DNA: గాలిలోనూ డీఎన్‌ఏ!

మనం ఎక్కడికి వెళ్లినా అక్కడ మన ఆనవాళ్లను వదిలేస్తాం. మృత చర్మకణాలు, వెంట్రుకలను రాలుస్తాం. దగ్గుతాం, ఉమ్ముతాం.

Updated : 11 Feb 2024 12:27 IST

మనం ఎక్కడికి వెళ్లినా అక్కడ మన ఆనవాళ్లను వదిలేస్తాం. మృత చర్మకణాలు, వెంట్రుకలను రాలుస్తాం. దగ్గుతాం, ఉమ్ముతాం. వ్యర్థాలను విసర్జిస్తాం. వీటి రూపంలో పర్యావరణంలోకి డీఎన్‌ఏనూ వదులుతాం. అంటే సర్వత్రా మానవ డీఎన్‌ఏ  ఉంటుందా? యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా శాస్త్రవేత్తల అధ్యయనం ఇదే నిజమని చెబుతోంది.

న డీఎన్‌ఏ   సముద్రాల్లో,నదుల్లో తేలియాడుతూ ఉండొచ్చు. ఇసుకలో కూరుకొని పోయి ఉండొచ్చు. ఆ మాటకొస్తే గాలిలోనూ ఉండొచ్చు. ఏదో కొద్దిగా కాదు.. ఆయా వ్యక్తులను గుర్తించటానికి అవసరమైనంత పెద్దమొత్తంలోనూ ఉండొచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా అధ్యయనం ఇలాంటి దిగ్భ్రాంతికర విషయాన్నే వెల్లడించింది. తమ విశ్వవిద్యాలయం చుట్టుపక్కల నదుల్లో ప్రజల డీఎన్‌ఏ బయటపడటం తమకే ఆశ్చర్యం కలిగించిందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా కణజాలాలు, ఇతర శరీర సంబంధ పదార్థాల పోచలు పర్యావరణంలో తేలియాడుతూ ఉంటాయి. వీటిని ఎన్విరాన్‌మెంటల్‌ డీఎన్‌ఏ లేదా ఇ-డీఎన్‌ఏ అంటారు. ఇవి ఆయా ప్రాంతాల్లో, జలాల్లో ప్రసరిస్తూ ఉంటాయి. జీవ వైవిధ్యాన్ని, జబ్బుల జాడలను, చొచ్చుకొచ్చే జాతులను గుర్తించటానికి శాస్త్రవేత్తలు వీటిని వాడుకుంటుంటారు. అయితే పర్యావరణంలో మానవ డీఎన్‌ఏనూ సేకరించొచ్చనీ యాదృచ్ఛికంగా బయటపడింది. సముద్ర తాబేళ్లలో వైరల్‌ క్యాన్సర్ల జాడను అన్వేషించటంలో భాగంగా ఇది వెల్లడైంది. మారుమూల ద్వీపాలు, పర్వత శిఖరాల్లో తప్పించి మానవ ఇ-డీఎన్‌ఏను అన్నిచోట్లా గుర్తించటం విచిత్రం. ఇది పెద్దమొత్తంలో ఉండటమే కాకుండా నాణ్యత కూడా మెరుగ్గా ఉంటున్నట్టూ తేలింది. మానవ డీఎన్‌ఏ జాడలను కొన్ని ఇతర అధ్యయనాల్లో గుర్తించినా ఇంత పెద్దమొత్తంలో బయటపడటం ఇదే తొలిసారి. ఆయా వ్యక్తుల పూర్వీకులను, ఆటిజమ్‌ వంటి జన్యు సమస్యలను గుర్తించటానికీ ఇది సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. నేరగాళ్లను పట్టుకోవటానికీ తోడ్పడగలదని భావిస్తున్నారు. అంటే నేరం జరిగిన చోట గాలి ద్వారానూ డీఎన్‌ఏను సేకరించొచ్చన్నమాట. వైద్యం, పర్యావరణం, పురాతత్వ శాస్త్ర పరిశోధనలకూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. ఏదేమైనా ఇ-డీఎన్‌ఏ సేకరణలో అంగీకారం, గోప్యత వంటి వాటిపై ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని