Google PlayStore: ఫోన్‌లో ఈ యాప్‌లు ఉంటే బ్యాటరీ, డేటా ఖాళీ.. వెంటనే తొలగించండి!

యూజర్‌ ప్రమేయం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో వెబ్‌పేజీలు ఓపెన్‌ చేసి, ప్రకటనలపై క్లిక్ చేస్తూ మొబైల్‌ డేటాను ఖాళీ చేస్తున్న 16 యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. యూజర్లు కూడా వెంటనే తమ ఫోన్‌ నుంచి వీటిని తొలగించాలని సూచించింది. 

Published : 23 Oct 2022 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక సూచన చేసింది. ఫోన్‌ బ్యాటరీ, డేటాను త్వరగా ఖాళీ చేస్తున్న 16 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. యూజర్లు కూడా వెంటనే సదరు యాప్‌లను తమ డివైజ్‌ల నుంచి తొలగించాలని సూచించింది. ఫ్లాష్‌లైట్‌, కెమెరా, క్యూఆర్‌ రీడింగ్‌, యూనిట్ కన్వర్టర్స్‌, టాస్క్‌ మేనేజర్‌ వంటి యుటిలిటీ యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.  ఇవి యూజర్‌ ప్రమేయం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో వెబ్‌ పేజ్‌లు ఓపెన్ చేసి ప్రకటనలపై క్లిక్ చేస్తున్నట్లు గుర్తించామని మెకాఫే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.  దీనివల్ల  ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గడంతోపాటు, డేటా కూడా త్వరగా అయిపోతుందని గూగుల్ తెలిపింది. 

యూజర్లు తమ అవసరాల కోసం ఈ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత హెచ్‌టీటీపీ రిక్వెస్ట్ సాయంతో ఒక రిమోట్ కాన్ఫిగరేషన్‌ను డౌన్‌లోడ్ చేస్తాయి. తర్వాత ఫైర్‌బేస్‌ క్లౌడ్‌ మెసేజింగ్‌ ద్వారా డెవలపర్‌కు పుష్‌ మెసేజెస్‌ పంపుతూ  ఉంటాయి. వాటి సాయంతో డెవలపర్‌ యూజర్‌కు తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో పలు వెబ్‌సైట్లు ఓపెన్ చేసి ప్రకటనలపై క్లిక్ చేసి లబ్ది పొందుతున్నట్లు మెకాఫే తెలిపింది. దీనివల్ల యూజర్‌ ఫోన్ బ్యాటరీ, డేటా వినియోగం పెరుగుతుందని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో మాల్‌వేర్‌ను యూజర్‌ డివైజ్‌లలో ప్రవేశపెట్టి వ్యక్తిగత సమాచారంతోపాటు, బ్యాంకింగ్ వివరాలను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటి వరకు ఈ యాప్‌లను సుమారు 20 మిలియన్‌ యూజర్లు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు మెకాఫే తన నివేదికలో పేర్కొంది. యూజర్లు ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తుంటే వెంటనే ఫోన్‌ నుంచి తొలగించాలని సూచించింది. మెకాఫే పూర్తి నివేదిక, యాప్‌ల జాబితా కోసం క్లిక్‌ చేయండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని