటున్నట్లు గేమ్ గురించి ప్రకటన సందర్భంగా అక్షయ్ కుమార్ వెల్లడించారు.
ఇవీ చదవండి..
ఫోన్ ఛార్జింగ్..మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.