కొత్త ఏడాదిలో గేమర్స్‌కు సోనీ గుడ్ న్యూస్‌.. 

కొత్త ఏడాదిలో గేమింగ్ ప్రియులకు సోనీ తీపు కబురు చెప్పింది. గేమర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోని ప్లేస్టేషన్‌ 5 విడుదల తేదీని వెల్లడించింది.... 

Published : 01 Jan 2021 21:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఏడాదిలో గేమింగ్ ప్రియులకు సోనీ తీపి కబురు చెప్పింది. గేమర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోని ప్లేస్టేషన్‌ 5 (పీఎస్‌5) విడుదల తేదీని వెల్లడించింది. ఫిబ్రవరి 12న పీఎస్‌5ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రీ-ఆర్డర్స్‌ జనవరి 12 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, గేమ్స్‌ ది షాప్‌, విజయ్‌ సేల్స్‌తో పాటు అన్ని అధీకృత సోనీ స్టోర్లలో ప్రీ-ఆర్డర్స్‌ చెయ్యొచ్చు.

పీఎస్‌5లో మొత్తం రెండు రకాల కన్‌సోల్‌లు ఉంటాయి. ఒకటి డిస్క్‌ డ్రైవ్‌తో పీఎస్‌5 ఎడిషన్, ఇంకోటి డిస్క్‌ డ్రైవ్‌తో పీఎస్‌5 డిజిటల్ ఎడిషన్‌. భారత మార్కెట్లో పీఎస్‌5 ఎడిషన్ ధర రూ.49,990, డిజిటల్‌ ఎడిషన్‌ ధర రూ.39,990. అయితే సోనీ ఫస్ట్-పార్టీ యాక్ససరీల విడుదల గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫస్ట్-పార్టీ యాక్ససరీలలో డ్యూయల్ ఛార్జింగ్ స్టేషన్, హెచ్‌డీ కెమెరా, పల్స్‌ 3డీ వైర్‌లెస్‌ హెడ్‌సెట్‌, మీడియా రిమోట్‌, డ్యూయల్‌సీన్‌ వైర్‌లెస్‌ కంట్రోలర్‌లు ఉంటాయి. సోనీ పీఎస్‌ 5 గేమ్‌ సిరీస్‌లో మార్వెల్‌కు చెందిన స్పైడర్‌ మ్యాన్‌: మైల్స్‌ మోరల్స్, డీమోన్స్‌ సౌల్స్‌తో పాటు మరికొన్ని థర్డ్‌ పార్టీ గేమ్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటిలో స్పైడర్‌ మ్యాన్‌ ధర రూ.3,999 కాగా డీమోన్స్ ధర రూ. 4,999. 

సోనీ పీఎస్‌5ని భారత మార్కెట్లోకి గతేడాది నవంబరులో విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌-19 ప్రభావంతో వాయిదా పడింది. దీంతో ముందుగా అనుకున్న తేదీ ప్రకారం అమెరికా, జపాన్‌, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియాలో విడుదల చేశారు. తాజాగా భారత్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించి కొత్త ఏడాదిలో గేమింగ్‌ ప్రియులకు తీపి కబురు చెప్పింది సోనీ కంపెనీ.

ఇవీ చదవండి..

పోల్‌: 2021లో  మొబైల్స్‌ ఎలా ఉండాలి?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీడియో గేమ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని