CES 2022: టెక్‌ సదస్సులో ది బెస్ట్‌ గ్యాడ్జెట్లు ఇవే!

సీఈఎస్‌-2022 టెక్‌ సదస్సులో ఈసారి సరికొత్త మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లూ ఎక్కడా తగ్గలేదు. వాటిలో ది బెస్ట్‌..

Updated : 10 Jan 2022 20:53 IST

కొవిడ్‌ నిబంధనలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య సీఈఎస్‌-2022 టెక్‌ సదస్సు ముగిసింది. అత్యాధునిక ఆవిష్కరణలతో ఈ వేదికగా ఎప్పటిలాగే సందడిని తలపించింది. ముఖ్యంగా వాహన శ్రేణిలో ఎలక్ట్రానిక్‌ కార్లు, బైక్‌లు, డ్రైవర్‌లెస్‌ వాహనాలు అలరిస్తే.. పలు గృహోపకరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటే టెక్‌ వేడుకలో సరికొత్త మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లూ ఎక్కడా తగ్గలేదు. వాటిలో ది బెస్ట్‌ గ్యాడ్జెట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..  

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ

కరోనా కారణంగా టెక్‌ సదస్సుకు పలు దిగ్గజ కంపెనీలు దూరమైనా.. శాంసంగ్‌ తన కొత్త మోడల్‌ ‘గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ (Samsung Galaxy S21 FE)’తో 2022 ఏడాదిని ప్రారంభించింది. ఈ మేరకు సీఈఎస్‌-2022 వేడుకలో ఈ 5జీ మొబైల్‌ను ప్రదర్శనకు పెట్టింది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ ఆధారిత వన్‌ యూఐ4 ఓఎస్‌తో ఇది రన్‌ అవుతుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 240 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 888, ఎక్సినోస్‌ 2100 ప్రాసెసర్లు వీటిలో ప్రత్యేకతలు. అలాగే వెనుకవైపు 12 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 8 ఎంపీ టెలీషూట్, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఇందులోని వైర్‌లెస్‌ ఛార్జింగ్ ఫీచర్‌తో ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్‌ చేయవచ్చు. 

ఈ మోడల్‌ను శాంసంగ్‌ రెండు వేరియంట్ల (8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌/256 జీబీ)లో అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా దీనిని భారత్‌లోనూ విడుదల చేసింది. ఈ మేరకు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 128 వేరియంట్‌ ధర రూ.54,999గా, 256 జీబీ ధరను రూ.58,999గా నిర్ణయించింది. 


పేపర్‌ను ప్రతిబింబించేలా..

ఎలక్ట్రానిక్‌ దిగ్గజ కంపెనీ టీసీఎల్‌ పలు ఉత్పత్తులను సీఈఎస్‌-2022లో ఆవిష్కరించింది. వాటిలో టీసీఎల్‌ బుక్‌ 14, టీసీఎల్‌ ట్యాబ్‌ 10 ఎల్‌, టీసీఎల్‌ టెకీ వంటివి ఉన్నాయి. వీటిల్లో ‘టీసీఎల్‌ నెక్స్ట్‌పేపర్‌ 10 ఎస్‌ (TCL Nxtpaper 10s)’ ట్యాబ్‌ అమితంగా ఆకట్టుకుంటోంది. 1200x1920 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ 10.10 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్‌, 8,000 ఎంఏహెచ్‌ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, 64 జీబీ స్టోరేజీ, 258 జీబీ స్టోరేజీతో ఈ ట్యాబ్లెట్‌ వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇతర ట్యాబ్‌ల మాదిరి కాకుండా నిజమైన పేపర్‌ అనుభూతిని ప్రతిబింబించేలా దీనిని టీసీఎల్‌ అభివృద్ధి చేసింది. తద్వారా బ్లూలైట్‌ ఎక్సోపోజర్‌ను సాధ్యమైనంత మేరకు తగ్గించి కళ్లకు ఈ ట్యాబ్లెట్‌ రక్షణ కల్పించనుంది. జనవరి చివరికల్లా మార్కెట్‌లోకి రానుంది. 


అసుస్‌ ఫోల్డింగ్‌ ల్యాపీ

ప్రపంచంలోనే మొదటి సారిగా 17.3 అంగుళాల ఫోల్డింగ్‌ ల్యాప్‌టాప్‌ను సీఈస్‌-2022లో అసుస్‌ ప్రదర్శించింది. అసుస్‌ జెన్‌బుక్ 17 ఫోల్డ్‌గా నామకరణం చేసిన ఈ ల్యాపీ డిస్‌ప్లే మూసివేస్తే 12.5 అంగుళాలు, తెరిస్తే 17.3 అంగుళాలు ఉంటుంది. 12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ను దీనిలో ఉపయోగించారు. బ్లూటూత్ కీబోర్డ్, టచ్‌ప్యాడ్‌ అదనం. ఫలితంగా ల్యాప్‌టాప్‌ మాదిరే కాకుండా టాబ్లెట్‌, పీసీగా దీనిని వాడుకోవచ్చు. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఆటోమెటిక్‌ కలర్ సెన్సార్, నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ, 5 ఎంపీ వెబ్‌ క్యామ్‌ వంటివి వీటిలో మరిన్ని ప్రత్యేకతలు. అయితే, అసుస్‌ జెన్‌బుక్ 17 ధర, విడుదల తేదీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. 

అలాగే ‘Rog Flow Z13’ పేరిట అసుప్‌ పవర్‌ఫుల్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ను ఈ వేడుకలో ప్రదర్శించింది. 13.0 అంగుళాల డిస్‌ప్లే, 16 జీబీ ర్యామ్‌, విండోస్‌ 11, 1 టీబీ ఇన్‌బిల్డ్‌ స్టోరేజీతో ఈ ల్యాప్‌టాప్‌ వస్తుంది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని