Android 13: ఆండ్రాయిడ్ 13 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్ల వివరాలివే!

గూగుల్ స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆండ్రాయిడ్‌లో మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ డెవలపర్ ప్రివ్యూని పరీక్షల నిమిత్తం విడుదల చేసింది. 

Published : 12 Feb 2022 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్: గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్‌) ఆండ్రాయిడ్‌లో ఏటా అప్‌డేట్‌లను తీసుకొస్తూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. గతేడాది విడుదల చేసిన ఆండ్రాయిడ్ 12 పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాకముందే ఆండ్రాయిడ్ 13కు సంబంధించిన డెవలపర్‌ ప్రివ్యూని తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 12లో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లకు ప్రాధాన్యమిచ్చిన గూగుల్‌, ఆండ్రాయిడ్ 13లో ప్రైవసీ, సెక్యూరిటీని మెరుగుపరిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. పెద్ద స్క్రీన్‌ డివైజ్‌ల కోసం రూపొందించిన ఆండ్రాయిడ్ 12ఎల్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే ఆండ్రాయిడ్ 13 డెవలపర్‌ వెర్షన్‌ను విడుదల చేయడం గమనార్హం. మరి ఆండ్రాయిడ్ 13లో గూగుల్ ఎలాంటి ఫీచర్ల ఇవ్వనుందనే దానిపై ఓ లుక్కేద్దాం.. 

📲 ఫిబ్రవరిలో ఆండ్రాయిడ్ 13 మొదటి వెర్షన్ డెవలపర్‌ ప్రివ్యూని, మార్చిలో రెండో వెర్షన్ డెవలపర్ ప్రివ్యూని, ఏప్రిల్‌లో ఆండ్రాయిడ్ 13 బీటా 1ను, మేలో బీటా 2ను, బీటా 3ని  జూన్‌లో, బీటా 4ను జులైలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

📲 ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ను గూగుల్ పిక్సెల్‌ 4 సిరీస్‌, పిక్సెల్‌ 5 సిరీస్‌తోపాటు, పిక్సెల్ 6 ప్రో యూజర్లు తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుని పరీక్షించవచ్చు. పిక్సెల్ 3 మోడల్స్‌ను మాత్రం ఆండ్రాయిడ్ 13 సపోర్ట్ చేయదని గూగుల్ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ 13లో గోప్యత, భద్రతతోపాటు మెరుగైన యాప్‌ వినియోగాన్ని అందించేలా ఇందులో మార్పులు చేసినట్లు గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. అలానే థీమ్డ్‌ యాప్‌ ఐకాన్స్‌ను కూడా పరిచయం చేయనుంది. 

📲 గతంలో క్లౌడ్‌ స్టోరేజ్‌లో ఉన్న ఫొటోలు ఇతరులకు షేర్ చేయాలంటే వాటికి సంబంధించిన యాప్‌లలోకి వెళ్లి షేర్ చేయాల్సిందే. ఆండ్రాయిడ్ 13లో ఈ సమస్యకు గూగుల్ పరిష్కారం చూపనుంది. మొబైల్ గ్యాలరీ నుంచే క్లౌడ్‌ స్టోరేజ్‌లోని ఫొటోలు ఇతరులకు షేర్‌ చేసేలా సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల యూజర్‌ గోప్యత, భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. 

📲 యాప్‌ల వినియోగానికి సంబంధించి ‘నియర్‌బై వైఫై డివైజెస్‌’ పేరుతో గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యాప్‌లు లొకేషన్‌ అనుమతి లేకుండానే దగ్గర్లోని వైఫై పాయింట్లను గుర్తించి వాటి ద్వారా సదరు డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయి. మొబైల్‌ యాప్‌లలో యూజర్లు తమకు నచ్చిన భాషను ఎంచుకునేలా పర్‌-యాప్‌ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్‌ పేరుతో మరో ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఇందుకోసం కొత్త ఏపీఐ (అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌)ను రూపొందించారు. గ్రాఫిక్స్‌, టెక్ట్స్‌, రీడింగ్ పరంగా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన మార్పులు చేసినట్లు గూగుల్ తెలిపింది. ఇంకా ఏవేం ఫీచర్లు రానున్నాయనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని