పొడవైన మ్యాంటిల్‌ రాయి!

భూమి మ్యాంటిల్‌కు సంబంధించి ఇంత పొడవైన రాతిని తీయటం ఇదే తొలిసారి! భూమి అంతర్భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు.

Updated : 14 Jun 2023 04:10 IST

అది అట్లాంటిక్‌ మహా సముద్రం. దానిలోపల ఓ పర్వతం. పేరు అట్లాంటిస్‌ మాసిఫ్‌. దీన్ని శాస్త్రవేత్తలు ఇటీవల తొలిచారు. 1,267 మీటర్ల లోతైన రంధ్రం చేశారు. భూమి అంతర్భాగంలో టెక్టోనిక్‌ ఫలకాల సరిహద్దుల వద్ద నుంచి కిలోమీటరు పొడవైన (3280 అడుగులు) రాతిని వెలికి తీశారు. దీని గొప్పతనమేంటో తెలుసా?
భూమి మ్యాంటిల్‌కు సంబంధించి ఇంత పొడవైన రాతిని తీయటం ఇదే తొలిసారి! భూమి అంతర్భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు. ఇది భూమి మ్యాంటిల్‌కు చెందినదే అయినా శాస్త్రవేత్తలు అంతవరకు ఏమీ తవ్వలేదు. టెక్టోనిక్‌ పరిధిని అవకాశంగా మలచుకున్నారు. ఈ ప్రాంతంలోకి భూమి లోపలి పొర రాళ్లు పైకి ఉబికి వస్తుంటాయి. వాటిని గుర్తించి, పర్వతానికి రంధ్రం చేసి రాయిని సంగ్రహించారు. సాధారణంగా భూమి మీద మ్యాంటిల్‌ రాళ్లు దొరకటం చాలా అరుదు. వీటిని సంగ్రహించటానికి అట్లాంటిస్‌ మాసిఫ్‌ పర్వతం చక్కటి వేదిక. ఇక్కడ టెక్టోనిక్‌ ఫలకాలు విడిపోతుంటాయి. అప్పుడు భూమి అంతర్భాగం నుంచి వేడి పైకి వచ్చే క్రమంలో తక్కువ సాంద్రత గల పదార్థాలు పైకి ఉబికి వస్తుంటాయి. పర్వతాలుగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి భాగం నుంచే పొడవైన రాతిని సంగ్రహించటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భూమి మ్యాంటిల్‌ను చేరుకోవటానికి పరిశోధకులు 1961 నుంచే ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టు మాహోల్‌లో భాగంగా పసిఫిక్‌ మహా సముద్రంలో తవ్వకం చేపట్టారు. భూమి పైపొర దాని కింద ఉండే మ్యాంటిల్‌తో కలిసే ప్రాంతానికి (మాహోరోవిసిక్‌ డిస్‌కంటిన్యుటీ) చేరుకోవాలనేది దీని ఉద్దేశం. కానీ సముద్ర మట్టం నుంచి కేవలం 601 అడుగుల లోతు మాత్రమే తవ్వగలిగారు. అనంతరం చాలా ప్రయత్నాలు జరిగాయి గానీ సఫలం కాలేదు. అందుకే తాజాగా వెలికి తీసిన రాయి ప్రాధాన్యం సంతరించుకుంది. అగ్ని పర్వతాలు, భూమి అయస్కాంత క్షేత్రం వంటి వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికిది సాయం చేయగలదని ఆశిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని