వాట్సాప్‌ చెబుతోంది ఏంటంటే?

వాట్సాప్‌ క్లిక్‌ చేయగానే ఓ బ్యానర్‌ దర్శనమిచ్చింది. దానిని క్లిక్‌ చేస్తే అందులో రెండు పేజీల సమాచారం ఉంది.

Published : 21 Feb 2021 18:01 IST

దిల్లీ: భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వాట్సాప్‌ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రైవసీ విషయంలో వాట్సాప్‌ అనుసరిస్తున్న విధానాలను తెలియజేస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తామని తెలిపింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం వాట్సాప్‌ క్లిక్‌ చేయగానే ఓ బ్యానర్‌ దర్శనమిచ్చింది. దానిని క్లిక్‌ చేస్తే అందులో రెండు పేజీల సమాచారం ఉంది. అందులో వాట్సాప్‌ తన కొత్త గోప్యతా విధానం గురించి మరోసారి వివరించింది. 

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉండటం వల్ల మీ వ్యక్తిగత సంభాషణలు, మాటలను మేం వినలేం. బిజినెస్‌ ఛాట్స్‌ చేసే సమయంలో సులభంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తాం. అయితే అది వినియోగదారుల సమ్మతితోనే’’ అంటూ ఓ ఒక బ్యానర్‌లో రాసుకొచ్చింది వాట్సాప్‌.  మరో పేజీలో ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ ఎలా కలసి పని చేస్తుందనే వివరాలను అందించింది. వినియోగదారులను డేటా, అకౌంట్‌ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను కూడా అందులో పొందుపరిచింది. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత ప్రైవసీలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఈ బ్యానర్స్‌లో ప్రదర్శించింది. అయితే ఈ బ్యానర్స్‌ కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందరి వాట్సాప్‌ యాప్‌లోనూ  ఈ బ్యానర్స్‌ కనిపిస్తాయి. 

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని వారికి మే 15 తర్వాత కూడా ఎప్పటిలానే కాల్స్‌, నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ వాళ్లు మెసేజ్‌లు మాత్రం పంపలేరు. నిజానికి గత నెలలోనే వాట్సాప్ నూతన గోప్యతా విధానాన్ని ప్రకటించింది. దీంతో వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తన నిర్ణయాన్ని మే 15కు వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. మరోవైపు వాట్సాప్ కొత్త నిబంధనలు యూరప్‌లో ఒకలా, భారత్‌లో మరోలా ఉన్నాయని... దీనిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో  ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం, డబ్బు కన్నా వ్యక్తిగత గోప్యతకే ప్రజలు ఎక్కువ విలువిస్తారని, వాట్సాప్ 2, 3 ట్రిలియన్ల విలువ గల కంపెనీ అయినప్పటికీ వ్యక్తిగత గోప్యత అంతకంటే విలువైందని వ్యాఖ్యానించింది. దీనిపై తమ వైఖరి తెలియజేయాలని వాట్సాప్‌కు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ప్రైవసీ పాలసీలో మార్పులను ఉపసంహరించుకోవాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఏకపక్షంగా చేసిన మార్పులు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. 

తాజాగా గోప్యతా విధానంపై వాట్సాప్ వివరణ ఇస్తూ భారతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని కేంద్రానికి తెలిపింది. ''గత కొద్ది రోజులుగా వాట్సాప్ నూతన గోప్యతా విధానంపై అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే దీనిపై మేం అధికారిక ప్రకటన చేశాం. కేవలం వాట్సాప్ బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటాం. అది కూడా యూజర్‌ అనుమతితోనే. వ్యక్తిగతంగా జరిగే సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్‌ ఉంటుంది కాబట్టి వాటిని వాట్సాప్ చదవడం, వినడం చేయలేదు'' అని  స్పష్టం చేసింది. అలానే ఇతర మెసేజింగ్ యాప్‌లపై కూడా వాట్సాప్ స్పందించింది. ‘‘యూజర్స్ ఇతర యాప్స్ ఉపయోగించాలా వద్దా అనేది వారి స్వీయ నిర్ణయం. కానీ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ లేకుండా యూజర్స్ డేటాను చూడట్లేదు అని ప్రచారం చేసే యాప్‌ల గురించి యూజర్స్ ఆలోచించాలి. యూజర్స్ ఎల్లప్పుడూ నమ్మకమైన, భద్రతకు ప్రాధాన్యం ఉన్న యాప్‌లను ఉపయోగించేందుకే మొగ్గు చూపుతారు'' అని వాట్సాప్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని