logo

విలవిల్లాడి.. ప్రాణం వీడె..!

అప్పటి దాకా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. పండగ వేళ కోడి కోసే క్రమంలో చేతికి గాయం అయింది. దీంతో పరిచయం ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. భార్యతో కలిసి

Updated : 17 Jan 2022 05:54 IST

భీమన్న

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: అప్పటి దాకా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. పండగ వేళ కోడి కోసే క్రమంలో చేతికి గాయం అయింది. దీంతో పరిచయం ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. భార్యతో కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో రెండు.. మూడు నిమిషాల్లో ఇంటికి చేరేవారు.. కానీ విధి ఏమనుకుందో.. పండగ పూట విషాద రాత రాసింది. పతంగి మాంజా రూపంలో ఆయన ఆయువు తీసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ఎస్సై తైసోద్దిన్‌ తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన భీమన్న(39) పదిహేను సంవత్సరాల క్రితం మంచిర్యాలకు వలస వచ్చాడు. కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భీమన్న శనివారం కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి  సంబరాల్లో పాల్గొన్నాడు. ఇంట్లో కోడి కోస్తుండగా చేతికి కత్తి గాయం అయింది. కట్టుతో పాటు టీటీ ఇంజెక్షన్‌ వేసుకోవాలని భార్య శారదతో కలిసి మేదరివాడలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక రాళ్లవాగు వంతెన దాటే క్రమంలో.. రోడ్డుపక్కనే ముళ్లపొదలో చిక్కిన గాలిపటం చైనా మాంజా భీమన్న మెడకు చుట్టుకుంది. వాహన వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ మాంజా ఆయన మెడను చుట్టూ కోసుకుంటూ వెళ్లింది. పదడుగుల ముందుకు వెళ్లే సరికి మాంజా భీమన్న మెడను పూర్తిస్థాయిలో కోసింది. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న భీమన్నను భార్య శారదతో పాటు స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించే క్రమంలోనే తుదిశ్వాస విడిచాడు. భీమన్న భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తైసోద్దిన్‌ తెలిపారు.  

గ్రామంలో విషాదఛాయలు
గుంజపడుగు(గొల్లపల్లి) : మంచిర్యాల జిల్లాలో చైనా మంజాతో శనివారం జరిగిన ప్రమాదంలో మండలంలోని గుంజపడుగుకు చెందిన భీమన్న(39) మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. భీమన్న చిరు వ్యాపారం చేసుకోవడానికి పలు గ్రామాలు తిరుగుతుంటాడు. ఇలా జీవనోపాధి కోసం వీరి కుటుంబం మంచిర్యాలలో ఉంటోంది. శనివారం జరిగిన ప్రమాదంలో భీమన్న అకాల మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భీమన్న వేలికి గాయమవడంతో ప్రాథమిక చికిత్స చేయించడానికి డాక్టర్‌ వద్దకు వెళ్లామని, బయటకు వెళ్లకుంటే తన భర్త ప్రాణాలతో ఉండేవాడని బాధితుడి భార్య శారద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని