Spam Calls: ఒకే నంబర్‌ నుంచి 20 కోట్ల స్పామ్‌ కాల్స్‌..!

భారత్‌లో ఒకే నంబర్‌ నుంచి 20 కోట్ల స్పామ్‌కాల్స్ చేసినట్లు కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్‌ ట్రూకాలర్ వెల్లడించింది. అలానే భారత్‌లో స్కామ్‌కాల్స్‌ తగ్గి, స్పామ్‌కాల్స్ సంఖ్య పెరిగినట్లు తన వార్షిక నివేదికలో తెలిపింది. 

Published : 17 Dec 2021 22:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (truecaller) భారత్‌లో స్పామ్‌కాల్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాదిలో ఒకే ఫోన్ నంబర్‌ నుంచి 202 మిలియన్‌ (సుమారు 20.2 కోట్లకుపైగా) స్పామ్‌కాల్స్‌ (Spam Calls) చేసినట్లు వెల్లడించింది. అంటే ఒక ఫోన్ నంబర్ నుంచి రోజుకు 6 లక్షల 64 వేల మందికి, గంటకి 27 వేల మందికి స్పామ్‌కాల్స్ చేశారని తెలిపింది. 2021 గ్లోబల్‌ స్పామ్‌ రిపోర్ట్‌లో ట్రూకాలర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. 2021 జనవరి నుంచి అక్టోబర్‌ కాలానికి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది.

ట్రూకాలర్‌ వేర్వేరు ప్రాంతాల్లో స్పామ్‌కాలర్స్‌ను గుర్తించి వారి జాబితాను రూపొందిస్తుంది. తర్వాత ట్రూకాలర్‌లోని టెక్నాలజీ సాయంతో వారిని ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తుంది. అయితే ఈ జాబితాలో ఇతర ప్రాంతాల వారికంటే ఎక్కువగా భారత్‌లో ఒకే నంబర్‌ నుంచి 20 కోట్ల స్పామ్‌కాల్స్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. స్పామ్‌కాల్స్‌ బారిన పడుతున్న టాప్‌ 20 దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది. గతేడాది ఈ జాబితాలో భారత్‌ 9వ స్థానంలో ఉండటం గమనార్హం. ఈ సూచీలో ఒక యూజర్‌కు నెలకు 33 స్పామ్‌కాల్స్‌తో బ్రెజిల్ మొదటి స్థానంలో, 18 కాల్స్‌తో పెరూ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం భారత్‌లో ఒక్కో యూజర్‌కు నెలకు 16.8 స్పామ్‌కాల్స్ వస్తున్నాయట. భారతీయ యూజర్స్‌కు వచ్చే స్పామ్‌కాల్స్‌లో 93 శాతం సేల్స్‌, టెలీ మార్కెటింగ్, ఆర్థిక సేవలకు సంబంధించినవి ఉంటున్నాయని ట్రూకాలర్‌ తెలిపింది. 

తగ్గిన స్కామ్‌కాల్స్‌.. పెరిగిన స్పామ్‌కాల్స్‌

ఈ ఏడాది భారత్‌లో స్పామ్‌కాల్స్ సంఖ్య పెరగ్గా.. స్కామ్‌కాల్స్‌ (Scam Calls) సంఖ్య తగ్గినట్లు ట్రూకాలర్‌ వెల్లడించింది. గతేడాది స్కామ్‌కాల్స్‌ 9 శాతం ఉండగా, ఈ ఏడాది 1.4 శాతానికి తగ్గాయట. అయితే దేశంలో యూజర్స్‌కు వచ్చే స్కామ్‌కాల్స్‌లో ఎక్కువగా కేవైసీ (KYC), ఓటీపీ (OTP)ల కోసం చేస్తున్నవే ఉన్నాయని ట్రూకాలర్ పేర్కొంది. ఇవేకాకుండా ఆన్‌లైన్ అమ్మకాలు, లాటరీల వంటి వాటికి సంబంధించిన స్కామ్‌కాల్స్‌ కూడా భారత్‌లో ఎక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ 184.5 బిలియన్‌ కాల్స్‌, 586 బిలియన్ మెసేజ్‌లను గుర్తించి 37.8 బిలియన్ స్పామ్‌కాల్స్‌, 182 బిలియన్ మెసేజ్‌లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. 

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని