Google Photos: ఫొటోలు, వీడియోలు దాచేందుకు గూగుల్ ఫొటోస్‌ కొత్త ఫీచర్‌

ఫొటోలు, వీడియోల భద్రతకు సంబంధించి గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేసింది. లాక్‌ ఫోల్డర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ సాయంతో యూజర్స్‌ తమ వ్యక్తిగత ఫొటోలు ఇతరులకు కనిపించకుండా హైడ్ చేయొచ్చు.

Published : 05 Dec 2021 20:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి యూజర్ కోరుకునేది డేటా ప్రైవసీ. ముఖ్యంగా ఫొటోలు, వీడియోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వంటి వాటితోపాటు వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫొటోస్ (Google Photos) యూజర్స్‌కు మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ లాక్‌ ఫోల్డర్‌ (Lock Folder) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ గ్యాలరీలోని ఫొటోలను ఇతరులకు కనిపించకుండా చేస్తుంది. ఇప్పటి వరకు గూగుల్ పిక్సెల్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న లాక్‌ ఫోల్డర్ ఫీచర్‌ను ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌ (Android Phones) యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. లాక్‌ ఫోల్డర్‌ ఫీచర్‌ను గూగుల్‌ మే నెలలో నిర్వహించిన గూగుల్ ఐ/ఓ (ఇన్‌పుట్‌/అవుట్‌పుట్‌) ఈవెంట్‌లో ప్రకటించింది. యూజర్‌ తన ఫోన్‌లో ఏయే ఫొటోలు ఇతరులు చూడకూడదని అనుకుంటున్నారో వాటిని లాక్‌ ఫోల్డర్‌తో భద్రత కల్పించవచ్చు. ఉదాహరణకు మీ స్నేహితులు ఎవరైనా మీ ఫోన్‌లో ఫొటో గ్యాలరీ చూస్తుంటే మీరు లాక్‌ ఫోల్డర్‌ ఉంచిన ఫొటోల వారికి కనిపించవు. 

ఈ ఫీచర్‌ కోసం గూగుల్‌ ఫొటోస్‌ ఓపెన్ చేసి లైబ్రరీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో యుటిలిటీస్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే లాక్‌ ఫోల్డర్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పిన్‌ సెట్ చేయమని అడుగుతుంది. తర్వాత లాక్‌ ఫోల్డర్‌లో ఉంచాలనుకుంటున్న ఫొటోలను సెలెక్ట్‌ చేసి మూవ్‌ ఐటెమ్స్ అనే ఆప్షన్‌ ద్వారా లాక్‌ ఫోల్డర్‌లోకి తరలించాలి. ఈ ఫీచర్‌ ద్వారా స్టోర్ చేసిన ఫొటోలు బ్యాకప్‌లో ఉండవు. ఒకవేళ ఈ ఫొటోలు మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా వేరే ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఒకవేళ ఫోన్‌ నుంచి గూగుల్ ఫొటోస్‌ యాప్‌ డిలీట్ చేస్తే లాక్‌ ఫోల్డర్‌లోని ఫొటోలు డిలీట్ అయిపోతాయని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ 6 ఆపై వెర్షన్‌ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఫోన్లలో పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్స్‌కు ఈ ఫీచర్‌ను యాపిల్‌ ఫోన్లలో తీసుకురానున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని