WhatsApp: ఛాట్స్‌కు ఉన్న భద్రత... ఇప్పుడుకాల్స్‌, స్టేటస్‌లకు కూడా!

వాట్సాప్‌ కాల్స్‌, స్టేటస్‌లకు కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పించనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది.

Updated : 22 Dec 2021 18:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ ఈ ఏడాదిలో తీసుకొచ్చిన కొత్త ఫీచర్స్‌ ఏవంటే.. వాట్సాప్ పేమెంట్స్‌ నుంచి మొదలు పెట్టి గ్రూప్‌ కాలింగ్, వ్యూ వన్స్‌, డిస్‌అప్పియరింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే పదికిపైనే ఉన్నాయి. అయితే వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ పరిచయం చేసిన ప్రతిసారీ డేటా భద్రతపై  యూజర్స్‌ సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను యూజర్స్‌కు మరింత చేరువచేయాలని వాట్సాప్‌ భావిస్తోంది. ఇందుకోసం వాట్సాప్‌లోని మరో రెండు ఫీచర్లకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పించనుంది. ఈ మేరకు వాట్సాప్ యాప్‌లో కాల్స్‌, స్టేటస్‌ సెక్షన్‌లను ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

విజువల్‌ ఇండికేటర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ కాల్స్‌ చేసేందుకు కాల్స్‌ ట్యాబ్‌ ఓపెన్ చేసినప్పుడు, స్టేటస్‌ షేర్‌ చేసేందుకు స్టేటస్‌ ట్యాబ్‌లో మీ పర్సనల్‌ కాల్స్‌, స్టేటస్‌ ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అయ్యాయి అనే మెసేజ్ కనిపిస్తుందని వాబీటాఇన్ఫో తెలిపింది. మెసేజింగ్‌ యాప్‌లలో యూజర్‌ డేటా భద్రత కోసం ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సాంకేతికతను ఉపయోగిస్తాయి. తొలిసారిగా 2016లో వాట్సాప్‌ ఈ సాంకేతికతను చాట్ మెసేజ్‌లకు పరిచయం చేసింది. తర్వాత వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేసే మీడియా ఫైల్స్‌, డాక్యుమెంట్స్‌కు ఈ సాంకేతికతతో భద్రత కల్పించింది. దీనివల్ల మెసేజ్ పంపుతున్న వ్యక్తి, రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి మాత్రమే మెసేజ్‌లను చూడగలరు. వాట్సాప్‌ సైతం వీటిని యాక్సెస్ చేయలేదని చెబుతోంది. ఈ ఏడాదిలో వాట్సాప్ పరిచయం చేసిన వ్యూ వన్స్ ఫీచర్‌కు కూడా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని వాట్సాప్ తెలిపింది. 

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని