Year Ender 2021: ఈ ఏడాదిలో వాట్సాప్‌ మెరిపించిన ఫీచర్లివే!

ఈ ఏడాది వాట్సాప్‌ తన యూజర్లకు కొన్ని అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చింది. ఆ ఫీచర్ల విశేషాలేంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. వాటిల్లో కొన్ని ఫీచర్లు యూజర్లను బాగా ఆకట్టుకున్నాయి.. అవేంటో ఓ లుక్కేయండి.

Updated : 27 Dec 2021 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్‌ యాప్స్‌ (Messaging Apps) ఎన్ని ఉన్నా.. వాట్సాప్‌కు (WhatsApp) ఉన్న క్రేజే వేరు. దాని రూటే సెపరేటు అన్నట్లుగా.. ఇతర మెసేజింగ్‌ యాప్స్‌ను తలదన్నేలా యూజర్లకు కొత్త ఫీచర్స్‌ తీసుకొస్తూ ఉంటుంది. అలానే ఈ ఏడాది (2021) కూడా ఎన్నో రకాల కొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌కు పరిచయం చేసింది. ఆ ఫీచర్స్‌ గురించి మీరు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. వాటిలో కొన్ని బాగా ప్రాచుర్యం పొందిన ఫీచర్స్‌ విశేషాలు మరోసారి మీకోసం..


​​​​​

ఒకేసారి నాలుగు ఫోన్లలో: గతంలో కేవలం వాట్సాప్‌ యాప్‌తోపాటు వాట్సాప్‌ వెబ్‌లో మాత్రమే లాగిన్ అవ్వటానికి వీలుండేది. మనకు ఏదన్నా అవసరం వచ్చి.. మరో డివైజ్‌లో లాగిన్‌ అవ్వాలంటే ఇంతకుముందు లాగిన్‌ అయిన డివైజ్‌ నుంచి లాగౌట్‌ చేయాల్సి వచ్చేది. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ మల్టీ డివైజ్‌ (Multi Device) ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ లాగిన్ అవ్వొచ్చు. ఆ తర్వాత ప్రైమరీ మొబైల్‌కి ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఒకవేళ వరుసగా 14 రోజులపాటు ప్రైమరీ డివైజ్‌తో ఆ నాలుగు డివైజ్‌లకు కనెక్షన్‌ లేకపోతే వాట్సాప్‌ ఆటోమేటిగ్గా లాగౌట్‌ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.


మిస్ అయినా పర్లేదు..: వెంకటేశ్‌, ప్రియాంక దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీడియోకాల్‌ ద్వారా మాట్లాడుకుంటుంటారు. అప్పుడప్పుడు ప్రియాంక.. తన అత్తమామలు, మరదళ్లతో కలిసి వెంకటేశ్‌కి గ్రూప్‌ వీడియోకాల్‌ (Group Video Call) చేస్తుంటుంది. అప్పుడు అతడు ఏదో పనిలో ఉండి కాల్‌ అటెండ్‌ అయ్యేవాడు కాదు. ఆ తర్వాత కాల్‌లో జాయిన్ కావాలంటే కుదిరేది కాదు. ఈ సమస్యకు వాట్సాప్‌ ఈ ఏడాది పరిష్కారం చూపింది. ఇప్పుడు ఎంచక్కా.. పనిలో ఉండి గ్రూప్‌ కాల్‌ మిస్‌ అయినా, ‘జాయిన్‌ మిస్డ్‌ గ్రూప్‌ కాల్స్‌’ (Join missed group calls) ఫీచర్‌తో.. ఆ గ్రూప్‌ కాల్‌ పూర్తయ్యేలోపల మనం జాయిన్‌ అవ్వొచ్చు. గ్రూప్ కాల్స్​ మిస్‌ కాకుండా ఇది ఎంతో ఉపయోగకరం.


ఇట్టే మాయమైపోతాయ్‌: ఈ మధ్య ఎవరు మాట్లాడాలనుకున్నా వాట్సాప్‌లోనే. ప్రేమికులైతే అసలు చెప్పనవసరం లేదు. గంటల తరబడీ వాట్సాప్‌లోనే చాటింగ్‌ చేసుకుంటుంటారు. గొడవలు కూడా పడుతుంటారు. ఫలితంగా కొన్ని రోజులు మాట్లాడుకోరు. తర్వాత మళ్లీ మామూలే. అయితే కొన్నిసార్లు పాత మెసేజ్‌లు తోడి మరీ గొడవలు పడుతుంటారు. ఈ గొడవలకు వాట్సాప్‌ డిజప్పియరింగ్‌ ఫీచర్‌ (Disappearing Mode) శుభం కార్డు వేస్తుంది. మెసేజ్‌లన్నీ వాటికంతట అవే 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల కాల వ్యవధిలో డిలీట్‌ అయిపోతాయి. మనం ఎంచుకునే ఆప్షన్‌ని బట్టి డిలీటవుతాయి. ఎవరి దగ్గరా ఆ మెసేజ్‌లు ఉండవు. పంపిన వాళ్ల దగ్గరే కాకుండా.. ఎవరికైతే మెసేజ్‌ లేదా మీడియా ఫైల్స్‌ పంపించామో వాళ్ల దగ్గర కూడా మాయమైపోతాయి. ఇకపై చాట్‌ హిస్టరీ కూడా మనం మాన్యువల్‌గా డిలీట్‌ చేసుకోవల్సిన అవసరం ఉండదు.


ఇక్కడే డబ్బులు పంపుకోవచ్చు: ఓ రెండు వేలు ఉంటే ఇవ్వరా.. అని మీ ఫ్రెండ్‌ వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడు. అది చూసి మీరు గూగుల్‌ పే, ఫోన్‌పే లాంటి యాప్‌లు ఓపెన్‌ చేసి డబ్బులు పంపించి ఉంటారు. కానీ వాట్సాప్‌ ఈ ఏడాది మీకు ఆ పనిని మరింత సులువు చేసింది. వాట్సాప్‌లోనే నేరుగా డబ్బులు పంపించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అదే యూపీఐ ట్రాన్స్‌ఫర్‌. పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పేలానే ఇది కూడా పని చేస్తుంది. ఎవరికైనా వాట్సాప్‌ ద్వారా పేమెంట్‌  (WhatsApp Payment) చేయాలంటే సంబంధిత చాట్‌లోకి వెళ్లి.. మెసేజ్‌ బాక్స్‌ పక్కన ఉన్న రూపీ (₹) సింబల్‌ను క్లిక్‌ చేస్తే చాలు. ఆ తర్వాత కావాల్సిన అమౌంట్‌ ఎంటర్‌చేసి... సెండ్‌ కొట్టేయండి. అంతేకాకుండా వాట్సాప్ కెమెరాను ఉపయోగించి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి కూడా నగదును బదిలీ (Money Transfer) చేయొచ్చు. అయితే దీని కోసం ముందుగా మీ వాట్సాప్‌ యూపీఐ పేకి ఏదైనా బ్యాంకు ఖాతాను రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది.


వాట్సాప్‌ డార్క్‌ మోడ్‌: ఈ ఫీచర్‌ రాకముందు రాత్రి పూట వాట్సాప్‌లో ఎక్కువసేపు చాట్‌ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది. డిస్‌ప్లే వైట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కారణంగా బ్యాటరీ కూడా ఎక్కువ ఖర్చయ్యేది. దీంతో వాట్సాప్ కూడా ఇతర మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న డార్క్ మోడ్ (Dark Mode) ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. కళ్లకు ఇబ్బంది లేకుండా, బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఈ డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ నిరోధిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్‌లో థీమ్‌ ఆప్షన్‌కు డార్క్‌ అని సెలక్ట్‌ చేస్తే వాట్సాప్‌ డార్క్‌ మోడ్‌ యాక్టివేట్ అవుతంది.


నాలుగు నుంచి ఎనిమిదికి..: ఈ కాలంలో అందరికీ ఫ్రెండ్‌ సర్కిల్‌ ఎక్కువే. కాలేజీ రోజుల్లో అయితే క్లాసులు అవగానే టీ కొట్టు దగ్గర స్నేహితులంతా కలిసి బాతాఖానీ పెట్టేవాళ్లు. ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరి ఒక్కొక్కళ్లు ఒక్కో ఊర్లో సిర్థపడిపోయారు. ఇప్పుడున్న సాంకేతికతతో గ్రూప్‌ కాలింగ్‌లోనే అందరూ మాట్లాడుకుంటున్నారు. అందులోనూ వాట్సాప్‌నే ఎక్కువ వాడుతుంటారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఎదురయ్యేది. ఒకేసారి నలుగురుకి మించి మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. దీంతో చాలా మంది ఇతర ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించేవారు. దీంతో వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్యను ఎనిమిదికి పెంచింది. దీని వల్ల యూజర్స్‌ ఒకేసారి 8 మంది గ్రూప్ కాలింగ్‌లో (ఆడియో లేదా వీడియో) మాట్లాడుకోవచ్చు. అయితే వాట్సాప్‌లో గ్రూప్‌ కాల్‌ని ఎవరూ రికార్డు చేయలేరు.


​​​​స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌: మొబైల్‌ స్టోరేజ్ మేనేజ్‌మెంట్‌ విషయంలో చాలా మంది తడబడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం వాట్సాప్‌ ‘స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్ టూల్‌’లో (Storage Management) కొన్ని మార్పులు చేసి లేటెస్ట్‌ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇందులో 5MB కన్నా ఎక్కువ సైజ్‌ ఉన్న ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను ముందు వరుసలో చూపిస్తుంది. వాటిలో అవసరంలేని వాటిని డిలీట్ చేసుకుని మెమొరీని సర్దుబాటు చేసుకోవచ్చు. లేదంటే ప్రతి కాంటాక్ట్‌ను ఎంచుకొని అందులో అక్కర్లేని మీడియా ఫైల్స్‌ను డిలీట్ చేసేయొచ్చు.


వాట్సాప్‌ అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ (Search): రోజువారీ పనుల నుంచి ఆఫీస్‌ వర్క్‌ దాక.. ఎందులోనైనా అడ్వాన్స్‌డ్‌గా ఉంటేనే కద మంచి గుర్తింపు వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా వాట్సాప్‌ అడ్వాన్స్‌డ్‌ సెర్చ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో మనం వాట్సాప్ చాట్‌ పేజీ నుంచే కావాల్సిన ఫోటోలు, వీడియోలు, పీడీఎఫ్‌ ఫైల్స్‌ను చాలా సులువుగా వెతుక్కోవచ్చు. క్యాటగిరీ ఆధారంగా ఆయా ఫైల్స్‌ను మాత్రమే ఫిల్టర్‌ చేస్తూ ఈ సెర్చ్‌ ఆప్షన్‌ పని చేస్తుంది. ఫొటోస్‌కి సంబంధించి చూడాలంటే.. ఆ క్యాటగిరీని సెలెక్ట్ చేసి టెక్స్ట్‌తో సెర్చ్‌ చేస్తే, దానికి అనుగుణంగా ఆ ఫొటోలను మన ముందు ఉంచుతుంది. అలానే వీడియోలు, వెబ్‌ లింక్స్‌, జిఫ్స్‌, ఆడియో, డాక్యుమెంట్స్‌ కూడా.


చూడు ఒక్కసారే చూడు: శ్యామ్‌ సరదాగా తీసుకున్న ఫొటోలను ఫ్రెండ్‌తో షేర్‌ చేసుకున్నాడు. అవి కాస్త అటు ఇటు తిరిగి.. ఫ్రెండ్స్‌, కాలేజ్‌ గ్రూప్‌లో వైరల్‌ అయ్యాయి. దీంతో శ్యామ్‌ను, అతడి స్నేహితులు ఆటపట్టించడం మొదలు పెట్టారు. అదే ఫొటో తన ఫ్రెండ్‌ చూసిన వెంటనే డిలీట్‌ అయిపోయివుంటే ఇంత హంగామా జరిగేది కాదు. ఇలాంటివి దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ‘వ్యూ వన్స్‌’ (View Once). దీన్నే సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ మీడియా ఫీచర్‌ అని కూడా అంటారు. మీరు పంపించిన మీడియా ఫైల్స్‌ అవతలి వ్యక్తి చూడగానే డిలీట్‌ అయిపోతాయి. ఈ ఫీచర్ ఆధారంగా మీరు పంపిన ఫొటోలు, వీడియోలు ఇతరులకు షేర్‌ చేయడం, గ్యాలరీలో సేవ్‌ చేసుకోవడం వంటివి కుదరవు. స్క్రీన్‌షాట్‌ తీసుకోవడానికి మాత్రం ఆస్కారం ఉంది.


అపరిచితుల నుంచి ఇక సేఫ్‌..: కొంతమంది మనకు తెలియని వాళ్లు, మనతో వాట్సాప్‌లో ఎప్పుడూ చాట్ చేయనివాళ్లు.. మన లాస్ట్‌ సీన్‌, ఆన్‌లైన్‌ స్టేటస్‌పై నిఘా పెడుతుంటారు. అది మన వ్యక్తిగత గోప్యతకు భంగమే. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న వాట్సాప్ మనకు తెలియనివారికి ఆన్‌లైన్‌ స్టేటస్‌, లాస్ట్‌ సీన్‌ ఫీచర్లు కనిపించనీయకుండా కొత్త ప్రైవసీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండు రకాల పరికరాలకూ అందుబాటులో ఉంటుంది. కొన్ని థర్డ్‌ పార్టీ యాప్‌లు లాస్ట్‌ సీన్‌, ఆన్‌లైన్‌ స్టేటస్‌లను చూడటానికి వాట్సప్‌ యాప్‌ నుంచి సమాచారాన్ని సేకరించే అవకాశముండటంతో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఏదైనా వాట్సప్‌ ఖాతాతో ఇంతకుముందెన్నడూ చాట్‌ చేయనట్టయితే వారికి ఇకపై మన ఆన్‌లైన్‌ స్టేటస్‌ కనిపించదు. దీంతో అపరిచితులకు మన సమాచారం చిక్కకుండా చేసినట్లే.


సమస్య తీరిపోయింది ఇలా: కొత్త ఫోన్ కొన్న‌ప్పుడు ఒక్క సమస్య అందరినీ వేధిస్తుంటుంది. పాత ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌, చాట్‌, ఫోటోలు, వీడియోలు, ఇత‌ర ఫైల్స్‌ను కొత్త ఫోన్‌లోకి బదిలీ చేయ‌డం. కాంటాక్ట్స్ అంటే.. మెయిల్ ద్వారా పంపించుకుంటాం. ఫోటోలు, వీడియోలు అంటే.. డేటా కేబుల్ ద్వారా లేదా ఇత‌ర షేరింగ్ యాప్స్ నుంచి సెండ్‌ చేసుకోవ‌చ్చు. మరి వాట్సాప్ చాట్‌ సంగతేంటి? రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో నడిచేవి అయితే సమస్యే లేదు. కానీ ఒకటి ఆండ్రాయిడ్‌, ఇంకోటి ఐఓఎస్‌ అయితేనే అసలు సమస్య. ఈ సమస్యకూ వాట్సాప్ చెక్‌ పెట్టింది. ఇంపోర్ట్‌ చాట్‌ హిస్టరీ (Import Chat History) తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్స్ ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి సులువుగా చాట్‌ డేటాను బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొద్ది మంది యూజర్స్‌కే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని