ఇస్రో వినూత్న కృత్రిమ కాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వినూత్న మైక్రోప్రాసెసర్‌ నియంత్రిత మోకాలును (ఎంపీకే) అభివృద్ధి చేసింది. మోకాలు పైభాగం వరకు కాళ్లు తొలగించినవారు తూలిపోకుండా నడవటానికిది వీలు కల్పిస్తుంది. మైక్రోప్రాసెసర్లు జత చేయటం వల్ల దీనికి అదనపు సామర్థ్యాలు అబ్బాయి

Updated : 28 Sep 2022 10:55 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వినూత్న మైక్రోప్రాసెసర్‌ నియంత్రిత మోకాలును (ఎంపీకే) అభివృద్ధి చేసింది. మోకాలు పైభాగం వరకు కాళ్లు తొలగించినవారు తూలిపోకుండా నడవటానికిది వీలు కల్పిస్తుంది. మైక్రోప్రాసెసర్లు జత చేయటం వల్ల దీనికి అదనపు సామర్థ్యాలు అబ్బాయి. కొద్దిపాటి దన్నుతో వికలాంగులు కారిడార్‌లో 100 మీటర్ల వరకు అలవోకగా నడవటానికి తోడ్పడినట్టు ప్రయోగ పరీక్షలో తేలింది. ఈ కృత్రిమ కాలులో మైక్రోప్రాసెసర్‌, హైడ్రాలిక్‌ డాంపర్‌, లోడ్‌, మోకాలి కోణం సెన్సర్లు, మోకాలి కేస్‌, లియాన్‌ బ్యాటరీ, ఎలక్ట్రికల్‌ హార్‌నెస్‌, ఇంటర్ఫేస్‌ భాగాలు ఉంటాయి. సెన్సర్లు అందించే సమాచారం ఆధారంగా శరీరం తిన్నగా ఉందా? ఎటైనా తూలుతోందా? అనే విషయాన్ని మైక్రోప్రాసెసర్‌ గుర్తిస్తుంది. దీన్ని బట్టి తిన్నగా నడవటానికి ఎంత అవరోధం అవసరమనే సంగతిని సాప్ట్‌వేర్‌ అంచనా వేస్తుంది. ఈ సమాచారాన్ని బట్టి డీసీ మోటారుతో పనిచేసే హైడ్రాలిక్‌ డాంపర్‌ బిగువును మారుస్తుంది. ఫలితంగా శరీరం స్థిరంగా ఉండేలా నడవటానికి సాధ్యమవుతుంది. ఒకో మనిషి నడక తీరు ఒకోలా ఉంటుంది కదా. అందుకే పీసీ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను సెట్‌ చేయటం ద్వారా వికలాంగులకు అవసరమైనట్టుగా నడక ప్రమాణాలను సవరించుకోవటానికీ వీలుంటుంది. నడుస్తున్నప్పుడు ఇంటర్ఫేస్‌ అప్పటికప్పుడు ప్రమాణాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న పరికరాల కన్నా దీని ధర పది రెట్లు తక్కువగా ఉండటం విశేషం. దిగుమతి చేసుకుంటున్న ఎంపీకేల ధర రూ.10 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఉంటోంది. ఇస్రో తయారుచేసిన పరికరమైతే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని మరింత మెరుగుపరచటం మీదా ఇస్రో దృష్టి సారించింది. దీనికి మరిన్ని ‘తెలివితేటలు’ జొప్పించాలని ప్రయత్నిస్తోంది. ఎగుడు దిగుడుగా ఉన్న చోట్లా కింద పడిపోకుండా, తేలికగా నడిచేలా అధునాతన ఫీచర్లు జోడించనుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని