Microsoft: ఆ బగ్‌ విలువ రూ. 22 లక్షలు 

సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్‌డేట్‌ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిలో కూడా లోపాలు ఉంటుంటాయి. అలాంటి వాటిని ముందుగానే కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారిని నగదు బహుమతి అందజేస్తుంటాయి సదరు కంపెనీలు...

Updated : 29 Jun 2021 16:42 IST

గెలుచుకున్న భారతీయ యువతి

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్‌డేట్‌ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిలో కూడా లోపాలు ఉంటుంటాయి. అలాంటి వాటిని ముందుగానే కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారిని నగదు బహుమతి అందజేస్తుంటాయి సదరు కంపెనీలు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్ సర్వీస్‌ అజ్యూర్‌లో బగ్‌ కనుగొన్నందుకు రూ. 22 లక్షల బహుమతిని అందుకొంది దిల్లీకి చెందిన 20 ఏళ్ల అదితి సింగ్‌. మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్ క్లౌడ్ సిస్టంలో ఆర్‌సీఈ (రిమోట్ కోడ్ ఎక్సిక్యూషన్‌) బగ్‌ను అదితి కనిపెట్టింది. దీని సాయంతో సైబర్‌ నేరగాళ్లు సులువుగా ఇంటర్నల్ సిస్టంలోకి ప్రవేశించి అందులోని సమాచారాన్ని పొందగలరని గుర్తించింది. ఇదే విషయాన్ని రెండు నెలల క్రితమే అదితి మైక్రోసాఫ్ట్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే మైక్రోసాఫ్ట్‌ దీనిపై వెంటనే స్పందిచలేదు. బగ్‌ ఉన్న ప్రోగ్రాంను యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకోలేదని నిర్థారించుకున్న తర్వాత లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది.

ఆర్‌సీఈ బగ్‌ గురించి అదితి మాట్లాడుతూ డెవలపర్స్ ఎన్‌పీఏ (నోడ్‌ ప్యాకేజ్‌ మేనేజర్‌)ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కోడ్ రాయాలని సూచించింది. అలానే ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, మైక్రోసాఫ్ట్‌, మొజిల్లా, పేటీఎం, ఎథీరియమ్‌, హెచ్‌పీ వంటి దిగ్గజ కంపెనీల్లో  సుమారు 40 వరకు బగ్‌లను కనుగొన్నట్లు తెలిపింది. మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‌పై దృష్టి సారించినట్లు అదితి చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు అదితి అందుకున్న ప్రోత్సాహకాల్లో మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్ అందించిన రూ. 22 లక్షలు పెద్ద మొత్తం కావడం విశేషం. భవిష్యత్తులో తన బగ్‌ బౌంటీని
కొనసాగిస్తానని అదితి తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని