March Smartphones: మార్చిలో మార్కెట్లోకి రాబోయే మొబైల్స్‌ ఇవే!

కొత్త మోడల్స్‌తో ఆకట్టుకునేందుకు మొబైల్‌ కంపెనీలు... సరికొత్త ఫోన్స్‌ కొనడానికి వినియోగదారులు ఎప్పుడూ రెడీయే.

Updated : 28 Feb 2022 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త మోడల్స్‌తో ఆకట్టుకునేందుకు మొబైల్‌ కంపెనీలు... సరికొత్త ఫోన్స్‌ కొనడానికి వినియోగదారులు ఎప్పుడూ రెడీయే. మార్చిలో అలా కొన్ని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వరుసకట్టనున్నాయి. మిడ్‌ రేంజ్‌ నుంచి హై ఎండ్‌ ధరల్లో... సరికొత్త టెక్నాలజీ, అద్భుతమైన ఫీచర్లతో ఈ మొబైల్స్‌ రాబోతున్నాయి. మరి ఆ మోడల్స్‌ జాబితాపై ఓ లుక్కేద్దామా! 


ఐఫోన్‌ ఎస్‌ఈ 3 (iPhone SE3)

మార్చి రెండు లేదా మూడో వారంలో ఐఫోన్‌ ఎస్ఈ3 విడుదలకానుందని సమాచారం. ఇందులో ఏ 15 బయోనిక్‌ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4.7 అంగుళాల హెచ్‌డీ రెటీనా డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కోమ్‌ ఎక్స్‌60 5జీ మోడెమ్‌ను ఉపయోగించారు. ఐఓఎస్‌ 15తో పని చేస్తుంది. టచ్‌ ఐడీ, వాటర్‌ రెసిస్టెంట్‌ ఫీచర్స్‌ ఉంటాయి. ఎస్‌ఈ 3లో రెండు కెమెరాలుంటాయి. వెనుక 12ఎంపీ, ముందు 7ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. మొబైల్‌ ధర రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉంటుందని సమాచారం. 


శాంసంగ్‌ ఎమ్‌ 33 5జీ (Samsung M33 5G)

మార్చి నాలుగో వారంలో శాంసంగ్‌ ఎమ్‌ 33 5జీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 6.46 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎగ్జినోస్‌ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందువైపు 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌ యూఐ 4.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. 25 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ/8 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ధర విషయాలు తెలియాల్సి ఉంది.


వివో టీ1 ప్రో (Vivo T1 Pro)

టీ1 సిరీస్‌లో రెండు మోడల్స్‌ను వివో భారత మార్కెట్లోకి ఇప్పటికే విడుదల చేసింది. మార్చిలో టీ1 ప్రో సిరీస్‌లో 4జీ, 5జీ మోడల్స్‌ను తీసుకురానుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు మూడు, ముందు రెండు కెమెరాలుంటాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 8 జీబీ/ 12 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌ టచ్‌ ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందట. 


ఒప్పో ఎఫ్‌ 21 సిరీస్‌ (Oppo F 21 Series)

ఎఫ్‌ సిరీస్‌లో రెండు మోడల్స్‌ను మార్చి రెండో వారంలో ఒప్పో విడుదల చేయనుంది. ఎఫ్‌ 21 పేరుతో వస్తున్న ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 720జీ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.43 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ మొబైల్‌ ప్రారంభ ధర రూ.20 వేలు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.  ఈ మొబైల్‌కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G)

వన్‌ప్లస్‌ నుంచి మరో 5జీ మొబైల్‌ విడుదల కానుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 6.7 అంగుళాల 2k డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ మొబైల్‌ తీసుకొస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1  ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 5జీ ప్రాసెసర్‌. 50 ఎంపీ హేజల్‌బ్లేడ్‌ కెమెరాలున్నాయి. మార్చి మూడో వారంలో ఈ మొబైల్‌ విడుదలవుతున్నట్లు సమాచారం. దీంతోపాటు వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ కూడా వస్తుందని సమాచారం. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ (OnePlus Nord CE 2 Lite) పేరుతో ఈ మొబైల్‌ తీసుకొస్తారట. ఇందులో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. మార్చి మూడో వారంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలకానుంది. 


రెడ్‌మీ నోట్‌ 11 ప్రో సిరీస్‌ (Redmi Note 11 Pro Series)

రెడ్‌మీ మొబైల్‌ శ్రేణిలో పాపులర్‌ సిరీస్‌ అయిన నోట్‌ సిరీస్‌లో కొత్త మొబైల్ తీసుకొస్తున్నారు. మార్చి రెండు లేదా మూడో వారంలో రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెడ్‌మీ నోట్‌ 11 ప్రో, రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌ మోడల్స్‌ విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 67 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయంతో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 


పోకో ఎక్స్‌4 సిరీస్‌ (Poco X4 Series)

పోకో ఎక్స్‌ సిరీస్‌లో రెండు మోడల్స్‌ తీసుకొస్తోంది. వీటిలో ఒకటి 5జీ ఫోన్. 120 హెర్జ్‌ 6.67 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మార్చి చివరి వారంలో ఈ మొబైల్‌ విడుదల కానుంది. పోకో జీటీ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. ఎఫ్4 జీటీ (Poco F4 GT) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


మైక్రోమాక్స్‌ ఇన్‌2 (Micromax In2)

ఇన్‌ సిరీస్‌లో మైక్రోమాక్స్‌ మరో మొబైల్‌ను లాంచ్‌ చేయనుంది. ఇన్‌ 2 పేరుతో తీసుకొస్తున్న ఈ మొబైల్‌లో... 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. మార్చి రెండు లేదా మూడో వారంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలకానుంది. 


షావోమి 12 సిరీస్‌ (Xiaomi 12 Series)

షావోమి 12 సిరీస్‌ మొబైల్స్‌ కూడా ఈ నెలలోనే రానున్నాయి. ఈ మొబైల్స్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.28 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 50 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 5జీకి సపోర్టు చేస్తుంది. 67 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో  ఈ మొబైల్‌ తీసుకొస్తున్నారు.


రియల్‌మీ జీటీ 2 (Realme GT 2)

జీటీ సిరీస్‌లో రియల్‌మీ రెండు మోడల్స్‌ను తీసుకొస్తుంది. రియల్‌మీ జీటీ 2, రియల్‌మీ జీటీ 2 ప్రో పేరుతో మొబైల్స్‌ విడుదలచేయనుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.62 అంగుళాల 2K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు అదనంగా రెండు కెమెరాలు ఇస్తున్నారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. వీటితోపాటు రియల్‌మీ 9  (Realme 9) మోడల్‌ను 4జీ, 5జీ వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌, 18 వాట్‌ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇస్తున్నారట. మార్చి చివరి వారంలో ఈ మొబైల్ విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని