Telangana News: హైదరా‘బాదుడే’

రాజధాని హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్‌ విలువలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ శుక్రవారం తుది ప్రతిపాదనలను రూపొందించింది.

Updated : 29 Jan 2022 06:01 IST

భారీగా పెరగనున్న మార్కెట్‌ విలువలు

స్థలాల ధరల్లో 35% నుంచి 45%

నేటి సాయంత్రంలోగా జిల్లా కమిటీల ఆమోదం

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి

ఈనాడు - హైదరాబాద్‌

రాజధాని హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్‌ విలువలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ శుక్రవారం తుది ప్రతిపాదనలను రూపొందించింది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో భూములు విలువలు, అపార్ట్‌మెంట్‌ల ధరలు భారీగా పెరిగాయి. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గత ఏడాది జులై 22న మార్కెట్‌ విలువలను సవరించగా తాజాగా మరోసారి పెంచారు. శుక్రవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి  జిల్లా రిజిస్ట్రార్‌లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ప్రత్యేకంగా సమావేశమై పెరిగిన మార్కెట్‌ విలువలపై తుది పరిశీలన చేసి ఖరారు చేశారు.

కొత్త మార్కెట్‌ విలువులను కమిటీలు శనివారం సాయంత్రంలోపు ఆమోదించేలా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

600 గ్రామాలపై ప్రత్యేక దృష్టి

పట్టణీకరణ, జాతీయ రహదారులకు ఇరువైపులా, మౌలిక వసతులు బాగా పెరిగిన ప్రాంతాల్లో మార్కెట్‌ విలువల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ జోరుతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న 600కు పైగా గ్రామాలను గుర్తించి అక్కడ మార్కెట్‌ విలువల పెంపును ప్రత్యేకంగా పరిగణించారు. 

* రంగారెడ్డి జిల్లా పరిధిలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ.45,500 నుంచి రూ.61,500కు పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌కు కీలకంగా ఉండే ప్రాంతాల్లో పెరుగుదల భారీగా ఉంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఖాళీ స్థలాల ధరల్లో కనీస పెరుగుదల 35 శాతం ఉండగా క్రయ విక్రయాలు భారీగా జరిగే ప్రాంతాల్లో 40 శాతం... అత్యధిక కొనుగోలు, అమ్మకాలు జరిగే చోట ఇది 45 శాతం కూడా ఉంది. 

* ఎకరం రూ.5 కోట్ల విలువ కలిగిన వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ 50 శాతం పెరగ్గా, రూ.5- 10 కోట్ల మధ్య ఉన్న వాటి ధరలు 20 శాతం హెచ్చినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని