కొత్త ఏడాదిలో..వాట్సాప్‌ కొత్త ఫీచర్స్‌! 

కొత్త సంవత్సరంలో కూడా యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో కొన్ని యూజర్స్‌కి ఆందోళన కలింగించేవయితే మరికొన్ని వాట్సాప్‌ వినియోగాన్ని మరింత సులభతరం చేసేవి. ఆ ఫీచర్లేంటో..అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.. 

Published : 01 Jan 2021 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: గడిచిన ఏడాదిలో టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొవిడ్‌-19 ప్రభావంతో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడే పరిస్థితి లేకపోయింది. దీంతో కమ్యూనికేషన్‌ కోసం ఎక్కువ మంది మొబైల్ యాప్స్‌ ఉపయోగించడం ప్రారంభించారు. ముఖ్యంగా వర్క్‌ ఫ్రం హోం చేసే ఉద్యోగులు వాట్సాప్ వంటి ఇన్‌స్టా మెసేజింగ్ యాప్స్‌ వినియోగం పెరిగింది. దీంతో యూజర్స్‌ కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్స్‌ తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే  2020లో కేవలం ఆరు నెలల వ్యవధిలో సుమారు పదికి పైనే కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. అలానే కొత్త సంవత్సరంలో కూడా యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో కొన్ని యూజర్స్‌కి ఆందోళన కలింగించేవైతే మరికొన్ని వాట్సాప్‌ వినియోగాన్ని మరింత సులభతరం చేసేవి. ఆ ఫీచర్లేంటో..అవి ఎలా పనిచేస్తాయో..వాటి వల్ల వాట్సాప్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయో తెలుసుకుందాం.. 


వెబ్‌ ఆడియో/వీడియో కాలింగ్

(Photo Credit: WABetaInfo)

ఎంతో కాలంగా మొబైల్‌ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన ఆడియో/వీడియో కాలింగ్ ఫీచర్‌ని త్వరలోనే డెస్క్‌టాప్‌ వెర్షన్‌కి తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. గతేడాదే వాట్సాప్‌ దీని గురించి ప్రకటన చేసినప్పటికీ ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నారనేది మాత్రం వెల్లడించలేదు. అయితే ఇప్పటికే ఈ ఫీచర్‌ను అమెరికాలో కొంత మంది యూజర్స్‌కి అందుబాటులోకి రావడంతో త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో వీడియో కాల్ వచ్చినప్పుడు ప్రత్యేక విండోలో కాల్ యాక్సెప్ట్‌/రిజెక్ట్‌ చేసే ఆప్షన్‌ ఉంటుంది. అలానే ఇతరులకు మనం కాల్ చేసినప్పుడు కాల్‌ స్టేటస్‌ చూపిస్తూ పాప్‌-అప్ విండో ఓపెన్ అవుతుంది.  


వాట్సాప్‌ కొత్త నిబంధనలు 

2021 పిబ్రవరి 8 తేదీ నుంచి వాట్సాప్‌ కొత్త పాలసీని తీసుకురానుంది. ఇందులో భాగంగా కొత్త టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ అంగీకరించని యూజర్స్‌ వాట్సాప్‌ ఖాతా పనిచేయదు. నకిలీ, స్పామ్‌ ఖాతాల తొలగింపులో భాగంగా ఈ తరహా నిబంధనలు అమలు చేయనున్నట్లు వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అలానే వాట్సాప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్ అందించే అన్ని రకాల సేవలకు సంబంధించిన ఛాటింగ్‌‌ సమాచారం వ్యాపార అవసరాల కోసం ఉపయోగించడం కోసం ఈ విధమైన మార్పులు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ప్రస్తుతానికి వాట్సాప్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. 


మల్టీ డివైజ్ సపోర్ట్‌

ఇప్పటి వరకు వాట్సాప్‌ ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. వెబ్‌ వెర్షన్‌ మినహాయిస్తే రెండు ఫోన్లలో ఒకేసారి ఉపయోగించుకునే అవకాశం లేదు. దీంతో రెండు డివైజ్‌లో వాట్సాప్‌ ఉపయోగించాలనుకునేవారు ప్రతిసారీ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో వాట్సాప్‌ ఈ సమస్యకు చెక్ పెడుతూ మల్టీ డివైజ్‌ సపోర్ట్ తీసుకురానుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫీచర్ యూజర్స్ అందుబాటులోకి రానుందట. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్‌ ఉపయోగించుకోవచ్చు. 


గ్రూప్‌ కాలింగ్‌ రింగ్‌టోన్‌ 

వాట్సాప్‌ కొత్త ఏడాదిలో తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర్‌ గ్రూప్‌ కాలింగ్ రింగ్‌టోన్ కస్టమైజేషన్. దీని సహాయంతో గ్రూప్‌ కాల్‌కు ప్రత్యేకమైన రింగ్‌టోన్ పెట్టుకునే అవకాశం ఉంది. దాంతో మనకు వచ్చేది గ్రూప్‌ కాల్‌ లేదా వ్యక్తిగత కాల్ అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ గ్రూప్‌ కాల్‌ అయితే వెంటనే అలర్ట్‌ కావచ్చు. 


ఒకేసారి మరిన్ని ఫొటోలు/వీడియోలు

ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఛాట్ చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఫొటోలు/వీడియోలు పేస్ట్ చేసే అవకాశం లేదు. అయితే కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌లో ఛాట్ బార్‌లో ఒకే సారి ఎక్కువ ఫొటోలు/వీడియోలు పేస్ట్‌ చేసుకోవచ్చు. అంటే మీ ఫోన్‌లో ఫొటో గ్యాలరీలో ఫొటోలు సెలెక్ట్‌ చేసి వాటిని కాపీ చేసి తర్వాత వాట్సాప్‌ ఓపెన్‌ చేసి ఛాట్‌ బార్‌లో పేస్ట్ చెయ్యొచ్చు. 

ఇవే కాకుండా వాట్సాప్‌ మరికొన్ని ఆసక్తికర ఫీచర్స్‌ని ఈ ఏడాదిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఎవరైనా ఇతరుల వాట్సాప్‌ ఖాతాలపై ఆరోపణలు చేస్తే వాట్సాప్‌ చర్యలు తీసుకుంటుంది. కానీ, ఆరోపణలు చేసిన వారు సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలానే ఇతరులకు పంపే వీడియోలతోపాటు, స్టేటస్‌లో పోస్ట్ చేసే వీడియోలను మ్యూట్ చేసుకునే ఫీచర్‌ని కూడా తీసుకొస్తున్నారని తెలుస్తోంది. 

ఇవీ చదవండి..

పోల్‌: 2021లో  మొబైల్స్‌ ఎలా ఉండాలి?

గూగుల్ కొత్త పాలసీ..ఏం చేయాలో తెలుసా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని