Telangana News: ప్రభుత్వ టీకా కేంద్రాల్లో బూస్టర్‌ డోస్‌కు అనుమతివ్వండి: హరీశ్‌రావు

ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

Updated : 13 Jun 2022 15:17 IST

హైదరాబాద్: ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్తక్‌ క్యాంపెయిన్-2.0పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, పలు విభాగాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

‘‘తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతివ్వండి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 32 లక్షల కొవిడ్ టీకా డోసులున్నాయి. వాటి ముగింపు తేదీ దగ్గర్లోనే ఉంది. మరోవైపు రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్‌ ఇచ్చేందుకు అనుమతించాలి. రాష్ట్ర వ్యాప్తంగా  కొనసాగుతున్న ఇంటింటికీ టీకా కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల మందికి టీకా అందించాం. 12 ఏళ్లు పైబడిన వారికి.. మొదటి డోసు 104.78 శాతం, రెండో డోసు 99.72 శాతం పంపిణీ చేశాం’’ అని మంత్రి హరీశ్‌ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని