Android Smartphone: పాత ఫోన్‌కు కొత్త హంగులు.. ఎలాగంటే?

కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారీ పాత ఫోన్‌ అమ్మేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. కొంత మంది ఏడాదికో మోడల్ ఫోన్ మారుస్తుంటే.. మరికొంతమంది ఏళ్ల తరబడి ఒకే మోడల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు.

Updated : 14 Aug 2022 18:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారీ పాత ఫోన్‌ అమ్మేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. కొంత మంది ఏడాదికో మోడల్ ఫోన్ మారుస్తుంటే.. మరికొంతమంది ఏళ్ల తరబడి ఒకే మోడల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. అయితే, పాత ఫోన్‌ కొన్నాళ్లు వాడిన తర్వాత దాని పనితీరు నెమ్మదిస్తుంది. తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతమాత్రన ఫోన్‌ మార్చాల్సిన అవసరం లేదు. కేవలం చిన్నపాటిి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలి? అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


అలాంటి యాప్స్‌కు గుడ్‌బై

అవసరానికో అబద్ధం అన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుత జీవనశైలిలో అవసరానికో యాప్‌ తయారైంది. ఆర్థిక లావాదేవీల నుంచి ఆన్‌లైన్ క్లాసుల వరకు.. గేమ్స్‌ నుంచి షాపింగ్ వరకు ప్రతి అవసరానికీ మొబైల్ యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో చాలా వరకు మనం ఒకసారి కంటే ఎక్కువసార్లు ఉపయోగించం. అలాంటి యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. అనవసరమైన ఇలాంటి యాప్స్‌ వల్ల ఫోన్‌ స్టోరేజీ నిండిపోతుంది. వీటిలో కొన్ని రకాల యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతుండటంతో ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. అందుకే ఫోన్‌లో మీకు అవసరంలేని యాప్స్‌ ఏవైనా ఉంటే వెంటనే వాటినీ డిలీట్ చేయండి.

అలానే ఫోన్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వచ్చిన యాప్స్‌లో మీరు అవసరంలేని ఉంటే వాటిని డిజేబుల్ చెయ్యొచ్చు. అలాగే యాంటీ వైరస్‌, టాస్క్‌ కిల్లర్‌ యాప్స్‌ ఉంటే వాటిని కూడా తొలగించండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ అనే ఫీచర్‌ గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్‌లో మాల్‌వేర్‌ను స్కాన్ చేసి తొలగిస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా యాప్స్‌ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా మీరు ఉపయోగించని యాప్స్‌ను డిలీట్ చేస్తే ఫోన్ సామర్థ్యం మరింత మెరుగవుతుంది.


వాల్‌పేపర్‌.. విడ్జెట్స్‌ వద్దే వద్దు

మీరు పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ ఉపయోగిస్తుంటే.. దాని పనితీరు గతంలో కంటే నెమ్మదిస్తే లైవ్‌ వాల్‌పేపర్స్‌, విడ్జెట్స్‌ను డిలీట్ చేయడం ఉత్తమం. ప్రస్తుత ఫోన్లలో ర్యామ్‌, ఆధునిక ప్రాసెసర్లుతో వస్తుండటంతో వాటికి అనుగుణంగా లైవ్‌ పేపర్స్‌, విడ్జెట్స్ వంటి పీచర్లు ఇస్తున్నారు. అయితే కొన్ని పాత ఫోన్లలో ఓఎస్‌ అప్‌డేట్ చేసినప్పుడు ఈ ఫీచర్లు వస్తున్నాయి. ఇవి ఫోన్ హోం స్క్రీన్‌ను ఎంతో ఆకర్షణీయంగా మారుస్తున్నప్పటికీ పాత ఫోన్ల ర్యామ్‌, ప్రాసెసర్‌, బ్యాటరీ వంటి వాటి పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వాటిని డిలీట్ చేయమని సూచిస్తున్నారు టెక్ నిపుణులు.


అప్‌డేట్లు మరవకండి..

చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్ అపరేటింగ్ సిస్టం (ఓఎస్‌) అప్‌డేట్ గురించి పెద్దగా పట్టించుకోరు. అప్‌డేట్ గురించి నోటిఫికేషన్ ద్వారా సూచించినా ఇన్‌స్టాల్ చేయరు. అయితే వీటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పాత ఓఎస్‌లో ఉన్న లోపాలను సరిచేసి, ఫోన్‌ పనితీరును మెరుగుపరిచే ఫీచర్స్‌ను కొత్త ఓఎస్‌లో తీసుకొస్తారు. అందుకే ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. అలానే యాప్స్‌లో ఉండే లోపాల్ని సరిచేసి కొత్త ఫీచర్స్‌తో యాప్ అప్‌డేట్‌ను విడుదల చేస్తారు. వాటికి అప్‌డేట్ వచ్చినా తప్పక ఇన్‌స్టాల్‌ చేయాలి.


గో-ఎడిషన్, లైట్‌ యాప్స్‌ ఉన్నాయిగా..

ఫోన్‌లో యాప్స్‌ ఎక్కువ స్టోరేజీ ఉపయోగించకుండా ఉండేందుకు ఉన్న మరో ప్రత్యామ్నాయం గో-ఎడిషన్, లైట్ యాప్స్‌. ఇప్పటికే చాలా వరకు యాప్‌లు యూజర్ సౌకర్యార్ధం ఈ వెర్షన్ యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ర్యామ్‌, ప్రాసెసర్‌, ఓఎస్‌ తక్కువ సామర్థ్యంతో ఉంటాయి. వీటికి అనుగుణంగా గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలతోపాటు ఇతర యాప్‌ డెవలపర్స్ గో-ఎడిషన్‌, లైట్ యాప్స్‌ను అందిస్తున్నారు. సాధారణ యాప్స్‌కు బదులు వీటిని ఉపయోగించొచ్చు.


ఫ్యాక్టరీ రీసెట్

మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉన్న మరో ఆప్షన్ ఫ్యాక్టరీ రీసెట్. ఇది ఫోన్‌లోని అనవసరమైన ఫైల్స్‌ని తొలగించి ఫోన్‌ కొన్నప్పుడు ఏవిధంగా ఉండేదో అలా మారుస్తుంది. అయితే ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసేముందు అందులోని సమాచారాన్ని మరో చోట సేవ్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే ఫోన్‌లోని మొత్తం సమాచారం డిలీట్ అయిపోతుంది. అలానే మీ ఫోన్ కొన్నప్పుడు ప్రీ-ఇన్‌స్టాల్‌గా వచ్చిన యాప్స్‌ కూడా ఉంటాయి. అందులో మీకు అవసరంలేని వాటిని డిలీట్ చేసి.. మీకు అవసరం ఉన్న యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని