
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే ఆదర్శం: వినోద్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్ జలసౌధలో నిర్వహించిన తెలంగాణ ఇంజినీర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ ఇంజినీర్లు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆర్. విద్యాసాగర్రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని తెలంగాణ ఇంజినీర్స్ డే గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని వినోద్ గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ ఇంజినీర్లు కీలక పాత్రను పోషిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులని వినోద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాటర్ రిసోర్సెస్ సంస్థ చైర్మన్ ప్రకాష్, ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్, ప్రముఖ ఇంజినీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి, జనార్దన్, వీరయ్య, శివాజీ, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.