Smartphones: కొత్త ఏడాదిలో సరికొత్త ఫోన్లు.. విడుదలకు రెడీ!

కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్‌ను విడుదల చేసేందకు మొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌ నుంచి బడ్జెట్‌ ధరకు వరకు వేర్వేరు మోడల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 

Updated : 02 Jan 2023 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ కంపెనీలకు 2022 గొప్ప సంవత్సరం. ఏఐ, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్, మెటావర్స్‌ వంటి ఎన్నో కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. మొబైల్‌  కంపెనీల విషయానికొస్తే ఎన్నో కొత్త మోడల్స్‌ మార్కెట్లోకి విడుదలయ్యాయి. ముఖ్యంగా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రావడం.. 5జీ ఫోన్‌ అమ్మకాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మరి, 2022 ముగిసి.. 2023లోకి అడుగుపెట్టాం. కొత్త ఏడాదిలో సరికొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు మొబైల్‌ కంపెనీలు సైతం సిద్ధమయ్యాయి. ఇక ఆలస్యం ఎందుకు.. 2023 జనవరి, ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలయ్యే మొబైల్‌ ఫోన్ల (Smartphones) జాబితాపై ఓ లుక్కేయండి.

వివో ఎక్స్‌ 90 సిరీస్‌ (Vivo X90 Series)

ఎక్స్‌ సిరీస్‌లో వివో మరో కొత్త మోడల్‌ను జనవరి చివరి వారంలో విడుదల చేయనుంది. ఎక్స్‌ 90, ఎక్స్‌ 90 ప్రో, ఎక్స్‌ 90 ప్రో+ పేరుతో మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 , మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు. ఎక్స్‌ 90 ప్రో+ వేరియంట్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌లో వెనుకవైపు మూడు కెమెరాలు (48 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 50 ఎంపీ టెలీఫొటో, 64 ఎంపీ), ముందు ఒక కెమెరా (32 ఎంపీ) అమర్చారు. వెనుకవైపు ప్రధాన కెమెరాలో జైసిస్‌ లెన్స్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.  8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌/ 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో తీసుకురానున్నారు. ఈ ఫోన్‌ ధర ₹ 40 వేల నుంచి ₹ 48 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


వన్‌ప్లస్‌ 11 (Oneplus 11)

ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 7న భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌ వెనుక 50 ఎంపీ, 32 ఎంపీ, 48 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 16 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు. 100 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌ ధర ₹50 వేల లోపు ఉంటుందని తెలుస్తోంది. 

ఈ ఫోన్‌తోపాటు వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌లో మరో ఫోన్‌ను జనవరి నాలుగో వారంలో విడుదల చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ3 (Oneplus Nord CE3) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారట. ఇతర వివరాలు తెలియాల్సి వుంది. 


ఐకూ 11 (iQOO 11)

విడుదలకు ముందే ఫీచర్లతో ఆసక్తి కలిగిస్తోంది ఐకూ 11. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌ అని కంపెనీ చెబుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో వీ2 గ్రాఫిక్‌ చిప్‌ను కూడా అమర్చారు. గేమింగ్, ఫొటోగ్రఫీ వల్ల ర్యామ్‌పై పడే అదనపు భారాన్ని ఈ చిప్ తగ్గిస్తుంది. దాంతో ఫోన్‌ మరింత వేగంగా పనిచేస్తుంది. అందుకే ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌గా ఐకూ చెబుతోంది. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో  6.78 అంగుళాల E6 2k అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కేవలం 8నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.  వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ, 13 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలతోపాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. జనవరి 10న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ధర ₹ 45 వేల నుంచి ₹ 50 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.  


శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ (Samsung Galaxy S23 Series)

శాంసంగ్ కంపెనీ ఎస్‌ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23, ఎస్‌23 ప్లస్‌, ఎస్‌23 అల్ట్రా. ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి విడుదలకానుంది. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ ఉపయోగించారు. గెలాక్సీ ఎస్‌23 ప్లస్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 108 ఎంపీ, రెండు 10 ఎంపీ, 12 ఎంపీ కెమెరాలతోపాటు, ముందు 12 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 12 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర ₹ 80 వేలు ఉంటుందని సమాచారం. 


టెక్నో ఫాంటమ్‌ ఎక్స్‌2 (Techno Phanton X2)

జనవరి 2న ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 45 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఫోన్‌లో వెనుక వైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4 జీబీ/ 64 జీబీ, 128 జీబీ, 8 జీబీ/256 జీబీ వేరియంట్లలో పరిచయం చేస్తున్నారు. ఈ ఫోన్‌ ప్రారంభ ధర ₹ 50 వేల లోపు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


రియల్‌మీ జీటీ నియో 5 (Realme GT Neo 5)

రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదలకానుంది. రియల్‌మీ జీటీ నియో 5, జీటీ నియో 5 ప్రో. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉపయోగించారు. రియల్‌మీ జీటీ నియో 5 మోడల్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక, జీటీ నియో 5ప్రోలో 4,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 240 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 144 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్ల ప్రైమరీ కెమెరాల్లో సోనీ ఐఎంఎక్స్‌890 సెన్సర్‌ను ఉపయోగించారు. జనవరి మూడు లేదా నాలుగో వారంలో మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ధర, ఇతర ఫీచర్ల గురించిన వివరాలు తెలియాల్సివుంది.


పొకో ఎఫ్‌5 (Poco F5)

చైనాలో రెడ్‌మీ కె60 పేరుతో, భారత్‌లో పొకో ఎఫ్‌5 పేరుతో జనవరిలో అంతర్జాతీయంగా విడదుల కానుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 67 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 30 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరాలు అమర్చారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. 8 జీబీ/128 జీబీ, 256 జీబీ, 12 జీబీ/256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర ₹ 40 వేలలోపు ఉంటుందని సమాచారం. ఈ ఫోన్‌తోపాటు పొకో ఎక్స్‌ లేదా ఎమ్‌ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ఫీచర్ల గురించిన పూర్తి సమాచారం తెలియాల్సివుంది. 


రియల్‌మీ 10 సిరీస్‌ (Realme 10 Series)

జీటీ నియో 5తోపాటు రియల్‌మీ 10 సిరీస్‌ మోడల్‌ను జనవరిలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మిడ్‌-రేంజ్‌ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. 4 జీబీ/64 జీబీ, 128 జీబీ, 8 జీబీ / 256 జీబీ వేరియంట్లలో లభించనుంది. ఈ ఫోన్‌ ధర ₹ 20 వేలలోపు ఉంటుందని సమాచారం. 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుక 50 ఎంపీ, 2 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 


రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ (Redmi Note 12 సిరీస్‌)

రెడ్‌మీ నోట్ సిరీస్‌లో కొత్త 5జీ ఫోన్‌ను జనవరి 5న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ నోట్‌ 12, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో, నోట్ 12 ప్రో+ ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. నోట్‌ 12 వేరియంట్‌లో వెనుకవైపు 48 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలతోపాటు, ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. నోట్‌ 12 ప్రో మోడల్స్‌లో వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలను అమర్చారు.  నోట్ 12 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్ 1 ప్రాసెసర్‌, ప్రో మోడల్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. బ్యాటరీ సామర్థ్యం, ధర గురించిన సమాచారం తెలియాల్సివుంది.  


జియో ఫోన్‌ 5జీ (Jio Phone 5G)

 

జియో 5జీ ఫోన్‌ను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుల చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ ఫోన్ గీక్‌ బెంచ్‌ లిస్టింగ్‌కు కూడా వచ్చింది.  దాని ప్రకారం ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ప్రగతి ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 480+ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుకవైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలతోపాటు ముందు 8 ఎంపీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర  ₹ 12 వేలలోపు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.  4 జీబీ ర్యామ్‌/ 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్లో లభిస్తుంది. ఈ ఫోన్‌కు గంగా లేదా హోలీ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

వీటితోపాటు ఒప్పో రెనో 9 సిరీస్‌, మోటోరోలా నుంచి మోటో ఎడ్జ్‌ 40 సిరీస్‌ ఫోన్లు విడుదల అవుతాయని సమాచారం. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలియాల్సివుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని