టెక్‌10: ఇన్‌స్టా కిడ్స్‌.. ఆగిన వాట్సాప్‌

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ మరియు గ్యాడ్జెట్‌ విభాగంలో జరిగిన, వెలువడిన విషయాలు మీ కోసం...

Updated : 22 Mar 2021 14:09 IST


1. చిన్నారుల కోసం కొత్త ‘ఇన్‌స్టా’

యువతను ఆకట్టుకోవడానికి రకరకాల కొత్త ఆప్షన్లు తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌... ఇప్పుడు చిన్నారుల మీద దృష్టిసారించింది. మొన్నటిమొన్న 13 ఏళ్ల లోపు పిల్లల ప్రైవసీని కాపేడేలా ఫాలోయింగ్‌ ఆప్షన్‌లో మార్పులు ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా వారి కోసం కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌నే తయారు చేయబోతోందని వార్తలొస్తున్నాయి. అంటే ‘ఇన్‌స్టాగ్రామ్‌ కిడ్స్‌’ అన్నమాట. ఆరు నుంచి 12 ఏళ్లలోపు వయసున్న పిల్లలు వాడేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌తో ‘మెసెంజర్‌ కిడ్స్‌’ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ‘ఇన్‌స్టా కిడ్స్‌’ ఎప్పుడు వస్తుందనేది తెలియదు.


2. A52, A72 ధరలివే

శాంసంగ్‌ ఇటీవల యూరప్‌ మార్కెట్‌లో గెలాక్సీ ఏ52, ఏ72ను ఆవిష్కరించింది. ఆ మొబైల్‌ మన మార్కెట్‌లోకి కూడా వస్తాయనే విషయం తెలిసిందే. తాజాగా ఈ మొబైల్స్‌ ధరలను సంస్థ ప్రకటించింది. శాంసంగ్‌ ఏ 52... 6 జీబీ/ 128 జీబీ వేరియంట్‌ ధర సుమారు ₹26,499. అదే 8జీబీ/ 128 జీబీ  ధర ₹27,999. ఇక ఏ72 విషయనికొస్తే... 6 జీబీ/ 128 జీబీ వేరియంట్‌ ధర సుమారు ₹34,999. అదే 8జీబీ/ 128 జీబీ ధర ₹37,999.


3. స్క్రీన్‌ రికార్డుకి ‘థ్రెడ్‌ ఇట్‌’

మొబైల్స్‌లో స్క్రీన్‌ రికార్డు చేయడానికి ఇన్‌బిల్ట్‌గా ఆప్షన్‌ ఇస్తున్నారు. ఒకవేళ కొన్ని మొబైల్స్‌లో లేకపోతే... థర్డ్‌ పార్టీ అప్లికేషన్లు ప్లే స్టోర్‌/యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి వాడుకోవచ్చు. అయితే డెస్క్‌టాప్‌ కోసం సరైన అప్లికేషన్లు/సాఫ్ట్‌వేర్లు లేవు. దీంతో గూగుల్‌ కొత్త సర్వీసును లాంచ్‌ చేసింది. ‘థ్రెడ్‌ ఇట్‌’ పేరుతో రూపొందిన ఈ సర్వీసు వెబ్‌సైట్‌, క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ రూపంలో ఇస్తున్నారు. సర్వీసు ఓపెన్‌ చేసి షేర్‌ స్క్రీన్‌ క్లిక్‌ చేయగానే... స్క్రీన్‌ రికార్డు మొదలవుతుంది. రికార్డింగ్‌ పూర్తయ్యాక సెండ్‌ క్లిక్‌ చేస్తే... లింక్‌ రూపంలో ఆ వీడియో సెండ్‌ అవుతుంది.


4. ట్విటర్‌లో యూట్యూబ్‌ చూసేయొచ్చు

ట్విటర్‌లో యూట్యూబ్‌ లింక్‌ ఎవరైనా షేర్‌ చేసినప్పుడు... దానిని క్లిక్‌ చేస్తే మళ్లీ యూట్యూబ్‌లోకి వెళ్లి వీడియో ఓపెన్‌ అవుతుంది. అలా కాకుండా అక్కడే వీడియో ప్లే చేస్తే బాగుంటుంది కదా అనిపించిందా? అయితే మీ మాట ట్విటర్‌ విన్నట్లు ఉంది. ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌ మీద యూట్యూబ్‌ వీడియోలు డైరెక్ట్‌గా ప్లే అయ్యేలా మార్పులు చేస్తోంది. త్వరలో ఐవోఎస్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొంతమంది ఈ ఫీచర్‌ను వినియోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. 


5. వీరికి వాట్సాప్‌ ఆగిపోయింది

పాత తరం మొబైల్స్‌లో వాట్సాప్‌ తన సేవలను క్రమంగా నిలిపేస్తూ వస్తోంది. వాట్సాప్‌ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం ఇకపై వాట్సాప్‌ ఐవోఎస్‌ 10 ఆపై వెర్షన్లకే పని చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌ విషయానికొస్తే... ఆండ్రాయిడ్‌ 4.0.3 తర్వాతి వెర్షన్లకే పని చేస్తుంది. ఐవోఎస్‌ 10 ముందు వెర్షన్లు అంటే... ఐఫోన్‌ 4ఎస్‌ మొబైల్స్‌లో ఇకపై వాట్సాప్‌ పని చేయదు. ఐఫోన్‌ 5 సిరీస్‌ నుంచే వాట్సాప్‌ పని చేస్తుంది. కాయ్‌ ఓఎస్‌లో 2.5.1 తర్వాతి వెర్షన్‌కే వాట్సాప్‌ పని చేస్తుందట. 


6. డైమన్‌సిటీ 1200తో రియల్‌మీ

రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్‌ ఈనెల విడుదల కాబోతోంది. ఈ నెల 31న రియల్‌మీ జీటీ నియోను లాంచ్‌ చేయనున్నారు. ఇందులో మీడియాటెక్‌ కొత్త ప్రాసెసర్‌ డైమన్‌సిటీ 1200 ఉండబోతోందట. ఇది 6 నానో మీటర్‌  సాంకేతికతతో పని చేస్తుంది. ఈ మొబైల్‌లో 6.55 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉండబోతోంది. 4,400 ఎంఏహెచ్‌ డ్యూయల్‌ సెల్‌ బ్యాటరీ ఇస్తారు. 120 హెర్జ్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉండబోతోంది. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉండబోతోంది. 


7. వన్‌ప్లస్‌ నుంచి మరో 5జీ

అఫర్డబుల్‌ ఫ్లాగ్‌షిప్‌ రేంజిలో వన్‌ప్లస్‌ కొత్త 5జీ ఫోన్‌ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందనే విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌ 9ఆర్‌ పేరుతో  తీసుకురాబోతున్నారు. ఈ నెల 23న వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లో రెండు ఫోన్లు వస్తాయని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వచ్చేవి రెండు కాదు, మూడు అని తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో, వన్‌ప్లస్‌ 9ఆర్‌గా మూడు ఫోన్లు వస్తాయట. ఈ మొబైల్‌ స్పెసిఫికేషన్లు బయటకు రాకపోయినా నార్డ్‌ కంటే కాస్త ఎక్కువ ధరలు ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. 


8. ఐఫోన్‌ మినీకి పోటీగా ఆసుస్‌

పెద్ద పెద్ద స్క్రీన్లతో ఫోన్లు వస్తున్న తరుణంలో.. చిన్న స్క్రీన్‌తో వచ్చి వావ్‌ అనిపించింది ‘ఐఫోన్‌ 12 మినీ’. ఐదు అంగుళాల లోపల సైజ్‌ స్క్రీన్‌తో వచ్చిన ఆ మొబైల్‌కు మంచి స్పందనే వచ్చింది. దీంతో శాంసంగ్‌, సోనీ కూడా ఆ తరహా మోడల్స్‌ తీసుకొచ్చాయి. శాంసంగ్‌ నుంచి గెలాక్సీ ఎస్‌ 10ఈ వస్తే, ఎక్స్‌పీరియాలో సోనీ ఓ మొబైల్‌ తెచ్చింది. ఇప్పుడు ఇదే వరుసలో ఆసుస్‌ కూడా ఓ ఫోన్‌తో వస్తోంది. ఫ్లాగ్‌షిప్‌ లెవల్‌లో ఈ మినీ జెన్‌ఫోన్‌ ఉండబోతోందట. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ ఉండబోతోందని సమాచారం. ఇందులో 5.92 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ ఉంటుందట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


9. రెడ్‌మీ కె40 వచ్చేస్తోంది

రెడ్‌మీ నుంచి ఓ కొత్త మొబైల్‌ మన మార్కెట్‌లోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన మరింత సమాచారం బయటికొచ్చింది. చైనా మార్కెట్‌లో విడుదలైన రెడ్‌మీ కె 40ని అదే పేరుతో కాకుండా ఎంఐ 111 ఎక్స్‌ పేరుతో తీసుకొస్తారని సమాచారం. అదే రెడ్‌మీ కె40 ప్రోను అయితే ఎంఐ 11ఐ పేరుతో తీసుకొస్తారట. భారత ఐఎంఈఐ డేటా బేస్‌లో ఈ మొబైల్స్‌ వివరాలు పొందుపరిచారట. రెడ్‌మీ కె 40 కీలక స్పెసిఫికేషన్లు చూస్తే... ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ ఉంటుంది. 6.67 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండొచ్చు. ధర సుమారు ₹23,000 ఉండొచ్చని సమాచారం. 


10. లావా నుంచి మూడు ట్యాబ్‌లు

ఆన్‌లైన్‌ క్లాస్‌ల జోరు ఇంకా కొనసాగుతున్న వేళ లావా కొత్తగా మూడు ట్యాబ్‌లను లాంచ్‌ చేసింది. ₹10 వేల నుంచి మొదలై ₹16 వేల వరకు ఈ ట్యాబ్‌లు లభిస్తాయి. ఇందులో హై ఎండ్‌ వెర్షన్‌ అయిన మాగ్నమ్‌ ఎక్స్‌ఎల్‌లో 10.1 అంగుళాల స్క్రీన్‌, 6,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఓరాలో 8 అంగుళాల డిస్‌ప్లే, 5100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయి. ఐవరీలో 7 అంగుళాల తాకేతెర ఇస్తున్నారు. మాగ్నమ్‌ ఎక్స్‌ఎల్‌ ధర ₹15,499, ఓరా ధర ₹12,999, ఐవరీ ధర ₹9,499.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని