ఆశా తోడుగా..

కరోనాతోనే కాదు.. కాలంతో పరుగులు పెట్టే జీవితంలో నానాటికీ మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఆప్యాయంగా పలకరించేవారే కరవవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరితనానికి చెక్‌ పెట్టేందుకు.. సామాజిక ఒత్తిళ్లను దూరం చేసేందుకు ఓ కంపెనీ పూనుకొంది.

Updated : 07 Apr 2021 11:45 IST

సైన్స్‌ సంగతులు

ఏడాది క్రితం.. ఇవే రోజులు..  మర్చిపోగలమా? బయట కాలు పెట్టాలంటే భయం, ఎవరిని కలవాలన్నా.. ఎవరితో మాట్లాడాలన్నా.. ఏది తినాలన్నా.. భయం భయం! అలా కరోనా కేసులు పెరుగుతున్న రోజులవి. ఇంటిపక్క వ్యక్తికో.. ఆఫీసులో మనతోపాటు పనిచేసే సహోద్యోగికో కొవిడ్‌ సోకిందంటే చాలు.. అంటరాని వ్యక్తిలా సమాజం నుంచి వేరుచేశారు. మనిషికి మనిషే సాయం చేయలేని అలాంటి దుస్థితిలో ఓ రోబో నర్సు ముందుకొచ్చింది. తనదైన శైలిలో సేవలు అందించింది. ఇప్పుడు మరిన్ని అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యింది. వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు అండగా ఉంటానంటూ ముందుకొచ్చింది.

కరోనాతోనే కాదు.. కాలంతో పరుగులు పెట్టే జీవితంలో నానాటికీ మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఆప్యాయంగా పలకరించేవారే కరవవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరితనానికి చెక్‌ పెట్టేందుకు.. సామాజిక ఒత్తిళ్లను దూరం చేసేందుకు ఓ కంపెనీ పూనుకొంది. అందుకోసం ఓ రోబోని తయారుచేసింది. పేరు ‘ఆశా- ఏ రోబో నర్సు’. బెంగళూరుకు చెందిన ఏఐ, రోబోటిక్స్‌ టెక్నాలజీ పార్క్‌ దీన్ని రూపొందించాయి. గత ఏడాది బెంగళూరు టెక్‌ సమ్మిట్‌లో ఆవిష్కరించారు. అప్పట్లో కరోనా సోకిన వారికి సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకొచ్చినా.. ప్రస్తుతం ఆశాను మరోవిధంగా వాడుకునేందుకు ‘ఆర్ట్‌పార్క్‌’ ప్రయత్నాలు మొదలెట్టింది. వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు అండగా, ఇంటికే పరిమితమైన రోగులకు సంరక్షణగా నియమించడం కోసం ఆశా సామర్థ్యాలను పెంచే పనిలో ఉంది ఆర్ట్‌పార్క్‌. ప్రస్తుతం ఎంతోమంది ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం తల్లిదండ్రులను వదిలి దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో మలివయసులో పెద్దలు ఒంటరి వాళ్లయిపోతున్నారు. అలాంటి వారికి ఆశా రోబో తోడుగా ఉంటుంది. ‘హాయ్‌, హలో..’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది. తిన్నారోలేదో తెలుసుకుంటుంది. వారి అవసరాలను తీరుస్తుంది. అంతేకాదు హావభావాలనూ చక్కగా ప్రదర్శిస్తుంది. రిమోట్‌ ఆపరేషన్‌ల ద్వారా వస్తువులను నియంత్రించగలుగుతుంది. ప్రస్తుతం ఇంగ్లిషు, హిందీ, కన్నడ భాషల్లో మాట్లాడగలుగుతోంది. త్వరలో మరికొన్ని భాషల్లోనూ మాట్లాడేలా సిద్ధం చేస్తున్నారు. ఆశా రోబో చేతివేళ్లలో సెన్సర్‌లను అమర్చారు. దీంతో వస్తువులను వాటి పరిమాణం, బరువు ఆధారంగా పట్టుకుని తీసుకెళ్లగలుగుతుంది.

- నిఖిల్‌ గెంటిల, నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని