WhatsApp: ఒకేసారి ఒకటే ఫోన్‌ నంబర్‌తో రెండు వేర్వేరు మొబైల్స్‌లో వాట్సాప్‌!

ఒకే నంబర్‌తో వాట్సాప్‌ను వేర్వేరు ఫోన్లలో ఎలా ఉపయోగించేలా వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. మరి ఈ ఫీచర్‌ వివరాలపై ఓ లుక్కేద్దామా...

Updated : 08 Jul 2022 19:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ను ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో ఉపయోగించడం ఎలా అని ఎవరినైనా అడిగితే.. మీ నుంచి వచ్చే సమాధానం మల్టీ-డివైజ్‌ ఫీచర్‌. అదే ఒకే నంబర్‌తో వాట్సాప్‌ను వేర్వేరు ఫోన్లలో ఎలా ఉపయోగించాలంటే మాత్రం.. కొత్త ఫీచర్‌ రావాల్సిందే అంటారు. ఇప్పుడు చాలా మంది యూజర్లు కోరుకుంటోంది ఇదే. వాట్సాప్‌ సైతం దీనిపై పనిచేస్తోంది. ఒకేసారి ఒకే ఫోన్‌ నంబర్‌తో వేర్వేరు ఫోన్లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఇప్పటి వరకు ఒకటే వాట్సాప్‌ ఖాతాను మల్టీ-డివైజ్‌ ఫీచర్‌ ద్వారా మొబైల్‌, డెస్క్‌టాప్‌, ట్యాబ్‌ వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. కానీ, రెండు మొబైల్స్‌లో ఒకటే ఫోన్‌ నంబర్‌తో వాట్సాప్‌ ఖాతాను మాత్రం ఉపయోగించలేం. చాలాకాలంగా ఈ ఫీచర్‌ కోసం యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వాట్సాప్ ఈ ఫీచర్‌ కోసం పరీక్షలు ప్రారంభించింది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్ బీటా 2.22.15.13 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌ తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుని ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చు. 

వాట్సాప్‌ మల్టీ-డివైజ్‌ ఫీచర్‌లో భాగంగా ఇదే తరహాలో కంపానియన్‌ మోడ్‌ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌తో ప్రైమరీ ఖాతా నుంచి సెకండరీ డివైజ్‌లో లాగిన్‌ అయిన వెంటనే ప్రైమరీ ఖాతా లాగౌట్‌ అవుతుంది. అందులోని డేటా డిలీట్ అయిపోతుంది. కానీ, వాట్సాప్‌ కొత్తగా తీసుకురానున్న ఫీచర్‌తో ప్రైమరీ డివైజ్‌తోపాటు, సెకండరీ డివైజ్‌లో కూడా వాట్సాప్ యాక్టివ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు చాట్‌, మీడియా ఫైల్స్‌ సింక్‌ అవుతాయని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

ఈ ఏడాదిలో వాట్సాప్‌ ఇప్పటికే మల్టీడివైజ్‌, 2జీబీ ఫైల్‌ షేరింగ్‌, వాయిస్‌ మెసేజ్‌ ఎడిట్‌, డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ టైమ్ లిమిట్, ఎమోజీ రియాక్షన్స్‌, మీడియా ఫైల్‌ ఎడిటింగ్‌, గూగుల్‌ డ్రైవ్‌ బ్యాకప్‌, 32 మందితో గ్రూప్‌ కాలింగ్ అంటూ దాదాపు పదికిపైగా కొత్త ఫీచర్లు పరిచయం చేసింది. ఇదే తరహాలో 2022 చివరినాటికి మరిన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయాలని వాట్సాప్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని