మొబైల్‌ లేకుండానే వాట్సాప్‌.. అయితే!

వాట్సాప్‌ బీటా ప్రోగ్రామ్‌లో చేరితే మొబైల్‌ లేకుండానే వాట్సాప్‌ వెబ్‌ను వాడుకోవచ్చు.

Published : 21 Mar 2021 22:45 IST

బీటా ప్రోగ్రామ్‌ను సిద్ధం చేసిన వాట్సాప్‌

ఇంటర్నెట్‌ డెస్క్: వాట్సాప్‌ వెబ్‌ ఆప్షన్‌ ద్వారా డెస్క్‌టాప్‌ / ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ వాడుకోవడం మనకు తెలిసిన ఆప్షనే. అయితే మొబైల్‌ డేటా/వైఫైకి కనెక్ట్‌ అయి ఉంటనే.. వాట్సాప్‌ వెబ్‌ పని చేస్తుంది. అది కూడా ఒకసారి ఒక సిస్టమ్‌లో మాత్రమే వాట్సాప్‌ వెబ్‌ వాడగలం. అయితే ఈ సమస్య లేకుండా... మల్టీ డివైజ్‌ సపోర్టు తీసుకొస్తామని గతంలోనే వాట్సాప్‌ ప్రకటించింది. ఒకేసారి ఒకటికి మించిన సిస్టమ్స్‌లో వాట్సాప్‌ వాడుకునేలా చేయడమే ఈ మల్టీ డివైజ్‌ సపోర్టు విధానం. ప్రస్తుతం ఈ పనులు చివరి దశకొచ్చినట్లు తెలుస్తోంది. 

వాట్సాప్‌ త్వరలో రాబోయే ఫీచర్లను టెస్టు చేసే వాట్సాప్‌ బీటా ప్రోగ్రామ్‌లో  మల్టీ డివైజ్‌  ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఆ ప్రోగ్రామ్‌లో మీరూ చేరితే మొబైల్‌ లేకుండానే వాట్సాప్‌ వెబ్‌ను వాడుకోవచ్చు. దీని కోసం పెద్ద ప్రక్రియే ఉంది. వెబ్‌ బీటా పేరుతో  వాట్సాప్‌ ఈ ప్రక్రియను నిర్వహించనుంది. ఈ ప్రోగ్రామ్‌ త్వరలో మొదలవుతుంది. అప్పుడు వాట్సాప్‌ ఇచ్చే లింక్‌ ద్వారా బీటా ప్రోగ్రామ్‌లో జాయిన్‌ అవ్వాలి. మీ ప్రవేశాన్ని వాట్సాప్‌ ఆమోదిస్తే.. మీ ఖాతాలో కొన్ని మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా మీ మొబైల్‌కి డేటా/నెట్‌ కనెక్టవిటీ లేకుండా వాట్సాప్‌ వెబ్‌ పని చేస్తుంది. 

వాట్సాప్‌ వెబ్‌ కేవలం ఒక సిస్టమ్‌లో నే కాదు.. ఏకంగా నాలుగు సిస్టమ్స్‌లో  వాడుకోవచ్చు.  అయితే బీటా ప్రోగ్రామ్‌ కావడం వల్ల వాట్సాప్‌ వాడే సమయంలో  మెసేజ్‌ల డిలీట్‌ లాంటి కొన్ని రెగ్యులర్‌ ఫీచర్లు పని చేయవు. తర్వాతి రోజుల్లో ఆ ఫీచర్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తారట. బీటా ప్రోగ్రామ్‌లో చేరాక.. మీరు ఎవరితోనైనా ఛాట్‌ చేయాలన్నా, కాల్స్‌ మాట్లాడాలన్నా అవతలి వ్యక్తి వాట్సాప్‌ లెటెస్ట్‌ వెర్షన్‌ వాడుతుండాలి. ఈ బీటా ప్రోగ్రామ్‌ వాట్సాప్‌, వాట్సాప్‌ బిజినెస్‌కు సపోర్టు చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయి, వాట్సాప్‌కు సంతృప్తికర ఫలితాలు వస్తే అందరూ మొబైల్‌ లేకుండా వాట్సాప్‌ను సిస్టమ్స్‌ వాడుకోవచ్చు.  అంటే లాగిన్‌ అయిన తర్వాత ఆ మొబైల్‌కు కనెక్టివిటీ లేకపోయినా ఫర్వాలేదు అన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు