WhatsApp: యూజర్లకు వాట్సాప్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌.. ఎందుకో తెలుసా?

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ యూజర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. వాట్సాప్‌ పేమెంట్ ఫీచర్‌ ద్వారా ఇతరులకు నగదు బదిలీ చేసిన యూజర్లకు మొదటి మూడు లావాదేవీలకు రూ. 35 చొప్పున రూ. 105 నగదు చెల్లింపులు చేసింది.

Published : 11 Jun 2022 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ యూజర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. వాట్సాప్‌ పేమెంట్ ఫీచర్‌ ద్వారా ఇతరులకు నగదు బదిలీ చేసిన యూజర్లకు మొదటి మూడు లావాదేవీలకు రూ. 35 చొప్పున రూ. 105 నగదును క్యాష్‌బ్యాక్‌ రూపంలో అందిస్తోంది. వాట్సాప్‌ పేమెంట్‌ ద్వారా యూజర్లు ఒక రూపాయి మొత్తం ఇతరులకు బదిలీ చేసినా రూ. 35 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల కోసం ఎక్కువ మంది వాట్సాప్‌ పేమెంట్‌ ఉపయోగించేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్‌ అని, ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఇది పనిచేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.  

వాట్సాప్‌ పేమెంట్‌ ఫీచర్‌ను ఉపయోగించేందుకు యూజర్లు వాట్సాప్‌లో పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్లి బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేసి వెరిఫై చేయాలి. తర్వాత మీరు నగదు పంపాలనుకుంటున్న యూజర్‌ను సెలెక్ట్ చేసి సెండ్ పేమెంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి యూపీఐ పిన్‌ నమోదు చేస్తే నగదు బదిలీ అవుతుంది. తర్వాత కొద్దసేపటికే మీ ఖాతాలో రూ. 35 డిపాజిట్ అయినట్లు చూపిస్తుంది.

భారత్‌లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నగదు చెల్లింపు యాప్‌లకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో గతేడాది వాట్సాప్‌ కూడా యాప్‌లో పేమెంట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. అయితే వినియోగదారులు ఎక్కువగా గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి వాటికే మొగ్గు చూపుతుండటంతో వాట్సాప్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని