Xiaomi 12S Ultra: ఈ ఫోన్‌తో ఫొటో/వీడియో తీస్తే డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాతో తీసినట్లే!

యూజర్లకు డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా క్వాలిటీని అందివ్వాలనే ఉద్దేశంతో షావోమి కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. ఇందులో యూజర్‌ తనకు నచ్చిన లెన్స్‌ అటాచ్‌ చేయొచ్చు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎన్ని కెమెరాలుంటాయి? ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం.

Published : 07 Nov 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ కెమెరా సాంకేతికతలో జరుగుతున్న మార్పులతో డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా క్వాలిటీ ఏమాత్రం తీసిపోకుండా.. ఎక్కువ పిక్సల్‌ సామర్థ్యం కలిగిన కెమెరాలతో బడ్జెట్‌ ధరకే ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కెమెరాతోపాటు కాలింగ్, చాటింగ్‌, బ్రౌజింగ్‌ వంటి ఫీచర్లు సైతం ఉండటంతో  సంప్రదాయ కెమెరాలకు బదులు ఎక్కువ మంది మొబైల్ కెమెరాల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే షావోమి కంపెనీ  డీఎస్‌ఎల్‌ఆర్‌ లెన్స్‌ను అమర్చుకునే ఫీచర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది.

షావోమి 12ఎస్‌ అల్ట్రా పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ కెమెరాను మిర్రర్‌లెస్‌ కెమెరాగా మార్చుకోవచ్చు. ఇందులో 50 ఎంపీ, రెండు 48 ఎంపీ కెమెరాలుంటాయి.  వీటిలో ఒకటి సాధారణ మొబైల్ కెమెరాలా ఫోటోలు తీసుకోవచ్చు.  ఫోన్‌కు లైకా ఎమ్‌-సిరస్‌ లెన్స్‌ అమర్చిన తర్వాత మిగిలిన లెన్స్‌ పనిచేస్తాయి. లెన్స్‌ అమర్చిన వెంటనే యూజర్‌ కెమెరా ఫోకల్‌ లెంగ్త్‌ను కూడా మార్చుకోవచ్చు. అంతేకాకుండా, ఐఓఎస్‌, షట్టర్‌ వంటి వాటిని కూడా మార్చకునే వెసులుబాటు ఉంటుంది. లెన్స్‌ అటాచ్‌మెంట్ ఫీచర్‌తో వస్తోన్న ఈ తరహా ఫోన్‌లు భవిష్యత్తులో సాధారణ డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలకు ప్రత్యామ్నాయంగా మారుతాయని టెక్‌ వర్గాల అంచనా. ఇప్పటికే మోటోరోలా సైతం ఇదే తరహాలో అటాచబుల్‌ హాసెల్‌బాల్డ్‌ లెన్స్‌తో మోటో జెడ్‌ సిరీస్‌లో ఫోన్‌ను విడుదల చేసింది. కొంతకాలం తర్వాత ఈ ఫోన్‌ తయారీని నిలిపివేసింది. మరి, షావోమి తీసుకొస్తున్న 12ఎస్‌ అల్ట్రా ఎంత మేరకు యూజర్లు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ ఫోన్‌ ఇతర ఫీచర్లు గురించి తెలియాల్సివుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని