జలో రక్షతి రక్షితః

నీరే జీవం. నీరే జీవనం. ఆ మాటకొస్తే మహా మహా నాగరికతలన్నీ నదుల తీరంలోనే పురుడు పోసుకున్నాయి. తాగటానికే కాదు.. వంటలకు,  పంటలకు, స్నానాలకు, దుస్తులు ఉతకటానికి అన్నింటికీ నీరే కావాలి. లేకపోతే ఒక్కరోజైనా గడవదు. ఇంతటి విలువైంది కాబట్టే మన పూర్వికులు నీటి సంరక్షణకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. జలో రక్షతి రక్షితః అనే భావనతోనే నడచుకున్నారు...

Published : 09 Jun 2021 00:48 IST

నీరే జీవం. నీరే జీవనం. ఆ మాటకొస్తే మహా మహా నాగరికతలన్నీ నదుల తీరంలోనే పురుడు పోసుకున్నాయి. తాగటానికే కాదు.. వంటలకు,  పంటలకు, స్నానాలకు, దుస్తులు ఉతకటానికి అన్నింటికీ నీరే కావాలి. లేకపోతే ఒక్కరోజైనా గడవదు. ఇంతటి విలువైంది కాబట్టే మన పూర్వికులు నీటి సంరక్షణకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. జలో రక్షతి రక్షితః అనే భావనతోనే నడచుకున్నారు. ఇప్పుడూ అలాంటి విజ్ఞతే అవసరం. అవసరాలు పెరిగిపోతూ వనరులు తగ్గిపోతున్న తరుణంలో ఇది తక్షణావసరం కూడా. ఇందుకు వానాకాలం ఆరంభం కన్నా మంచి సమయం ఇంకేముంటుంది?

న భూమ్మీద 71 శాతం నీరే. అయితేనేం? చాలావరకు ఉప్పునీరే. సుమారు 97 శాతం నీరు మహా సముద్రాలు, సముద్రాల్లోనే ఉంది. అంటే మంచి నీరు దాదాపు 3 శాతమే అన్నమాట. ఈ మంచి నీటిలోనూ 70 శాతం నీరు హిమానీ నదాలు, మంచు ఖండాల రూపంలో ఉండగా.. మరో 29 శాతం భూగర్భంలో నిక్షిప్తమైంది. నదులు, చెరువుల్లో ఉండేది ఒక్క శాతమే. మన దాహం తీరటానికైనా, పంటలు పండించుకోవటానికైనా, వంటలు వండుకోవటానికైనా ఇదే ఆధారం. కొంతవరకు భూగర్భజలమూ ఆదుకుంటోంది. ఇంతటి అరుదైన, అమూల్యమైన, అమృతతుల్యమైన నీటిని ఇంకెంత అబ్బురంగా చూసుకోవాలి? ఈ సత్యాన్ని మన పూర్వికులు ఏనాడో గ్రహించారు. నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ప్రాంతాలు, వనరులు, అవసరాలను బట్టి నీటిని ఒడిసిపట్టి, ఒడుపుగా వాడుకోవటానికే ప్రయత్నించారు. గురుత్వాకర్షణ సూత్రం తెలుసో లేదో గానీ నీరు పల్లమెరుగనే జ్ఞానంతో ఎలాంటి పరికరాలు, యంత్రాల అవసరం లేని ఎన్నెన్నో పద్ధతులు, ప్రక్రియలు రూపొందించుకున్నారు. మనదగ్గర గొలుసుకట్టు చెరువుల వంటివన్నీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలే. ఎంత పురాతనమైనవైనా ఇవి ఇప్పటికీ ఉపయోగపడుతుండటం విశేషం. మామూలుగా కనిపించినా వీటి వెనక ఉన్నదంతా శాస్త్రీయ విజ్ఞానం, ఇంజినీరింగ్‌ నైపుణ్యమే. అలాంటి నీటి సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకొని, వాటి స్ఫూర్తితో మనం ఆధునిక విజ్ఞానాన్నీ జోడించి కొంగొత్త పద్ధతులను రూపొందించుకుంటే పుడమంతా అమృతతుల్యమే అవుతుంది!  

వెదురు బిందు సేద్యం!

బిందు సేద్యం (డ్రిప్‌ ఇరిగేషన్‌) గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కానీ ఇలాంటి పరిజ్ఞానాన్ని మేఘాలయలో 200 ఏళ్ల క్రితం నుంచే ఉపయోగిస్తున్నారంటే ఆశ్చర్యమే కదూ. అప్పుడు పైపులు లేవు కదా అనుకుంటున్నారేమో. వెదురు బొంగులతోనే దీన్ని సాధించటం విశేషం. హిమాలయ, ఈశాన్య ప్రాంతాల్లో చాలాచోట్ల సహజ ఊటలు, కాలువల్లోని నీటిని వెదురు బొంగుల ద్వారా దిగువకు ప్రవహించేలా చేసి, అనువైన చోట నిల్వ చేసుకుంటూ ఉంటారు. దక్షిణ మేఘాలయలో దీన్ని మరింత మెరుగుపరచి నేరుగా తమలపాకులు, మిరియాల సాగుకు వాడుకోవటం గమనార్హం. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కాలువలు నిర్మించటం కష్టం. మరి కొండల మీది సహజ ఊటల నుంచి నీటిని తీసుకురావటమెలా? ఇక్కడే వెదురు మంచి సాధనంగా కనిపించింది. వివిధ రకాల సైజుల వెదురు బొంగులను ఒక క్రమ పద్ధతిలో అమర్చి, మొక్కల దగ్గరికి వచ్చే సరికి నీటి ధారను బిందువులుగా పడేలా చేయటం దీని ప్రత్యేకత. ఆరంభంలో వెదురు బొంగుల్లోకి ప్రతి నిమిషానికి 18-20 లీటర్ల నీరు ప్రవేశిస్తుంటుంది గానీ మొక్కల వేళ్ల దగ్గర నిమిషానికి 20-80 చుక్కల నీరే పడుతుంది! దీంతో నీరు ఏమాత్రం వృథా కాదు. కేవలం వెదురు బొంగుల సైజు, ఆకారాలను మార్చటం ద్వారానే దీన్ని సుసాధ్యం చేశారు. గురుత్వాకర్షణ శక్తి, ప్రకృతి సాధనాలను వాడుకొని అప్పట్లోనే ఎంత విజ్ఞానాన్ని కనబరచారో!

చెరువులో బావి!

సలే వానలు తక్కువ. చుట్టుపక్కల భూగర్భ జలమంతా ఉప్పు నీరే. మంచి నీటి కోసం ఎప్పుడూ కటకటే. ఇలాంటి విపత్కర స్థితిలోనూ గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో నివసించే మాల్‌ధారీ తెగల ప్రజలు వినూత్న ఆలోచనతో తాగు నీటిని సంగ్రహించటం నేర్చుకున్నారు. మంచినీటి కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ. అంటే ఉప్పు నీటిపై వాన నీరు తేలుతుందన్నమాటే కదా. ఇదే మాల్‌ధారీలను ఆలోచింపజేసింది. చెరువులో బావుల్లాంటి ‘విర్దా’లకు ప్రాణం పోసింది. వానలు పడినప్పుడు నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలను గుర్తించి, లోతుగా ఉండే చోట్ల చిన్న చిన్న బావులను తవ్వటం ఇందులో కీలకాంశం. వాన నీరు మట్టి గుండా లోపలికి ఇంకుతుంది. ఇది భూగర్భజలం మీద తేలుతుంది. దీన్ని తాగటానికే కాదు, వివిధ అవసరాలకు వాడుకుంటారు. పూడుకొని పోకుండా బావులు చుట్టూ మొక్కలు, చెట్లను పెంచి సంరక్షించుకుంటారు కూడా.

నీటికి ఎరువు

నీటి సంరక్షణ, పశువుల పెంపకం, వ్యవసాయం, అడవుల రక్షణ.. అన్నీ కలిస్తే జాబో పద్ధతి. జాబో అంటే నీటి కట్టడి అని అర్థం. శతాబ్దాలుగా నాగాలాండ్‌లో అనుసరిస్తున్న ప్రక్రియ. స్థానికంగా రుజా వ్యవస్థ అనీ పిలుచుకుంటారు. కొండల మీద పల్లపు ప్రాంతాల్లో కుంటల వంటివి నిర్మించి, వర్షపు నీరు వీటిల్లోకి చేరుకునేలా చేయటం ఇందులో ప్రధానాంశం. దీన్ని తాగునీటిగానే కాదు, సాగు అవసరాలకూ వాడుకుంటారు. నీరు కుంటల నుంచి కాలువల ద్వారా కొండల దిగువకు వచ్చేటప్పుడు పశువుల కొట్టాల గుండా ప్రవహించేలా చేసి, పొలాలకు పారించటం గమనార్హం. పశువుల పేడ, మూత్రంతో కలిసిన నీరు పొలాలకు మంచి ఎరువుగానూ ఉపయోగపడుతుంది. ఈ నీటితో పొలాల్లో చేపలనూ పెంచుతారు. పోషకాలతో కూడిన నీరు మూలంగా చేపలు బాగా ఎదుగుతాయి కూడా. పొలాల గట్ల వెంట ఔషధ మొక్కలను పెంచటానికీ నీటిని వినియోగించుకుంటారు.

వాన నీటిని కట్టేసి..

‘నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు’ అనే సామెత తెలుసో లేదో గానీ పల్లానికి ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసి నిల్వ చేసుకోవచ్చని రాజస్థాన్‌ వాళ్లు ఏనాడో గ్రహించారు. అక్కడ నీటి ఎద్దడి ఎక్కువ. వేసవిలో ముంచుకొచ్చే నీటి కష్టాలు తెలియనివి కావు. అందుకే వర్షపు నీటిని ఒడిసిపట్టటం జైసల్మేర్‌, బల్మేర్‌ ప్రాంతాల్లో ఎప్పట్నుంచో అవలంబిస్తున్నారు. చిన్న ఆనకట్టలాంటి ‘ఖదిన్లు’ దీనికి మంచి ఉదాహరణ. ఇది వర్షపు నీరు జాలువారే ప్రాంతానికి దిగువన అడ్డంగా, ఎత్తుగా ఉండే చిన్నపాటి ఆనకట్టలాంటి నిర్మాణం. దీనిలోకి చేరిన నీటిని సాగుకు వినియోగిస్తారు. పొడి నేలల్లో ఉప్పు పెద్ద సమస్య. ఇది భూగర్భ జలాన్నీ ఉప్పునీటిగా మార్చేస్తుంది. అందుకే ఖదిన్లను తేలికైన ఉపాయంతో తాగు నీటి అవసరాలకూ వాడుకుంటున్నారు. నీరు నిల్వ ఉన్నప్పుడు కిందికి ఇంకుతుంది కదా. దీంతో భూగర్భజలం మట్టం పెరుగుతుంది. అందుకే ఖదిన్లకు కాస్త దూరంగా చిన్న చిన్న బావులను తవ్వుతారు. భూగర్భజలం మట్టం పెరిగినప్పుడు బావుల్లోకి నీరు ఉబికి వస్తుంది. ఇది తాగు నీటిగా ఉపయోగపడుతుంది. ఖదిన్లను 15వ శతాబ్దంలోనే పలివల్‌ బ్రాహ్మణులు రూపొందించారని భావిస్తున్నారు. ఇది క్రీస్తు పూర్వం 4,500లో ఇరాన్‌లో చేపట్టిన సాగు పద్ధతులను పోలి ఉండటం గమనార్హం.

‘పవిత్ర’ బావులు

కేరళలోని కురుమ తెగ ప్రజలు పాటించే పద్ధతే వేరు. ‘పవిత్ర’ తాటి బావులు వీరి ప్రత్యేకత. వీటిని పనమ్‌ కేని అని పిలుచుకుంటారు. తాటి మొదళ్లను చాలాకాలం నీటిలో నానబెట్టి, మధ్యలోని గుజ్జు వంటి భాగం పూర్తిగా క్షీణించేలా చేస్తారు. దీంతో గట్టిగా ఉండే పైభాగం మాత్రమే మిగులుతుంది. సుమారు 4 అడుగుల వ్యాసం, లోతుతో ఉండే వీటిని భూగర్భజలం ఎక్కువగా ఉండే ఊటలు, అడవుల్లో భూమిలో నాటుతారు. అప్పుడు ఇదొక చిన్నపాటి బావిలా మారుతుంది. వీటిల్లో ఎండకాలంలోనూ సమృద్ధిగా నీరు ఉంటుంది. వీటిని పవిత్ర బావులుగానూ పరిగణిస్తారు. దీని నీటిని తాగటానికి, వంటలకే వినియోగిస్తారు. స్నానానికి, ఉతకటానికి వాడరు. వీటి దగ్గరికి చెప్పులతో వెళ్లటాన్నీ తప్పుగా భావిస్తారు. ఇవి 500 ఏళ్ల కిందట్నుంచే వాడకంలో ఉన్నాయని చెబుతుంటారు.

మంచు నదిని పారించి..

ది మంచు ఎడారి. అయితేనేం వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఇదెలా సాధ్యమంటారా? హిమానీ నదాల నుంచి నీటిని ఒడిసిపట్టటం ద్వారా. హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్పితి ప్రాంతంలో అనుసరిస్తున్న విధానమిది. దీన్నే కులు సాగు పద్ధతి అంటారు. కులు అంటే కాలువ అని అర్థం. కొండ చరియలు దాటుకుంటూ చాలా దూరాలకు నీటిని చేరవేయటం వీటి ప్రత్యేకత. కొన్ని కులులు 10 కి.మీ. పొడవుంటాయి కూడా. హిమానీ నదాల ముఖద్వారం వద్ద నీటిని ఒడిసిపట్టటంతో వీటి కథ మొదలవుతుంది. బురద, మట్టి చేరకుండా వీటి అంచులకు రాళ్లను అమరుస్తారు. ఈ కాలువలు గ్రామంలో గుండ్రంగా నిర్మించిన చెరువులోకి నీటిని తీసుకొస్తాయి. అక్కడ్నుంచి వివిధ అవసరాలకు వాడుకుంటారు. కాలువలు, చెరువు, నీటి సరఫరాను నియంత్రించటానికి ప్రత్యేక వ్యవస్థ కూడా ఉండటం విశేషం. కులు పద్ధతిని శతాబ్దాల క్రితమే రూపొందించారు. కాకపోతే ఇప్పుడు వీటి పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటమే ఆందోళనకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని