James Bond Movie: జేమ్స్‌ బాండ్ సినిమాలో నోకియా ఫోన్లు.. వివరాలివే!

జేమ్స్‌ బాండ్ 25వ చిత్రం నో టైమ్‌ టు డైలో మూడు నోకియా కంపెనీ ఫోన్లు కనిపించనున్నాయి. వీటిలో ఒక మోడల్‌ను 00 ఏజెంట్ నోమి ఉపయోగించడం ప్రత్యేక టీజర్‌లో చూడొచ్చు. మిగిలిన మోడల్స్ ఎక్కడ ఉపయోగించారనేది తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 

Updated : 23 Nov 2022 11:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాక్షన్‌ చిత్రాల్లో జేమ్స్‌బాండ్ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పటి వరకూ జేమ్స్‌బాండ్ సిరిసీలో 24 చిత్రాలు వచ్చాయి. జేమ్స్‌బాండ్ 25వ చిత్రంగా డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్‌ టు డై’ రానుంది. భారత్‌లో సెప్టెంబరు 30న విడుదలవుతుండగా, అమెరికాలో అక్టోబరు 8న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నోకియా కంపెనీ తయారుచేసిన మూడు స్మార్ట్‌ఫోన్లు కనిపించనున్నాయి. అవి నోకియా ఎక్స్‌ఆర్‌20, నోకియా 8.3 5జీ, నోకియా 7.2 మోడల్స్‌. వీటిలో నోకియా ఎక్స్‌ఆర్‌ 20 మోడల్‌ను 00 ఏజెంట్ నోమి ఉపయోగిస్తుండటం ప్రత్యేక టీజర్‌లో చూడొచ్చు. 

దీనికి సంబంధించి నోకియా ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో నోమి బైక్‌పై వచ్చిన తర్వాత భవనంపై నుంచి దుండగులను గమనిస్తూ వారి గురించిన సమాచారం కోసం నోకియా ఎక్స్‌ఆర్‌ 20 ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ సాయం కోరుతుంది. తర్వాత ఎమ్‌కి ఫోన్ చేయమని అడుతుంది. తర్వాత ఫోన్ కనెక్షన్ సెక్యూరేనా అని అవతలి వ్యక్తి అడిగినప్పుడు.. ఇది నోకియా ఫోన్ అని సమాధానం ఇవ్వటం వీడియోలో చూడొచ్చు.  మరి బాండ్‌ సినిమాలో ఉపయోగించిన ఫోన్‌లలో ఎలాంటి ఫీచర్లున్నాయి.. వాటి ధరెంత వంటి వివరాలను చూద్దాం. 


నోకియా ఎక్స్‌ఆర్‌20

ఈ ఫోన్‌లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 19 రకాల 5జీ బ్యాండ్‌విడ్త్‌లను సపోర్ట్ చేస్తుంది.‌ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,630 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 15 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర 514 డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ. 38,000 ఉంటుందని అంచనా. 


నోకియా 8.3 5జీ

ఇందులో 6.81 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు సెల్ఫీల కోసం 24 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 6 జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్, 8 జీబీ/128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర 435 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 32 వేలు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


నోకియా 7.2 

నోకియా 7.2 కూడా ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 45 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 20 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ. 19,999 ఉంటుందని అంచనా.

నోకియా ఎక్స్‌ఆర్‌20 మోడల్ మినహా మిగిలిన రెండు మోడల్స్‌ సినిమాలో ఎక్కడ ఉపయోగించారనేది తెలియాల్సి ఉంది. వాటికి సంబంధించి ఎలాంటి విజువల్స్‌ను నోకియా కానీ, జేమ్స్‌ బాండ్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ కానీ విడుదల చేయలేదు. అలానే ప్రతి బాండ్ సినిమాలో జేమ్స్ బాండ్ క్యారెక్టర్‌ ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఫోన్‌ని వినియోగిస్తుంటాడు. ఈ సారి బాండ్ ఏ కంపెనీ మొబైల్ ఉపయోగించాడనే దానిపై ఆసక్తి నెలకొంది. అలానే నో టైమ్‌ టు డై సినిమాలో పైన పేర్కొన్న మూడు మోడల్స్‌తోపాటు నోకియా 3310 మోడల్‌ను కనిపించనుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని