Joker: మాల్‌వేర్.. మళ్లీ వస్తోంది.. జాగ్రత్త!

గత కొంత కాలంగా జోకర్‌ మాల్‌వేర్‌తో హ్యాకర్స్‌ ప్లేస్టోర్‌లోని యాప్‌లపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి తరుచుగా మాల్‌వేర్‌ ఉన్న యాప్‌లను డిలీట్‌ చేస్తోంది. యూజర్స్ కూడా సదర యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని సూచిస్తోంది...

Updated : 17 Jul 2021 14:02 IST

ఇంటర్నెట్‌డెస్క్: గత కొంత కాలంగా జోకర్‌ మాల్‌వేర్‌తో హ్యాకర్లు ప్లేస్టోర్‌లోని యాప్‌లపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ ప్లేస్టోర్.. తరచుగా మాల్‌వేర్‌ ఉన్న యాప్‌లను డిలీట్‌ చేస్తోంది. యూజర్స్ కూడా అలాంటి యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని సూచిస్తోంది. అయితే హ్యాకర్ల నుంచి రక్షణ కల్పించడంలో భాగంగా యాప్‌ డెవలపర్స్ ఎప్పటికప్పుడు తమ యాప్‌లను అప్‌డేట్ చేస్తుంటారు. ఇప్పుడు హ్యాకర్లు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్న జోకర్ మాల్‌వేర్‌ను అప్‌డేట్ చేసి కొత్త వెర్షన్‌తో ప్లేస్టోర్‌లోని యాప్‌లపై దాడి చేస్తున్నట్లు గుర్తించామని సైబర్‌ రీసెర్చ్‌ నిపుణులు తెలిపారు. దీంతో గత నాలుగేళ్ల కాలంలో జోకర్ మాల్‌వేర్‌ ఉన్న 1,800కి పైగా ఆండ్రాయిడ్ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు జిమ్‌పెరియమ్‌ అనే సైబర్ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది.

ఈ మాల్‌వేర్ ఎక్కువగా కెమెరా యాప్స్‌, గేమింగ్ యాప్స్, మెసేంజర్ యాప్స్, ఫొటో ఎడిటింగ్ యాప్స్, ట్రాన్స్‌లేషన్ యాప్స్‌, వాల్‌పేపర్ యాప్స్‌పై దాడి చేస్తున్నట్లు తెలిపారు. అప్‌డేటెడ్ మాల్‌వేర్‌ను ప్లేస్టోర్‌లోని యాప్‌లోకి ప్రవేశపెట్టిన వెంటనే అది యాప్‌ కోడ్‌ని స్కాన్ చేస్తుంది. అందులో సదరు యాప్‌ లేటెస్ట్ వెర్షన్‌కి సంబంధించిన సమాచారం ఉంటే మాల్‌వేర్ మొబైల్‌ డివైజ్‌ నుంచి యూజర్ వివరాలను సేకరిస్తుందని తెలిపారు. ఒకవేళ లేటెస్ట్ వెర్షన్‌ కోడ్ లేకుంటే మాల్‌వేర్‌ స్తబ్ధుగా ఉంటుందని వెల్లడించారు. అందుకే ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలానే యూజర్స్ తమ డివైజ్‌లలో ఎప్పటికప్పుడు వైరస్‌ స్కాన్ రన్ చేయాలని సూచించారు. గూగుల్‌, యాపిల్ సంస్థలు కూడా యాప్‌లకు రివ్యూ ఇచ్చే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. దానివల్ల ఎలాంటి యాప్‌ను ఎంచుకుంటున్నామనేది యూజర్‌కి తెలుస్తుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని