మరణానంతర సోషల్‌ జీవనం!

ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా లెక్కలేనన్ని సామాజిక మాధ్యమాలు. ఫొటోలు, వీడియోలు, అభిప్రాయాలు ఎన్నెన్నో పంచుకుంటాం. వీటిల్లో ఖాతా గలవారు మరణించిన తర్వాత వారి పోస్ట్‌లన్నీ ఏమవుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మీయులు మరణించిన తర్వాత వారి దస్తావేజుల మాదిరిగానే సామాజిక మాధ్యమాల నిర్వహణ అత్యవసరం. దీన్నే డిజిటల్‌ వారసత్వమని అంటారు.

Updated : 03 Aug 2022 12:11 IST

ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా లెక్కలేనన్ని సామాజిక మాధ్యమాలు. ఫొటోలు, వీడియోలు, అభిప్రాయాలు ఎన్నెన్నో పంచుకుంటాం. వీటిల్లో ఖాతా గలవారు మరణించిన తర్వాత వారి పోస్ట్‌లన్నీ ఏమవుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మీయులు మరణించిన తర్వాత వారి దస్తావేజుల మాదిరిగానే సామాజిక మాధ్యమాల నిర్వహణ అత్యవసరం. దీన్నే డిజిటల్‌ వారసత్వమని అంటారు.

చిన్ననాటి స్నేహితులో, బంధువులో, మనకు బాగా పరిచయం ఉన్నవారో మరణిస్తే తెలిసిపోతుంది. కానీ కేవలం వర్చువల్‌గానే అనుబంధం గలవారికి, విదేశాల్లో ఎక్కడో ఉన్నవారికి ఈ సంగతి తెలియకపోతే? పాత పోస్ట్‌ మీద కామెంట్‌ చేయొచ్చు. లేదూ అనుచిత అంశాలకు ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేయొచ్చు. మరణించినవారి వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు దొంగిలించి అక్రమంగా వాడుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో మరణించినవారి ఖాతాలను డిలీట్‌ చేయటానికి వీలుంటుంది. కావాలంటే వాటిని ‘మెమరైజ్‌’ చేసి జ్ఞాపకాలుగా పదిల పరచుకోవచ్చు. అకౌంట్‌ను డిలీట్‌ చేయటానికి ముందు ఆయా సామాజిక మాధ్యమాల నియమ నిబంధనలను ఒకసారి పరిశీలించాలి. మెమరైజ్‌ చేయటానికి ఆయా సైట్లు వేర్వేరు విధానాలను పాటిస్తుంటాయి. ఇందుకోసం ముందుగా మరణించినవారి ప్రొఫైల్‌ లింక్‌, ఐడీ పత్రాలు, మరణ ధ్రువీకరణ పత్రం, వారితో మన సంబంధాన్ని తెలిపే ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.

ట్విటర్‌, పింట్రెస్ట్‌, లింక్డ్‌ఇన్‌

మృతుల ట్విటర్‌, పింట్రెస్ట్‌, లింక్డ్‌ఇన్‌ ఖాతాలను అలాగే కొనసాగించటానికి, లేదా డిలీట్‌ చేయటానికి అవకాశాలు ఉన్నాయి. పింట్రెస్ట్‌లోనైతే కుటుంబ సభ్యులు గానీ ఆస్తి హక్కు ప్రతినిధి గానీ ఖాతాను మూసేయొచ్చు. ట్విటర్‌లోనైతే మరణించినవారి వారసులు లేదా దగ్గరి బంధువులు ఖాతాను ఆపేయొచ్చు. ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం నకలుతో పాటు మరణించినవారి గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లింక్డ్‌ఇన్‌లోనైతే చివరిసారి పనిచేసిన కంపెనీ పేరు కూడా పేర్కొనాల్సి ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌

మృతుల దగ్గరి కుటుంబ సభ్యులు గానీ అధికారిక వారసులు గానీ ఫ్రొఫైల్‌ను తొలగించొచ్చు. ఖాతాను మెమరైజ్‌ చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మృతుల మరణ ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. అలాగే మరణించినవారికి తాము నిజమైన ప్రతినిధులమని ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

ఫేస్‌బుక్‌

మరణించినవారి ఖాతాలను మెమరైజ్‌ చేసుకోవటానికి, తమ తదనంతరం విశ్వసనీయమైన వ్యక్తి ఖాతాను నిర్వహించటానికి ఫేస్‌బుక్‌ వీలు కల్పించింది. ఇలా శ్రద్ధాంజలి రూపంలో ఆయా ఖాతాలను గుర్తు పెట్టుకోవటానికి అవకాశముంటుంది. మరణించిన తర్వాత తమ ఖాతాను చూసుకోవటానికి ఫేస్‌బుక్‌లో మేనేజ్‌ అకౌంట్‌ ఆప్షన్‌ ద్వారా స్నేహితుడిని నామినేట్‌ చేసుకోవచ్చు. అయితే నామినేట్‌ అయినవారు ప్రొఫైల్‌ పిక్చర్‌ను మార్చటం, శ్రద్ధాంజలి పోస్ట్‌ చేయటం, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌కు స్పందించటం మాత్రమే చేయగలరు. మెమరైజ్‌ అయిన పేజీ మిగతా పేజీల మాదిరిగానే కనిపిస్తుంది. కానీ వ్యక్తుల పేరు ముందు ‘రిమెంబరింగ్‌’ అనే పదం తోడవుతుంది. స్నేహితులు, కుటుంబసభ్యులు ఆయా ఖాతాల టైమ్‌లైన్‌ మీద పోస్ట్‌ చేయొచ్చు. అయితే వారి పుట్టినరోజు రిమైండర్‌ అందదు. అలాగే మరణించినవారు ‘సజెస్టెడ్‌ ఫ్రెండ్‌’ రూపంలో కనిపించరు. ప్రొఫైల్‌లో పోస్ట్‌ చేసిన వివరాలన్నీ అలాగే ఉంటాయి. ఒకవేళ ప్రొఫైల్‌ను డిలీట్‌ చేయాలనుకుంటే ఫేస్‌బుక్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని