సీఈఎస్‌ 2021లో అదరగొట్టిన బెస్ట్ ఉత్పత్తులివే..

టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన  కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో 2021 జనవరి 11 తేదీన ప్రారంభమై జనవరి 14 తేదీన ముగిసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ భారీ టెక్ ఈవెంట్‌లో భవిష్యత్తులో రాబోయే ఎన్నో రకాల ఉత్పత్తులను ఆవిష్కరించారు.... 

Published : 19 Jan 2021 23:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌) 2021 జనవరి 11న ప్రారంభమై 14న ముగిసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ భారీ టెక్ ఈవెంట్‌లో భవిష్యత్‌లో రాబోయే ఎన్నో రకాల ఉత్పత్తులను ఆవిష్కరించారు. కొవిడ్‌-19 ప్రభావంతో ఈ ఏడాది ఆవిష్కరణల్లో హెల్త్‌కేర్ ఉత్పత్తులే అధికం. వాటితో పాటు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకున్నవీ ఉన్నాయి. మరి అందులో వీక్షకుల మనసుల్ని గెలుకున్నవి కొన్నయితే.. ఆయా విభాగాల్లో అత్యుత్తమంగా నిలిచినవి మరికొన్ని. అవేంటో ఒక్కసారి చూద్దాం..


హెచ్‌పీ ఇలైట్‌ డ్రాగన్‌ఫ్లై మాక్స్‌

ఇంటి నుంచి పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌పీ కంపెనీ.. ఇలైట్‌ డ్రాగన్‌ఫ్లై మాక్స్‌ పేరిట ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. కొవిడ్‌-19 నేపథ్యంలో గ్రూప్‌ డిస్కషన్స్‌ అన్నీ ల్యాపీల్లోనే జరుగుతున్నాయి. అలాంటి వారి కోసం ఇందులో అధిక సామర్థ్యం కలిగిన నాలుగు మైక్రోఫోన్‌లు, 5 ఎంపీ కెమెరా ఉన్నాయి. వాటితో పాటు ఎక్కువ సేపు స్క్రీన్‌ చూసినా కళ్లకు ఒత్తిడి కలగకుండా ఉండేందుకు ఐసేఫ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. 11వ జనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌తో పాటు 5జీ కనెక్టివిటీ, 13.3 అంగుళాల స్క్రీన్‌ ఇస్తున్నారు.


ఏసర్‌ క్రోమ్‌బుక్‌ స్పిన్‌ 514

ఏసర్‌ కంపెనీ క్రోమ్‌బుక్‌ స్పిన్‌ 514 పేరుతో కొత్త ల్యాపీని తీసుకొచ్చింది. దీనిలో ఏఎం‌డీ రైజెన్‌ 3000 సి ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గూగుల్‌తో కలిసి ఏఎం‌డీ కంపెనీ ఈ ప్రాసెసర్‌లను రూపొందించింది. తక్కువ ధరలో అధిక సామర్థ్యం ల్యాప్‌టాప్‌లు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. క్రోమ్‌ ఓఎస్‌తో ఈ ల్యాపీ పనిచేస్తుంది.


ఎల్‌జీ & టీసీఎల్ రోలింగ్‌ ఫోన్‌ 

ఎల్‌జీ కంపెనీ ప్రదర్శించిన రోలింగ్ ఫోన్‌ ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ ఫోన్‌ స్క్రీన్‌లకు ఇది పూర్తి భిన్నం. దీని డిస్‌ప్లేని అవసరమైనప్పుడు పెద్దదిగా మార్చుకునే వీలుంది. ఓఎల్‌ఈడీ రోలింగ్ డిస్‌ప్లే ఉపయోగించారు. ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్న మడతబెట్టే ఫోన్లకు ఇది పూర్తి భిన్నం. టీసీఎల్‌ కంపెనీ సైతం టీవీ స్క్రీన్‌ తరహాలో పెద్ద రోలింగ్ డిస్‌ప్లే ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్క్రీన్‌కి రెండు వైపులా గొట్టాలు ఉంటాయి. స్క్రీన్‌ అవసరమైనప్పుడు వాటిని రెండు వైపులకు లాగితే ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఈ ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నారు.


ఓఎల్‌ఈడీ టీవీలు

మొబైల్‌ తర్వాత ఎక్కువ మంది కొనుగోలు చేసేది టీవీలే. అందుకే టెక్‌ కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్‌తో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. సీఈఎస్‌ 2021లో శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ, టీసీఎల్‌ కంపెనీలు సరికొత్త టీవీలను ప్రదర్శించాయి. శాంసంగ్‌ మైక్రో ఎల్‌ఈడీ 4K టీవీ, ఎల్‌జీ జీ1 ఓఎల్‌ఈడీ టీవీ, సోనీ ఏ90జే ఓఎల్‌ఈడీ టీవీ, టీసీఎల్ 6 సిరీస్‌ 8K మోడల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

* శాంసంగ్‌ మైక్రో ఎల్‌ఈడీ 4K టీవీ 88, 99, 110 అంగుళాల స్క్రీన్‌ సైజుల్లో లభిస్తుంది. ఈ ఏడాది చివర్లో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తారని సమాచారం. సాధారణ ఓఎల్‌ఈడీ టీవీ, క్యూఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే మైక్రో ఎల్‌ఈడీ టీవీ పిక్సెల్స్‌ ఎక్కువ. అందుకే దీని ధర కూడా ఎక్కువే ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.    

* క్యూ ఎల్‌ఈడీ టీవీలకు పోటీగా సోనీ, ఎల్‌జీ కంపెనీలు హై బ్రైట్‌నెస్‌తో ఓఎల్‌ఈడీ టీవీలను తీసుకొచ్చాయి. సోనీ ఏ90జే, ఎల్‌జీ జీ1 పేరుతో రానున్న ఈ టీవీల్లో హెచ్‌డీఆర్‌ (హై డైనమిక్‌ రేంజ్‌) వీడియోలను ఎలాంటి ఆటంకం లేకుండా వీక్షించొచ్చు. ఎల్‌జీ జీ1లో గ్యాలరీ డిజైన్‌ ఫీచర్ ఇస్తున్నారు. దీనివల్ల టీవీ గోడలో ఇమిడిపోయిన అనుభూతి కలుగుతుంది. ఇక సోనీ ఏ90జేలో అకోస్టిక్‌ సర్ఫేస్‌ ఆడియో+ టెక్నాలజీ ఉపయోగించారు. 

* ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 8K రిజల్యూషన్‌ టీవీలకు పోటీగా టీసీఎల్ కంపెనీ 6 సిరీస్‌ 8K టీవీని ప్రదర్శించింది. అయితే దీని ధరెంత? ఎలాంటి ఫీచర్లున్నాయి? ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా తెలియరాలేదు.

* ఇవి కాకుండా గేమింగ్ ప్రియుల కోసం ఎల్‌జీ కంపెనీ 48 అంగుళాల గేమింగ్ డిస్‌ప్లేని తీసుకొచ్చింది. ఇటీవల విడుదల చేసిన ప్లేస్టేషన్‌ 5, ఎక్స్‌బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో 42 అంగుళాల ఓఎల్‌ఈడీ టీవీ ప్యానెల్ ఉపయోగించారు. ఈ మోడల్‌ని ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తారనేది మాత్రం తెలియరాలేదు. 


టీసీఎల్‌ ఆల్టో ఆర్‌1 సౌండ్‌బార్‌

ఎంత మంచి పాటయినా మంచి సౌండ్‌ సిస్టంలో వింటేనే మజా ఉంటుంది. అందుకే సంగీత ప్రియులు సౌండ్‌ సిస్టం కోసం ఖర్చుకు వెనకాడరు. అలాంటి వారి కోసం టీసీఎల్ కంపెనీ ఆల్టో ఆర్‌1 పేరుతో సౌండ్‌బార్‌ను తీసుకొచ్చింది. ఇందులో డాల్బీ అట్‌మోస్‌, అడ్వాన్స్‌డ్‌ ఆడియో ఫీచర్స్‌ ఉన్నాయి. దీని ధర, విడుదల తేదీపై పూర్తి సమాచారం లేదు. 


శాంసంగ్ బాట్‌ హ్యాండ్‌ 

గృహ అవసరాల కోసం శాంసంగ్ కంపెనీ బాట్ హ్యాండ్ పేరుతో రోబో హ్యాండ్‌ను ఆవిష్కరించింది. చేతి ఆకారాన్ని పోలి ఉండే ఈ రోబో ఇంటి పనుల్లో సాయపడడంతో పాటు, గదులను శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, బట్టలను వాషింగ్‌ మెషీన్‌లో వేయడం, వంట పాత్రలను డిష్‌వాషర్‌లో వేయడం వంటి పనులు చేస్తుంది. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ రోబో హ్యాండ్ త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 


స్కాజెన్‌ జోర్న్‌ హైబ్రిడ్ హెచ్‌ఆర్‌ వాచ్‌ 

ఫాసిల్ కంపెనీకి చెందిన స్కాజెన్‌ జోర్న్‌ హైబ్రిడ్ హెచ్‌ఆర్‌ పేరుతో స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. చూడ్డానికి సాధారణ వాచ్‌ తరహాలోనే ఉంటుంది. ఇందులో కనెక్టివిటీ ఫీచర్స్‌తో పాటు హెల్త్‌కేర్ ఫీచర్స్‌ ఉన్నాయి. అల్వేస్‌-ఆన్‌-ఈ-ఇంక్‌ డిస్‌ప్లే, హార్ట్‌రేట్ మానిటర్‌, యాక్టివిటీ ట్రాకర్‌, ఫోన్ నోటిఫికేషన్‌ డెలివరీ, స్లీప్‌ ట్రాకర్‌, జీపీఎస్‌ కనెక్టివిటీ ఫీచర్స్‌ ఉన్నాయి. క్లాసిక్‌ లుక్‌తో స్మార్ట్‌వాచ్‌ కావాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. ధర 195 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.15,000. 


కోహ్లెర్‌ స్టెయిన్‌లెస్‌ బాత్

స్నానం చేసేప్పుడు స్పా అనుభూతిని అందించేందుకు కోహ్లెర్ కంపెనీ స్టెయిన్‌లెస్‌ టబ్‌ పేరుతో బాత్ టబ్‌ను ఆవిష్కరించింది. జపనీస్‌ సోకింగ్ బాత్స్‌ స్ఫూర్తితో ప్రత్యేకమైన హినోకి చెక్కను ఇందులో ఉపయోగించారు. ఇంకా సాఫ్ట్ ఎల్‌ఈడీ లైటింగ్, ఫైన్‌ ఫాగ్‌, సువాసనతో కూడిన ఆయిల్స్‌ విడుదల చేసే టెక్నాలజీ ఉన్నాయి. వాయిస్‌ కమాండ్స్‌ను స్వీకరిస్తుంది. దీని ప్రారంభ ధర 6,000 డాలర్లు. 


మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎమ్‌బీయూఎక్స్‌ హైపర్‌ స్క్రీన్‌

ఆటోమొబైల్ విభాగంలో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎం‌బీయూ ఎక్స్‌ హైపర్‌ స్క్రీన్‌ వీక్షకులను ఆకట్టుకుంది. 56 అంగుళాల పొడవుండే ఈ టచ్‌ స్క్రీన్‌ను మూడు విభాగాలుగా విభజించారు. డ్రైవర్‌కు సమాచారాన్ని అందింజే డిజిటల్ కన్సోల్, 17.7 అంగుళాల టచ్‌ స్క్రీన్, ముందు సీటు ప్రయాణికుల వీడియోలను చూసేందుకు మిగిలిన స్క్రీన్‌ను కేటాయించారు. ఇది ఏఐ సాయంతో పనిచేస్తుంది. త్వరలోనే అన్ని మెర్సిడెజ్‌ ఎలక్ట్రిక్‌ కార్లలో దీన్ని అమర్చనున్నారు. 


సోనీ జీ మాస్టర్ లెన్స్‌

స్మార్ట్‌ఫోన్‌తో ఎంతటి కెమెరా ఇచ్చినా.. డీఎస్‌ఆర్‌ఎల్‌ కెమెరాలకున్న ఆ క్రేజే వేరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే సోనీ కంపెనీ ఫుల్‌-ఫ్రేమ్‌ మిర్రర్‌లెస్‌ కెమెరాల కోసం ఎఫ్‌ఈ 35 ఎం‌ఎం ఎఫ్‌1.4 జీ మాస్టర్‌ లెన్స్‌ను తీసుకొచ్చింది. దీంతో వీడియోలు, హై-క్వాలిటీ ఫొటోలు తీయొచ్చు.


కేర్‌క్లెవర్‌ క్యూటీ

ఇప్పటి వరకు మనం భిన్న ఆకృతుల్లో కంపానియన్‌ రోబోలను చూసుంటాం. ఇంట్లో ఒంటిరిగా ఉండే వృద్ధులకు ఇవి ఎంతో ఉపయోగకరం. కొవిడ్‌-19 ప్రభావంతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావడంతో అమెరికా, యూరప్‌ దేశాల్లో వీటి వినియోగం పెరిగింది. అటువంటి వారి కోసం క్యూటీ కంపెనీ కేర్‌క్లెవర్ పేరుతో కంపానియన్ రోబోట్‌ను తీసుకొచ్చింది. ఇది వృద్ధుల, ఒంటరిగా ఉండే వారి అవసరాలకు తగినట్లుగా సాయపడుతుంది. అత్యవసర సేవలకు ఫోన్ చేయడం, ఇంట్లో లైట్లు ఆఫ్‌ చేయడం, ఇంట్లోకి బయటికి వెళ్లినప్పుడు డోర్ వరకు రావడం, రోజువారీ పనులను గుర్తుచేయడం వంటివి చేస్తుంది.

వీటితో పాటు సీఈఎస్ 2021లో ఇన్ఫినిటీ గేమింగ్ టేబుల్, కోహ్లెర్ టచ్‌లెస్‌ టాయిలెట్‌, నోబీ ఫాల్‌సీలింగ్ ల్యాంప్‌, రేజర్ ప్రాజెక్ట్‌ హాజిల్ స్మార్ట్‌మాస్క్‌, కాడిలాక్‌ ఎగిరే కారు వంటివి ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని